Puri Jagannadh: ఆ ప్రాజెక్టుపై స్పష్టతనిచ్చిన పూరీ జగన్నాథ్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా తాను రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ షూటింగ్‌ పూర్తయిందని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు.

Published : 06 Feb 2022 21:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’పై (JanaGanaMana) దర్శకుడు పూరీ జగన్నాథ్‌ క్లారిటీ ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తాను రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ (Liger) షూటింగ్‌ పూర్తైన సందర్భంగా ‘జనగణమన’ గురించి మాట్లాడారు. ‘‘లైగర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈరోజుతో జనగణమన’’ అని ఆయన చెప్పిన పాడ్‌కాస్ట్‌ను నటి, నిర్మాత ఛార్మి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌ (#JGM) ను జతచేశారు. పూరీ జగన్నాథ్‌ గతంలోనే ‘జనగణమన’ అనే ప్రాజెక్టును తెరకెక్కించాలని భావించారు. ప్రముఖ నటుడు మహేశ్‌బాబును హీరోగా అనుకున్నారు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్‌’ సూపర్‌హిట్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అప్పట్లో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ, అనివార్య పరిస్థితుల కారణంగా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇటీవల మళ్లీ ఈ సినిమా గురించి చర్చ సాగింది. ‘లైగర్‌’ హీరో విజయ్‌ దేవరకొండతోనే పూరీ జగన్నాథ్‌ ‘జనగణమన’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ టాలీవుడ్‌లో వార్తలొచ్చాయి. మరోవైపు, అసలు ఈ చిత్రం ఉంటుందా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. పూరీ మాటలతో ఇప్పుడు ‘జనగణమన’పై స్పష్టత వచ్చింది. మరి ఈ సినిమాను విజయ్‌ దేవరకొండతోనే చేస్తారా? మరో హీరోతోనా? తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘లైగర్‌’. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలక పాత్ర పోషించారు. విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని