Sukumar: అప్పుడు వణికిపోతుంటే.. రజనీ సర్ కుర్చీ వేసి కూర్చోమన్నారు..!

తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ప్రతీ సినిమాకి తన మార్క్‌ చూపించే సుక్కు తాజాగా ఓ తమిళ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజుల గురించి ముచ్చటించారు.

Updated : 08 Jan 2022 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ప్రతీ సినిమాకి తన మార్క్‌ చూపించే సుక్కు తాజాగా ఓ తమిళ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి విషయాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ అవి రోబో చిత్రం షూటింగ్‌ జరుగుతున్న రోజులు! ఆ షూటింగ్‌కి నేను వెళ్లా. ‘ఆర్య’ చూసిన రజనీ సర్‌.. నన్ను పలకరించడానికి నా దగ్గరకు రాగానే వణకుతూ చేతులు కట్టుకొని ‘సర్‌.. సర్‌’ అనడం మొదలుపెట్టా. నా దగ్గరకు వచ్చి కూర్చొండి అన్నారు. ఆర్యలో హీరోయిన్‌ హెయిర్‌ ఊడుతూ పడిపోయే సీన్‌ బాగుందన్నారు.

ఈలోపు మళ్లీ ఆయన షాట్‌ రెడీ అయ్యింది. ఆయన వెళ్తుంటే లేచి నిలబడ్డా. ఆ తర్వాత మళ్లీ నావద్దకు వచ్చారు. నేను కూర్చోకపోయే సరికి.. ఠక్కున అలావెళ్లి కుర్చీ తీసుకొచ్చి వేశారు. వెంటనే నేను కూర్చున్నా. ఆయన ముందు కూర్చున్నా నిలబడినట్టే ఉంది.  దర్శకుడంటే ఆయనకంత గౌరవం. సూపర్‌ స్టార్‌ అయినా ఒదిగి ఉంటారు. అందుకే ఆయన వ్యక్తిత్వం అందరికీ అలా గుర్తిండిపోతుంది. రజనీ సర్‌.. నాకు కుర్చీ తీసుకొచ్చి వేసి కూర్చొండి.. కూర్చొండి.. అనే విషయం నా లైఫ్‌లో ఓ గోల్డెన్‌ మూమెంట్‌.

ఆ రెండు చిత్రాలు స్పెషల్.. వాటిని రీమేక్‌ చేద్దామనుకున్నా!

2017లో వచ్చిన తమిళ చిత్రం మాధవన్‌- విజయసేతుపతి నటించిన ‘విక్రమ్‌ వేద’ బాగా నచ్చింది. ఆ సమయంలో కాస్త ఖాళీగా ఉన్నా. ‘విక్రమ్‌ వేద’తో ఎవరైనా నా దగ్గరికి వస్తే రీమేక్‌ చేద్దామనుకున్నా. నాకు థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలంటే ఇష్టం. 2018లో వచ్చిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ విష్ణు విశాల్‌- అమలాపాల్‌ చిత్రం ‘రాచసన్‌’ కూడా రీమేక్‌ చేయాలనిపించింది’’ అని సుకుమార్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని