Aadavallu Meeku Johaarlu: సాయి పల్లవిలా ఉండటం కష్టం: సుకుమార్‌

గొప్ప ప్రతిభ, మంచి వ్యక్తిత్వం కలిగిన నటి సాయి పల్లవి అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌.

Published : 27 Feb 2022 22:50 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: గొప్ప ప్రతిభ, మంచి వ్యక్తిత్వం కలిగిన నటి సాయి పల్లవి అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా ఆయన తన మనసులో మాట పంచుకున్నారు. శర్వానంద్‌, రష్మిక జంటగా కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన సినిమా ఇది. మార్చి 4న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం.. సుకుమార్‌, సాయి పల్లవి, కీర్తి సురేశ్‌ ముఖ్య అతిథులుగా వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రష్మిక, సాయి పల్లవి, కీర్తి సురేశ్‌, సమంత.. ఈ నలుగురూ ది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చే హీరోయిన్స్‌. సాయి పల్లవి క్రేజ్‌ చూస్తుంటే ఆమె లేడీ పవన్‌ కల్యాణ్‌లా అనిపిస్తుంది. ఆమె గురించి ఎప్పటి నుంచో చెప్పానుకున్నా కానీ కుదరలేదు. ఒకప్పుడు ఓ వాణిజ్య ప్రకటన తిరస్కరించి, ఆదర్శంగా నిలిచింది. తాను గొప్ప నటే కాదు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈ రంగంలో ఆమెలా ఉండటం చాలా కష్టం. శర్వానంద్‌కి నేను పెద్ద ఫ్యాన్‌. గత కొన్నాళ్లుగా సీరియస్‌ పాత్రల్లో కనిపించాడు. ఈ సినిమాలో మునుపటి నవ్వుల శర్వా కనిపిస్తాడు. కిశోర్‌ తిరుమల సున్నితమైన వ్యక్తి. నాకు ఇష్టమైన దర్శకుడాయన. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అని సుకుమార్‌ ఆకాంక్షించారు.

అతిథిని కాదు: సాయి పల్లవి

‘‘ఇక్కడున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా కుటుంబంలో జరిగే వేడుకలా భావిస్తున్నా. ‘నేను హీరోనైపోయా’ అని శర్వానంద్‌ ఎప్పుడూ అనుకోడు. ఎన్ని మంచి సినిమాలు చేసినా ఇంకా ఏదో సాధించాలనే తపన పడుతుంటాడు. రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తుంది. అందరూ సినిమాను చూడండి. విజయాన్ని అందించండి’’ అని సాయి పల్లవి ప్రేక్షకుల్ని కోరింది.

అదీ ఆయన మార్క్‌: కీర్తి సురేశ్‌

‘‘కిశోర్‌ దర్శకత్వంలోనే నా తొలి చిత్రం (నేను శైలజ) తెరకెక్కింది. ఆయన రాసే కథలు, వేసే పంచ్‌లు అద్భుతంగా ఉంటాయి. టైటిల్‌ క్రెడిట్స్‌లో ఆయన పేరు లేకపోయినా ‘ఇది కిశోర్‌ తిరుమల సినిమా’ అని చెప్పొచ్చు. అంతలా తనదైన మార్క్‌ చూపిస్తారు. ఇక కెరియర్‌ ప్రారంభం నుంచే రష్మిక ‘తగ్గేదేలే’ అని నిరూపిస్తోందని’’ అని కీర్తి సురేశ్‌ పేర్కొంది.

రష్మిక అభిమానిని: ఖుష్బూ

‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నా. ఇంతటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కిశోర్‌ తిరుమలగారికి థ్యాంక్స్‌. శర్వానంద్‌కి తనపై తనకు బాగా నమ్మకం ఉంది. ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోతాడు. ‘గీత గోవిందం’ సినిమాలోని రష్మిక నటన చూసి ఆమెకు అభిమానినయ్యా. ఈ చిత్రంలో ఆమెతో కలిసి నటించటం సంతోషంగా ఉంది. చిత్ర బృందం సమష్టి కృషి వల్లే ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది’’ అని ఖుష్బూ పేర్కొన్నారు. తనను టాలీవుడ్‌కి పరిచయం చేసినందుకు దివంగత నిర్మాత రామానాయుడు, దర్శకుడు రాఘవేంద్రరావుకి ఈ సందర్భంగా ఖుష్బూ కృతజ్ఞతలు తెలిపారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని