Disha Patani: గోవాలో దిశా సందడి

తెలుగు సినిమా ‘లోఫర్‌’తో వెండితెరకు పరిచయమైన నాయిక దిశా పటానీ. ఆ చిత్రం తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఈ తార..వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఎదిగింది. అయితే ఇప్పుడీ భామ మళ్లీ దక్షిణాది చిత్రసీమల వైపు దృష్టి సారించింది

Updated : 24 Sep 2022 13:57 IST

తెలుగు సినిమా ‘లోఫర్‌’తో వెండితెరకు పరిచయమైన నాయిక దిశా పటానీ (Disha Patani). ఆ చిత్రం తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఈ తార..వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఎదిగింది. అయితే ఇప్పుడీ భామ మళ్లీ దక్షిణాది చిత్రసీమల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌)లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సుందరి.. ఇప్పుడు ‘సూర్య 42’వ చిత్రంతో తమిళ తెరకు పరిచయమయ్యేందుకు సిద్ధమైంది. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ - ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. యోగిబాబు, రెడిన్‌ కింగ్సే, కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ షెడ్యూల్‌తోనే చిత్ర సెట్లోకి అడుగు పెట్టింది దిశా. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. సెట్లోని చిన్న వీడియో క్లిప్‌ను పంచుకుంటూ... ‘సూర్యతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన’ని చెప్పింది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగనుందని, ఇందులో భాగంగా సూర్య, దిశాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఓ పరాక్రమశాలి గాథగా రూపొందుతోన్న ఈ చిత్రం.. 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దిశా పటానీ ప్రస్తుతం హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘యోధ’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని