Puri Musings: పెళ్లికి ఆ రూల్‌ పెట్టాల్సిందే!

రోనా మానవజీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో విడాకుల కేసులు సైతం పెరిగిపోతున్నాయి. అసలు ఇలా పెరగడానికి గల కారణాలను జగన్నాథ్‌ తన ‘పూరీ మ్యూజింగ్స్’ లో వివరించారు

Updated : 03 Jun 2021 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  కరోనా మానవజీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లో విడాకుల కేసులు సైతం పెరిగిపోతున్నాయి. అసలు ఇలా పెరగడానికి గల కారణాలను జగన్నాథ్‌ తన ‘పూరీ మ్యూజింగ్స్’ లో వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే విందాం...

‘‘కొత్తగా పెళ్లైన అమ్మాయి-అబ్బాయి మాల్దీవులకు హనీమూన్‌ కోసం వెళ్లారు. మరుసటిరోజు తిరిగి వెళ్లిపోదామనుకునే సరికి కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అయ్యింది. అందమైన.. ఆ ఐలాండ్‌లో ఆ ఇద్దరు నాలుగు నెలలు లాక్‌ అయ్యారు. అంతే, ఆ ట్రిప్‌ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ కరోనా దయవల్ల మన జీవితాల్లో ఏదైతే జరగకూడదో అదే జరిగింది.. రాత్రీపగలు నెలల తరబడి భార్యాభర్తలు కలిసి ఉండాల్సి రావటం. అందుకే గతేడాది నుంచి ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ విడాకులు నమోదయ్యాయి.  పెళ్లిళ్లు ఇలా అర్ధాంతరంగా ముగియడానికి కారణం ఏమిటి? అందులో మొదటిది.. ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఆశించడం. రెండోది స్వేచ్ఛ. యూకేలో అంతకు ముందుకంటే 122 శాతం విడాకులు పెరిగాయి. ఇక చైనా, అమెరికాలో అయితే చెప్పక్కర్లేదు’’

‘‘మిగతా ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో విడాకుల శాతం తక్కువే. కానీ ఇక్కడ కూడా పెరిగాయి. ఇండియాలో ఎక్కువగా విడాకులు తీసుకున్న వారిలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, సిక్కీం, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, కేరళ ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ రోజుకి సగటున 25 విడాకుల కేసులు ఒక్క ముంబయి కోర్టులకే వస్తున్నాయి. ముంబయి, దిల్లీలో ఇటీవల జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు. గోవాలో ఇలాంటి విడాకుల గోల తట్టుకోలేక ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. పెళ్లి చేసుకొనే ముందు అమ్మాయి అబ్బాయి కచ్చితంగా కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఇప్పుడు పెళ్లెందుకు? పెళ్లి అవసరమా? ఇంకోసారి ఆలోచించండి తదితర ప్రశ్నలు వేసుకోవాలి. నిజానికి ఇవి చాలా మంచి రూల్స్‌. ఇలాంటి నిబంధనలు అన్నిచోట్ల రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు పసుపు తాడు కట్టేసి, ఎక్కడపడితే అక్కడ పిల్లలను కనేయడం కరెక్టు  కాదు.  నన్నడిగితే భవిష్యత్తులో ఎలాంటి చట్టం రావాలంటే ‘అమ్మాయి అబ్బాయి కచ్చితంగా ఉద్యోగం చెయ్యాలి. రెండేళ్లు వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటేనే కానీ పెళ్లికి అర్హులు కారు’ అనే రూల్ రావాలి. అలా వస్తే అనవసరపు పెళ్లిళ్లు తగ్గుతాయి’’

‘‘విడాకుల కోసం మనం కోర్టు చుట్టూ ఎలా తిరుగుతున్నామో, పెళ్లి కోసం కూడా కోర్టుల చుట్టూ తిరిగి, కౌన్సెలింగ్‌లు అన్నీ అయ్యాకే వివాహం చేసుకొనే వెసులుబాటు రావాలి. అప్పుడు నిజంగా పెళ్లి కావాలని కోరుకునేవాళ్లే మిగులుతారు. అలా చేస్తే దానంతటదే ఈ విడాకుల గోల తగ్గిపోతుంది. రాబోయో రెండు దశాబ్దాలలో.. ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిన వాళ్లంతా చనిపోతారు. వాళ్లు చనిపోగానే వివాహ వ్యవస్థ అంతా పతనమైపోతుంది. 2040 నాటికి పెళ్లిళ్లు 40 శాతానికి పడిపోతాయి. పెళ్లి మంచిది కాదని మహామహులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. కానీ మనం వినలేదు. చాలామంది ఒంటరితనం భరించలేక పెళ్లి చేసుకుంటారు. ఇది చాలా తప్పు. మీరు ఒంటరితనం భరించలేకపోతే అసలు పెళ్లే చేసుకోవద్దు. ఎందుకంటే పెళ్లయ్యాక అందరూ మళ్లీ ఒంటరివాళ్లవుతారు. మెన్‌ అండ్‌ ఉమన్‌ ఆర్‌ నాట్‌ డిజైన్డ్ ఫర్‌  మ్యారేజ్‌’. అందుకే ఈ కరోనా సమయంలో మొగుడుపెళ్లాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరగంట కంటే ఎక్కువ సమయం మాట్లాడుకోవద్దు. ఏదైనా ఉంటే మీ స్నేహితులతో మాట్లాడుకోండి. ఏ టీవీనో చూస్తూ కూర్చోండి. వాట్సాప్‌తో బిజీగా గడపండి. అటు తిరిగిపడుకోవడం నేర్చుకోండి. బీపీ వస్తే బ్రీత్‌ ఇన్‌.. బ్రీత్‌ అవుట్‌ ఎక్సర్‌సైజ్‌ చేయండి. ఈ కష్టకాలంలో జాగ్రత్తగా ఉండండి. ఓపిగ్గా ఉందాం. మన కాపురాలు నిలబెట్టుకుందాం’’.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని