Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూత

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు (Gautham Raju) (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు...

Updated : 06 Jul 2022 07:26 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు (Gautham Raju) (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 850పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. ‘ఆది’ ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’ ‘అదుర్స్‌’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని