Rashmika: ఒకరోజు ఆ అభిమానిని కలుస్తా!

తనకోసం ఎవరూ సహసాలు చేయవద్దని నటి రష్మిక తన అభిమానులను కోరింది. ఇటీవల ఒక అభిమాని తాను ఎంతగానో ఆరాధించే రష్మికను కలిసేందుకు దాదాపు 900కిలోమీటర్లు ప్రయాణించాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని రష్మిక స్వస్థలం కొడగుకు చేరుకున్నాడు.

Published : 27 Jun 2021 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకోసం ఎవరూ సాహసాలు చేయవద్దని నటి రష్మిక తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల త్రిపాఠి అనే అభిమాని రష్మికను కలిసేందుకు దాదాపు 900కిలోమీటర్లు ప్రయాణించాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని రష్మిక స్వస్థలం కొడగుకు చేరుకున్నాడు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. రష్మిక అక్కడ లేదని, ముంబయిలో ఉంటోందని తెలిసింది. దీంతో అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగాడు. కాగా.. ఈ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. తిరిగితిరిగి చివరకు రష్మికను చేరింది. ఈ సంఘటనపై స్పందించిన రష్మిక తన అభిమానిని కలుసుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయవద్దని కోరింది.

‘‘ఒక వీరాభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఏదో ఒకరోజు కచ్చితంగా కలుస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మీ ప్రేమాభిమానాలు నాపై ఉంచండి. అప్పుడే నేను సంతోషంగా ఉంటా’’ అని రష్మిక ట్వీట్‌ చేసింది.

గతేడాది వచ్చిన ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో రష్మిక దశ తిరిగింది. అదే జోరులో ఈ కన్నడ చిన్నది మరిన్ని సినిమాలకు సంతకాలు చేసింది. ఇప్పుడు బిజీ షెడ్యూల్‌తో తీరికలేకుండా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో పాటు, ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌ బై’ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు ప్లాన్‌ చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని