Tollywood: టాలీవుడ్‌ దర్శకుడి సినిమాలో నటించాలని ఉందంటున్న మాజీ ప్రపంచ సుందరి..

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ (Manushi Chhillar)‌ మరోసారి టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టింది. 

Published : 02 Jan 2023 01:23 IST

హైదరాబాద్‌: ఇటీవల సమ్రాట్‌ పృథ్వీరాజ్‌(Samrat Prithviraj) సినిమాలో తళుకున మెరిసింది మాజీ ప్రపంచసుందరి మానుషి చిల్లర్ (Manushi Chhillar)‌. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా ఈ బ్యూటీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత ఈ భామకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కాయి. ప్రస్తుతం జాన్‌ అబ్రహం(John Abraham)తో కలిసి టెహ్రాన్‌(Tehran) సినిమాలో నటిస్తోంది. తాజాగా తనకు టాలీవుడ్‌ దర్శకుడితో పనిచేయాలని ఉందని చెప్పింది. 

తనకు ఇష్టమైన దర్శకుల గురించి మానుషి మాట్లాడుతూ..‘‘ఫలానా వాళ్ల దర్శకత్వంలో నటిస్తే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. నా విషయానికొస్తే.. నేను చూసిన సినిమా ఏదైనా నాకు నచ్చితే.. ఆ డైరెక్టర్ వెంటనే నాకు ఇష్టమైన దర్శకుల జాబితాలో చేరతారు. ఆయన సినిమాలో నటించాలనిపిస్తుంది. అలా నేను అనుకున్న దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే నాకు డైరెక్టర్‌ రాజమౌళి(Rajamouli) అంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వం బాగుంటుంది. ఆయన సినిమాలో నటించాలని ఉంది.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నాకు చాలా నచ్చింది’’ అని తన మనసులో మాటను మరోసారి బయటపెట్టింది.  అయితే రాజమౌళిపై మానుషి చిల్లర్‌ ప్రశంసలు కురిపించడం ఇదేం తొలిసారి కాదు. సమయం వచ్చినప్పుడల్లా రాజమౌళి(Rajamouli)పై పొగడ్తల వర్షం కురిపిస్తుంటుంది ఈ సుందరి. తనను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో రాజమౌళి ఒకరని ఆయన్ని చూసి ఎంతో స్ఫూర్తిపొందానని గతంలో చెప్పింది. అలాగే సమయం ఉన్నప్పుడల్లా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తానని తెలిపింది. మరి ఈ మాజీ ప్రపంచ సుందరి కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి.

ఇక ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు సరిగా అలరించలేకపోవడంపై స్పందించిన మానుషి..‘ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని కంటెంట్‌ ఉన్న సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. దానికి కారణం కొవిడ్‌ మహమ్మారి. కరోనా కారణంగా కొన్ని మంచి సినిమాలు కూడా హిట్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. కొవిడ్‌కు ముందు మొదలుపెట్టి రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేసేసరికి అవి అంతగా అలరించలేకపోయాయని నేను అనుకుంటున్నాను’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని