Rahul sipligunj-sohel: అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా..: సోహైల్

యూత్‌లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipligunj), సోహైల్‌(Sohel) ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. అందులో వాళ్లు ఎన్నో సరదా విశేషాలు పంచుకున్నారు. 

Updated : 15 Dec 2022 12:07 IST

నాటు పాటలు పాడి రికార్డుల మోత మోగించడంలో రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipligunj) తీరే ప్రత్యేకం. ఇక ఆసక్తికరమైన కంటెంట్‌ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో సోహైల్‌(Sohel) ముందుంటాడు. ట్రెండ్‌కు తగ్గ ఆటపాటలతో అలరిస్తూ యువతకు దగ్గరైన ఈ యువ ప్రతిభావంతులిద్దరూ తమ గురించి.. తమ సినిమాల్లోని ఎన్నో విశేషాల గురించి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారు. మరీ ఆ ఆటపాటల ముచ్చట్లేంటో చూసేద్దామా..!

మీ ఇద్దరికి పరిచయం ఎక్కడ? ఇద్దరూ కలిసి రావడానికి కారణం ఏంటి?

రాహుల్‌ సిప్లిగంజ్‌: మేమిద్దరం ఓ ప్రముఖ రియాలిటీ షోలో పాల్గొన్నాం. అలా పరిచయం. ఆ తర్వాత కూడా మా స్నేహం కొనసాగుతోంది.

సోహైల్: ఆలీ గురించి మీకు ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పాలి. నేను చేసిన సినిమాలో పాత్ర కోసం ఆలీగారిని ఫోన్‌ చేసి అడిగితే రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా చేశారు. నాలాంటి కొత్త వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. రాహుల్‌ గురించి చెప్పాలంటే చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. నేను తనని ‘అన్న’ అని పిలుస్తాను. అంతగా కలిసిపోయాం. సినిమా ప్రపంచం అనేది కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కానీ, అది బ్లాక్‌ అండ్‌ వైట్‌. ఇది క్రియేటివ్‌ ఫీల్డ్‌.. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూనే ఉండాలి.  పోటీ పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఉన్నన్ని రోజులూ కష్టపడుతూనే ఉండాలి. లైఫ్‌ లాంగ్‌ శ్రమించే రంగం ఏదైనా ఉందంటే అది సినిమా ఫీల్డే. 

‘RRR’లో నాటునాటు పాట పాడుతున్నప్పుడే అనుకున్నావా పెద్ద హిట్‌ అవుతుందని?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ‘నాటునాటు’ పాట నేను, కాలభైరవ కలిసి పాడాం. పాడుతున్నప్పుడు కీరవాణి గారు చాలా ట్యూన్స్‌ చేస్తుంటారు. అలా ట్యూన్స్‌కి పాడుతున్నప్పుడు ఈ పాట లిరిక్స్‌ని విని ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ పాట అని అర్థమైంది. ఆ పాట పాడుతున్నప్పుడు ‘ఇది ఫైనల్‌ కాదు.. ట్రాక్‌ మాత్రమే’ అని కీరవాణి గారు చెప్పారు. నేను పాడిన తర్వాత ఏడాదిన్నరకు ఆ పాట రిలీజ్‌ అయింది. నేను పాడిన పాటే ఫైనల్‌ అవుతుందని అప్పటి వరకు తెలీదు.. విచిత్రం ఏంటంటే తెలుగులోనే కాదు.. తమిళ్‌, కన్నడ, హిందీలోనూ నేను పాడిన పాటే సినిమాలో ఉంచారు. తెలుగులో పాడిన తర్వాత వల్లీ మేడం(కీరవాణి సతీమణి) ఫోన్‌ చేసి ఒకసారి తమిళ్ వెర్షన్‌కు కూడా పాడమన్నారు. అలా మిగతా భాషల్లో కూడా ఓకే అయింది. కీరవాణి గారు నాకు ఈ పాట పాడే అవకాశం ఇవ్వడమే పెద్ద  ప్రశంస.

సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? హీరోగా మొదటి సినిమా ఏది?

సోహైల్: చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. అలా వాటికి వెళ్లినప్పుడు షూటింగ్స్‌ చూసేవాడిని. నేను మొదట చూసిన హీరోయిన్‌ తమన్నా. ఇంటర్‌ చదువుతున్నప్పుడు ‘కొత్తబంగారు లోకం’ సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసింది. ఫొటోస్‌ పంపించాను. సైడ్‌ క్యారెక్టర్‌లో నటించడానికి పిలిచారు. అలా నా సినీ ప్రయాణం మొదలైంది. హీరోగా నా తొలి సినిమా ‘మ్యూజిక్‌ మ్యాజిక్‌’ హిట్‌ అవ్వలేదు. ఆ సినిమాకు మా నాన్న.. వాళ్ల ఫ్రెండ్స్‌ను తీసుకొని వెళ్లారు. కానీ, థియేటర్‌లో షో వెయ్యలేదు. చాలా బాధపడ్డా. తర్వాత సీరియల్స్‌లో కూడా నటించా. రియాలిటీ షో వల్ల పేరు వచ్చింది. తాజాగా లక్కీ లక్ష్మణ్‌ అనే సినిమాలో నటించా. అది త్వరలో విడుదలకానుంది. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రంలో నటించాను. రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.

ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నుంచి ఏం నేర్చుకున్నావు?

సోహైల్: క్రమశిక్షణ. ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా వాళ్లు నవ్వుతూ సర్దిచెప్పగలరు. పని విషయంలో నిబద్ధత. షూటింగ్‌ మొత్తం ఒకేలా ఉంటారు. టెన్షన్‌ పడరు. ఎప్పుడు చూసినా నవ్వుతూ సరదాగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలి అని చెబుతుంటారు.

ఇప్పటి వరకు ఎన్ని లవ్‌స్టోరీలు ఉన్నాయి. సింగింగ్‌ కాకుండా ఏం చేస్తావు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నాకు ఎవరు పడతారు సర్‌(నవ్వులు). తాజాగా కృష్ణవంశీ గారి ‘రంగమార్తాండ’ సినిమాలో నటించాను. త్వరలో బిజినెస్‌ మొదలు పెట్టనున్నా. అమెరికాలో హోటల్‌ పెట్టడానికి అన్నీ రెడీ అయ్యాయి. త్వరలోనే స్టార్ట్‌ చేయబోతున్నా. నేను రచ్చ సినిమాలో ‘సింగరేణి ఉంది..’ పాట పాడాను. కానీ, పేరు మాత్రం వేరే సింగర్‌ది ఉంటుంది. దానికి ఓ కారణముంది. సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు నాతో పాడించారు. కానీ, అప్పటికే సీడీలపై పేర్లు ప్రింట్‌ అయ్యాయి.

సోహైల్‌ నీ ప్రేమ సంగతేంటి? నువ్వు చదివిన డిగ్రీ వెనక ఏదో కథ ఉందటగా!?

సోహైల్: 8వ తరగతిలో నేను చిరంజీవి గారి ‘కొడితే కొట్టాలిరా..’ పాటకు డాన్స్‌ వేశా. అప్పుడు ఓ నేపాలీ అమ్మాయి వచ్చి మాట్లాడింది. తనని ఇష్టపడ్డా. నేను అన్ని ఎగ్జామ్స్‌ కాపీ కొట్టి పాస్‌ అయ్యాను. డ్రెస్‌ వెనకాల రాసుకునే వాడిని. అలానే డిగ్రీ పరీక్షలు కూడా పాస్‌ అయ్యాను.   
రాహుల్‌ సిప్లిగంజ్‌: నేను లయోలా స్కూల్‌లో చదివాను. ఇంటర్‌ నారాయణ కాలేజీలో చదివాను. రెండు సంవత్సరాలు చదవడానికి.. మరో రెండేళ్ల పాస్‌ అవ్వడానికి పట్టింది (నవ్వుతూ). అలా ఇంటర్‌కు నాలుగేళ్లు పట్టింది.

మొదట పాడిన పాట ఏది?నీలో సింగర్‌ని గుర్తించింది ఎవరు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నేను మొదటిసారి ‘నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి’ సినిమాలో పాడాను. తర్వాత అనూప్‌ రూబెన్స్‌కు పాడాను. దమ్ము సినిమాలోని పాటకు నాకు సింగర్‌గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈగ, మర్యాదరామన్న, తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఇలా కీరవాణి గారి దగ్గర పాడుతూ వచ్చాను. తాజాగా నాని నటిస్తున్న ‘దసరా’ సినిమాలో పాడాను. నాలో పాటలు పాడాలనే తపన ఉందని మా నాన్న గుర్తించారు. అలా మా తాతగారు ఆయనకు తెలిసిన వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లి సంగీతంలో మెలకువలు నేర్పించారు. 

గూగుల్‌లో చికెన్‌, మటన్‌ అని టైప్‌ చేస్తే నీ పేరు చూపిస్తోందట?

సోహైల్ (నవ్వుతూ)‌: నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు. నేను హాస్టల్‌లో ఉండి చదువుకునేటప్పుడు రోజూ నాన్‌వెజ్‌ పెట్టేవాళ్లు. అక్కడ అలవాటైంది.

ఇంత సరదాగా ఉండే సోహైల్‌కు సూసైడ్‌ చేసుకోవాలని ఎందుకు అనిపించింది?

సోహైల్: నేను చాలా సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడుగుతుండే వాళ్లు. ఎప్పుడు సెటిల్‌ అవుతావు? అని అడిగే వాళ్లు. నాకేమో సినిమాలంటే ఇష్టం.  అప్పటికీ రెండు సినిమాల్లో నటించా కానీ హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లోనేమో ఉద్యోగమంటూ ఒత్తిడి.. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. గవర్నమెంట్‌ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా.. నా గమ్యం ఇది కాదు అని వెనక్కి వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. కానీ, నేను ఇలా ఉండడానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు.   

‘లక్కీ లక్ష్మణ్‌’ సినిమా ఎలా ఉండబోతోంది?

సోహైల్: డిసెంబర్‌ 30న విడుదలవుతుంది. యూత్‌కు కూడా నచ్చే ఫ్యామిలీ సినిమా. కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. పాటలు చాలా బాగున్నాయి. సినిమా బాగుంది.. సోహైల్‌ బాగా చేశాడు అని అనుకుంటే చాలు. ఒక సినిమా విజయం సాధించాలంటే పబ్లిసిటీదే ప్రముఖ పాత్ర.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని