గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు ఏలిన రాజ్యం..

సాధారణ గీతాలు రాయడం ఓ ఎత్తు.. ప్రముఖుల గురించి సాహిత్య రూపంలో చెప్పడం మరో ఎత్తు. జాతిపిత మహాత్మ గాంధీ గురించి చెబుతూ.. ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపడం సవాలుతో కూడుకున్న పనే. వాటిని స్వీకరించి.. గాంధీతత్వాన్ని సినీ సాహిత్యంలో బోధించారు కొందరు గేయ రచయితలు. గాంధీ బాట ఇదని.....

Published : 02 Oct 2020 14:15 IST

సాధారణ గీతాలు రాయడం ఓ ఎత్తు.. ప్రముఖుల గురించి సాహిత్య రూపంలో చెప్పడం మరో ఎత్తు. జాతిపిత మహాత్మ గాంధీ గురించి చెబుతూ.. ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపడం సవాలుతో కూడుకున్న పనే. వాటిని స్వీకరించి.. గాంధీతత్వాన్ని సినీ సాహిత్యంలో బోధించారు కొందరు గేయ రచయితలు. గాంధీ బాట ఇదని తెలుగు ప్రజలకు వివరించి చైతన్యం నింపేందుకు పలువురు తెలుగు నటీనటులు, సంగీత దర్శకులు, దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా.. వెండితెరపై బాపూజీ గొప్పతనం గురించి వచ్చిన తెలుగు చిత్రాల్లోని కొన్ని పాటల్ని స్మరించుకుందాం...

గాంధీ పుట్టిన దేశం..

బాపు గొప్పతనం గురించి చెప్పే పాటల్లో ‘గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు ఏలిన రాజ్యం..’ ప్రముఖంగా నిలుస్తుంది. ‘ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం.. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి’  అని సాగే చరణం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది ఈ పాటలోని ప్రతి పదం మధురమే. మైలవరపు గోపీ సాహిత్యంలో జాలువారిన ఈ స్ఫూర్తి గీతాన్ని సుశీల ఆలపించారు. కోదండపాణి స్వరాలు సమకూర్చారు.

కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ..

శ్రీకాంత్‌ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మహాత్మ’. ఇందులోని ‘రఘుపతి రాఘవ రాజారాం’ అంటూ సాగే  పాట ప్రతి భారతీయుడ్ని ఆలోచింపజేసింది. గాంధీ గొప్పతనాన్ని చాటి చెప్పే గీతాల్లో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ‘గాంధీ అంటే కొందరి సొంతపేరు కాదు, గాంధీ అంటే వీధి పేరు కాదు.. గాంధీ అంటే కరెన్సీ నోటు మీద చూసే బొమ్మ కాదు.. గాంధీ అంటే భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ..’ అని హిత బోధ చేస్తుంది.  సిరివెన్నెల సీతారామశాస్త్రి  సాహిత్యంతో, దివంగత గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో.. ప్రేక్షకుల్లో దేశభక్తి నింపారు.

ఓ బాపూ నువ్వే రావాలి..

ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘శంకర్‌దాదా జిందాబాద్‌’. గాంధీ మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా చిరంజీవి కనిపించి.. స్ఫూర్తినింపారు. ఇందులో ‘ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విధ్వంసాలను ఆపడం ఎవరి తరం కాదు.. అందుకే నువ్వే రావాలి, హింసను నువ్వు మాత్రమే ఆపగలవు.. అందుకే నీ సాయం మళ్లీ కావాలి అని రచయిత సుద్దాల అశోక్‌తేజ చైతన్యవంతమైన సాహిత్యం అందించారు. అదే స్థాయిలో ఈ పాటను ఆలపించి గాంధీపై ప్రేమను పంచుకున్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్‌.

జరుపుతోంది జరుపుతోంది భారతజాతి..

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్‌ కథానాయకుడుగా వచ్చిన చిత్రం ‘నేటి గాంధీ’. ఇందులో గాంధీ జయంతి గురించి చెప్పే ఓ అపూర్వమైన పాట ఉంది. అదే ‘జరుపుతోంది జరుపుతోంది భారతజాతి’. దేశంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందీ పాట. ‘కళ్లను మూయక.. కాళ్లను కదపక.. వీధి వీధిన నిలిచి చూడమంటోంది జాతిపితని.. తను సాధించిన ప్రగతి..మన స్వర్ణ స్వతంత్ర భారతి.. పడతి ఒంటరిగ కనపడితే పగలే నడిరేయవుతుంది.. పశువాంఛలతో బుసకొడుతుంది..’ చరణాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలకు ప్రతిబింబాలు. ఈ పాటలో గాంధీ పుట్టిన రోజు గురించి చెప్తూనే మన మధ్య ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని ఆపడానికి బాపు మళ్లీ జన్మించాలని కథానాయిక రాశీ కోరుకుంటారు. మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి సైతం..

* జగపతి బాబు, ప్రేమ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మా ఆవిడ కలెక్టర్‌.’ ఇందులో జాతీయ జెండాపై ఓ గీతం ఉంది. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీత సారథ్యంలో రూపొందిన పాట. ఇందులో గాంధీ గొప్పతనం కనిపిస్తుంది.

* నందమూరి తారక రామారావు, మోహన్‌ బాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’. ఇందులోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో ‘గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే ధృవతారలు కన్నది ఈ దేశం. గాంధీ గురించి ఇలా రచయిత రాశారు జాలాది రాజారావు...’. కీరవాణి సంగీతం అందించగా బాలు ఆలపించి ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపారు.

* సమకాలిన సామాజిక పరిస్థితులు చూసి బాపు కన్న దేశమేనా ఇది అనే బాధ అందరిలోనూ ఉంటుంది. ఈ విషయాన్నే సాహిత్యంలో వినిపించారు ఆనాటి సినీ కవి. ‘గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది’ అంటూ వచ్చిన ‘పవిత్ర బంధం’లోని ఈ గీతం ఇప్పటికీ ఆలోచింపజేస్తుంది. అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడుగా మధుసూధనరావు తెరకెక్కించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని