ఏపీలో షూటింగ్‌లకు అనుమతిచ్చారు: చిరు

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం

Updated : 13 Sep 2023 16:11 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. జులై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్‌లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చిరు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మంగళవారం సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు.  అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదిరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎం జగన్‌తో వారు చర్చించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో సమావేశం అనంతరం అగ్ర కథానాయకుడు చిరంజీవి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో కలిసి ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నాం. ఇప్పుడు కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే వచ్చాం. రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ రాణించడానికి వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపాం. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. జూన్‌ 15 తర్వాత చిత్రీకరణలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం జగన్‌కు దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు ఆయన్ను కలిశాం. అన్నింటినీ సీఎం జగన్‌ సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందుకు సంబంధించిన విధివిధానాలను మంత్రి నాని, ఇతర అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు’’

‘‘లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతబడి పునః ప్రారంభం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ల మినిమం పవర్‌ టారిఫ్‌లను రద్దు చేయాలని కోరాం. దాని కూడా సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. ఇక గత కొంతకాలంగా నంది అవార్డులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని ప్రతి నటుడు, టెక్నీషియన్‌ కోరుకుంటాడు. దీని కూడా 2019-20 సంబంధించిన అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ వేడుక కూడా ఈ ఏడాదే జరుగుతుందని ఆశిస్తున్నా. అలాగే టికెటింగ్‌లో పారదర్శకత ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు’’

‘‘చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో సినిమాను దాని బట్టి టికెట్‌ ధర పెరుగుతుంది. దీని వల్ల భారీ సినిమాలు తీసే నిర్మాతలకు మేలు జరుగుతుంది. ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం వైఎస్‌ హయాంలో విశాఖలో 300 ఎకరాలను కేటాయించారు. దాన్ని పునః పరిశీలిస్తానని చెప్పారు. ఏపీలో సినిమాలు నిర్మించాలి. అవుట్‌ డోర్‌ యూనిట్లు పెట్టాలనుకునేవాళ్లకు అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలను విని, సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు చిత్ర పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన వెంట మంత్రి పేర్ని నాని, నాగార్జున, రాజమౌళి, సురేశ్‌బాబు, దిల్‌రాజు, సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని