‘మీ త్యాగాలకు మా సెల్యూట్‌’

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లకు యవాత్‌ దేశం కన్నీటి నివాళులర్పిస్తోంది. మాతృభూమి సేవలో జాతి రక్షణ కోసం....

Updated : 17 Jun 2020 15:22 IST

జవాన్లకు సినీ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌: లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లకు దేశం కన్నీటి నివాళులర్పిస్తోంది. మాతృభూమి సేవలో జాతి రక్షణ కోసం ప్రాణాలర్పించిన భరత మాత ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వీర సైనికుడు కర్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు వీర మరణం పొందిన 20 మంది భారత జవాన్లకు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినీప్రముఖులు నివాళులు అర్పించారు.

‘‘భారత్‌-చైనా దళాల మధ్య గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన నన్ను కంటతడి పెట్టించింది. వారు మన దేశాన్ని, ప్రజల్ని కాపాడేందుకు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. భారత జవాన్లకు నా సెల్యూట్‌. జై హింద్‌’’-అమితాబ్

‘‘జవాన్ల మృతి నా మనసును కలచివేసింది. కర్నల్‌ సంతోష్‌ బాబు దేశం కోసం ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని అతని తల్లిదండ్రులు అనడం చాలా గొప్ప విషయం. ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది జవాన్లకు నా ప్రగాఢ సానుభూతి’’: చిరంజీవి

‘‘లద్దాఖ్‌లో భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలుసుకుని నా గుండె బరువెక్కింది. విధుల్లో అమరులైన వారికి నా నివాళి.  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’- హృతిక్‌ రోషన్‌

‘‘గాల్వన్‌ లోయలో మన వీర జవాన్ల మృతి నన్ను ఎంతో బాధించింది. దేశానికి వారు చేసిన అమూల్యమైన సేవలకు మనమంతా ఎప్పుడూ రుణపడి ఉంటాం. అమరవీరులైన జవాన్ల కుటుంబసభ్యులకు నా సంతాపం తెలుపుతున్నా’’- అక్షయ్‌ కుమార్‌

‘‘గాల్వన్‌ లోయలో ధైర్యంగా పోరాడి, అమరవీరులైన జవాన్లకు నా సెల్యూట్‌. మన దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా’’- విక్కీ కౌశల్‌

‘‘2020లో జరుగుతున్న ఘటనలు నా నోట మాట రానివ్వడం లేదు. అమర జవాన్ల కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తుంటే నా హృదయం బద్ధలౌతోంది. ఈ దేశ ప్రజలు మీకు సెల్యూట్‌ చేస్తున్నారు’’- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

‘‘అమర జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదు. వారి త్యాగాలు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సైనికుల ధైర్యానికి, దేశభక్తికి సలాం చేస్తున్నా. జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’: మహేశ్‌ బాబు 

‘‘దేశ సేవలో అమరులైన వీర జవాన్లకు వందనం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’: వెంకటేశ్‌ 

‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన కర్నల్‌ సంతోష్‌ బాబు మృతికి నా ప్రగాఢ సానుభూతి. జై జవాన్‌’’: మంచు విష్ణు

‘‘చైనా అహంకారపూరిత చర్యలపై రక్తం మరిగిపోతోంది. చైనా వస్తువులన్నింటినీ బహిష్కరించాలి. మీ త్యాగాన్ని(సంతోష్ బాబు తల్లిని) ఎప్పటికీ మర్చిపోం. మేమంతా మీతోనే ఉన్నాం.’’ :నిఖిల్‌

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని