‘హాలో..! రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉంది’

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌ కారణంగా చెన్నై పోలీసులు ఉరుకులు పరుగులు

Published : 19 Jun 2020 01:22 IST

చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌ కారణంగా చెన్నై పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గురువారం మధ్యాహ్నం 108 నెంబర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉందని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే హుటాహుటిన గ్రీమ్స్‌ రోడ్డులోని రజనీ ఇంటికి చేరుకున్నారు.  స్నిపర్‌ డాగ్స్‌, మెటల్‌ డిటెక్టర్ల సాయంతో ఆయన ఇంటిని తనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్‌ను అప్రమత్తం చేశారు. 
రజనీ నివాసంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

దీంతో బాంబు ఉందంటూ ప్రాంక్‌కాల్‌ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ రజనీపై ఇలాంటి అబద్ధపు కాల్స్‌ చాలా వచ్చాయి. అప్పుడు కూడా పోలీసులు అప్రమత్తమై ఆయన ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం రజనీకాంత్‌ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కారణంగా ఈసినిమా షూటింగ్‌ వాయిదా పడింది. కీర్తిసురేశ్‌, ఖుష్భూ, మీనా, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్‌ పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. అయితే, లాక్‌డౌన్‌కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోవడంతో, సినిమా విడుదల కూడా మరింత ఆలస్యం కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని