న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్‌

ఏ విషయమైనా న్యాయపరంగా తేల్చుకోవాలని దాసరి అరుణ్‌ అన్నారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అన్నయ్య

Updated : 22 Nov 2022 14:52 IST

హైదరాబాద్‌: ఏ విషయమైనా న్యాయపరంగా తేల్చుకోవాలని దాసరి అరుణ్‌ అన్నారు. కుటుంబ ఆస్తుల వివాదంపై శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా? ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలి. అన్నయ్య, సోదరి, నాకు ఎలాంటి వివాదాల్లేవు. మాది చిన్న కుటుంబం కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అన్నయ్యకు సమస్యలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. మా అన్నయ్య న్యాయపోరాటం చేయవచ్చు.. నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఇంట్లోకి అక్రమంగా వెళ్లలేదు. మా ఇంట్లోకి నేను వెళ్లాను. ఇల్లు మా ముగ్గురిదీ. నేను ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సమస్యను పరిష్కరిస్తామంటే నాకేం అభ్యంతరం లేదు’’ అని అరుణ్‌  తెలిపారు.

తన తండ్రి  సంపాదించిన ఆస్తులు ఎవరికీ విక్రయించలేదని అరుణ్‌ స్పష్టం చేశారు. ఆయన సంపాదించిన ఆస్తుల్లో ఇల్లు కూడా ఒకటని వివరించారు. మా నాన్న కట్టిన ఇల్లు ముగ్గురి పేరిట రాశారు...నా ఇంటి గోడదూకితే తప్పేంటి? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో వివాదాలకు పరిష్కారం చూపే దాసరి కుమారులు రోడ్డెక్కడం బాగోలేదని సినీ పరిశ్రమలో అనుకుంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల వివాదంలో చిరంజీవి, సి.కల్యాణ్, మోహన్‌బాబు పేర్లను ప్రభు ప్రస్తావించడం సరికాదని అరుణ్‌ అన్నారు. 

ఏం జరిగిందంటే..
 ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు ఆస్తుల వ్యవహారం ఆయన కుమారుల మధ్య గొడవకు దారితీసింది. పెద్ద కుమారుడు ప్రభు  తన తమ్ముడిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 46లో దాసరికి ఇల్లు ఉంది. ఇందులో ప్రస్తుతం పెద్ద కుమారుడు ప్రభు కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. గురువారం రాత్రి తన తమ్ముడు అరుణ్‌, మరికొందరు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి హంగామా సృష్టించడమే కాకుండా బెదిరింపులకు దిగినట్లు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువా తీసి అందులోని పత్రాలను తీసుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు. తండ్రి వీలునామా ప్రకారం ఇల్లు తన కుమార్తెకు చెందుతుందని ప్రభు తెలిపారు. తమ కుటుంబ గొడవలు పరిష్కరించాల్సిన వారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారని, చిత్రపరిశ్రమలో చాలా మంది దగ్గరకు వెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సినీపరిశ్రమకు చెందిన మోహన్‌బాబు, మురళీమోహన్‌, సి.కల్యాణ్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని