వాళ్ల ఇష్టమొచ్చినట్లు ఊహించుకుంటారు: నిత్య

తన నటన, అందంతో ఆకట్టుకున్న నటి నిత్యామేనన్‌. గతంలో తన శరీర బరువు విషయంలో ఎంతోమంది నుంచి విమర్శలు

Published : 03 Jul 2020 02:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన నటన, అందంతో ఆకట్టుకున్న నటి నిత్యామేనన్‌. గతంలో తన శరీర బరువు విషయంలో ఎంతోమంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘‘అవును. మీరు తప్పకుండా అలాంటి వారి బారిన పడి ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. నీకన్నా ఎక్కువ బరువు ఉన్న వాళ్ల నుంచి నీకు ఎలాంటి విమర్శలు ఎదురుకావు. అయితే, నీకన్నా సన్నగా ఉన్నవాళ్లే నిన్ను విమర్శిస్తారు. నువ్వు ఎందుకు బరువు పెరుగుతున్నావ్‌? అని ఎవరూ అడగరు. అంతా వాళ్లు ఊహించుకుంటారు. అందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటారు. అంతకన్నా ఎక్కువగానే ఆలోచిస్తారు’’ అని నిత్యామేనన్‌ చెప్పుకొచ్చారు.

తన శరీర బరువు విషయంలో విమర్శలు ఎదురైనప్పుడు తాను ఎదురు ప్రశ్నించలేదని, బాధపడలేదని నిత్య తెలిపారు. ‘అవన్నీ చాలా చిన్నవి. వ్యక్తిగత విషయాలు సమస్యల గురించి ఎలుగెత్తి పోరాటం చేయడాన్ని నేను అంతగా నమ్మను. వీటిని నువ్వే అధిగమించాలి. ఇలాంటి వాటి గురించి ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడను. ఇండస్ట్రీలోని వాళ్లు నా శరీర బరువును చూస్తున్నారా? లేక నన్ను చూస్తున్నారా? అనే విషయాన్ని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. అదే మాట్లాడుతుంది’’ అని నిత్యామేనన్‌ అన్నారు. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం ద్వారా గతేడాది బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన నిత్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన ‘బ్రీత్‌: ఇన్‌ టూ ది షాడోస్‌’ వెబ్ సిరీస్‌ జులై 10న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని