‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ ఇక లేరు..

మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న నృత్యదర్శకురాలు సరోజ్‌ ఖాన్‌(71) ఇక లేరు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన సరోజ్‌ ఖాన్‌ చికిత్స పొందుతూ........

Updated : 03 Jul 2020 09:10 IST

ముంబయి: మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న నృత్యదర్శకురాలు సరోజ్‌ ఖాన్‌(71) ఇక లేరు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె‌ చికిత్స పొందుతూ.. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా సరోజ్‌ ఖాన్‌ ప్రసిద్ధి గాంచారు. 

1974లో ‘గీతా మేరా నామ్‌’ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె ‘మిస్టర్‌ ఇండియా’, నాగినా, చాంద్‌నీ వంటి ప్రముఖ చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. బాలీవుడ్‌ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిన ‘తేజాబ్‌’ చిత్రంలోని ‘ఏక్‌.. దో.. తీన్‌’ పాటకు సరోజ్‌ ఖానే కొరియోగ్రఫీ చేశారు.  హిందీలో వచ్చిన దేవదాస్‌ చిత్రంలోని ‘డోలా రే డోలా’ పాటకు 2003లో, శృంగారం సినిమాలోని అన్ని పాటలకు 2006లో, ‘జబ్‌ వి మెట్‌’లోని ‘యే ఇష్క్‌ హాయే’ గీతానికి 2008లో.. నృత్య రీతులు సమకూర్చినందుకుగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు కూడా అందుకున్నారు.

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయమే సరోజ్‌ఖాన్‌ అంత్యక్రియలు నిర్వహించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని