నాలుగు నందుల 'సొగసు చూడ తరమా' @ 25

నరేశ్‌, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమాకు గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు...

Published : 15 Jul 2020 02:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల ముద్దుముచ్చట్లు, గిల్లికజ్జాలను వెండితెర మీద చూపించిన చిత్రం ‘సొగసు చూడ తరమా’. చిన్న సినిమాగా విడుదలై... పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా నేటి (14/07/2020)తో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. నరేశ్‌, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమాకు గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇది ఆయన తెరకెక్కించిన రెండో సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రానికి ప్రేక్షకుల చప్పట్లే కాకుండా... ప్రభుత్వ ప్రశంసలూ దక్కాయి. 

1995లో విడుదలైన ‘సొగసు చూడ తరమా!’కు ఆ రోజుల్లో మంచి ఆదరణే లభించింది. సినిమాకు నాలుగు నంది పురస్కారాలు దక్కాయి. చిత్రం, స్క్రీన్‌ప్లే, మాటలు, కాస్ట్యూమ్స్‌ విభాగాల్లో నంది పురస్కారాలు లభించాయి.  నరేశ్‌, ఇంద్రజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా ‘లాఠీ’తో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్‌ ఈ సినిమాతో దానిని రెండింతలు చేసుకున్నారనే చెప్పాలి. ఈ సినిమాకు భరద్వాజ్‌ అందించిన పాటలు, సంగీతం అదనపు ఆకర్షణ అందించాయి. ఇప్పటికీ సినిమా టైటిల్‌ ట్రాక్‌ను చాలామంది హమ్‌ చేస్తూనే ఉంటారు. 

"సొగసు చూడ తరమా!' చిన్న చిత్రంగా తీసినా... ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. ప్రేక్షకుల రివార్డ్స్‌తోపాటు ప్రభుత్వ అవార్డ్స్ కూడా అందుకున్నాను. ఈ  సినిమా నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతృప్తిని కలిగించిన స్వీట్ మెమరీ.  సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, పురస్కారాలతో గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ 

- గుణశేఖర్

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని