Romantic: ‘రొమాంటిక్‌’ చూశాక పూరి ఏడ్చారు

‘‘పూరి జగన్నాథ్‌తో ప్రయాణం తర్వాత రచయితగా, దర్శకుడిగా, సాంకేతిక నిపుణుడిగానే కాదు... వ్యక్తిగతంగా నాలో నేను చాలా మార్పుని చూసుకున్నా’’ అన్నారు యువ దర్శకుడు అనిల్‌ పాదూరి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగానికి చెందిన ఈయన,

Updated : 25 Oct 2021 05:54 IST

‘‘పూరి జగన్నాథ్‌తో ప్రయాణం తర్వాత రచయితగా, దర్శకుడిగా, సాంకేతిక నిపుణుడిగానే కాదు... వ్యక్తిగతంగా నాలో నేను చాలా మార్పుని చూసుకున్నా’’ అన్నారు యువ దర్శకుడు అనిల్‌ పాదూరి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగానికి చెందిన ఈయన, ‘రొమాంటిక్‌’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆకాష్‌పూరి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించారు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనిల్‌ పాదూరి హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘దర్శకత్వం చేస్తానని అనుకోలేదు. నేనెవరి దగ్గరా సహాయ దర్శకుడిగా పనిచేయలేదు, ఈ సినిమాకి ముందు సీన్‌ పేపర్‌  పట్టుకున్నది లేదు. పూరి జగన్నాథ్‌, ఛార్మి ప్రోత్సాహంతోనే ‘రొమాంటిక్‌’తో మెగాఫోన్‌ పెట్టా. నేను పెయింటర్‌ని. చిత్రలేఖనంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణించాను. కళలంటే ఇష్టం కావడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చినా కాదనుకుని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలోకి అడుగుపెట్టా. ‘టెంపర్‌’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ నన్ను పూరి జగన్నాథ్‌కి పరిచయం చేశారు. అప్పట్నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నా. చాలాసార్లు ‘నువ్వు దర్శకత్వం చేయ్‌, నీకు ఆ విజన్‌ ఉంది’ అన్నారు పూరి. ‘ఇజం’ జరిగేటప్పుడూ ఒకసారి అన్నారు. అప్పటికి నేనింకా సిద్ధంగా లేను. ఆ తర్వాత మళ్లీ ఒక రోజు పిలిచి ‘రొమాంటిక్‌’ కథ చెప్పి చేయమన్నారు’’.

* ‘‘పేపర్‌పై ఉన్న అక్షరాల్ని, విజువల్‌గా తెరపైకి తీసుకు రావడమనేదే నన్ను బాగా ఆసక్తికి గురిచేసిన అంశం. ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘డార్లింగ్‌’... ఇలా పలు చిత్రాలకి నేను విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేశా. ఒకొక్క దర్శకుడి శైలిని దగ్గరగా గమనిస్తూ ఉండేవాణ్ని. అదే ‘రొమాంటిక్‌’ సినిమాని బాగా చేయడానికి కారణమైంది. నేను, కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ కలిసి అద్విత క్రియేటివ్‌ స్టూడియోస్‌ పేరుతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీని ఏర్పాటు చేశాం. 11 ఏళ్లుగా మా కంపెనీ కొనసాగుతోంది. యాభైకి పైగా సినిమాలు చేశాం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లోనే నన్ను సినిమా చేయమని అడిగారు కల్యాణ్‌రామ్‌. ఇంతలోనే పూరి సర్‌ కథ చెప్పి ‘రొమాంటిక్‌’ చేయమన్నారు. మొదట ఈ కథ ‘సైనోరిటా’ పేరుతో సిద్ధమైంది. పూరి జగన్నాథ్‌ ‘మెహబూబా’ స్థానంలో ఈ కథనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ మొదట దాన్నే చేశారు. ఆ తర్వాత ఆయనే ఈ సినిమా చేయాలనుకున్నారు. ‘రొమాంటిక్‌’గా ఆకాశ్‌తో తీయాలనుకున్నప్పుడు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు’’.

* ‘‘ముళ్లదారిలో వెళితే ముళ్లే గుచ్చుకుంటాయి. అలాంటి దారిలోనే వెళ్లిన ఓ కుర్రాడికి ఏం జరిగింది? మోహానికీ ప్రేమకీ తేడా ఏమిటి? ఓ కుర్రాడు తనది మోహం కాదు, ప్రేమే అనుకున్నప్పుడు ఏం చేశాడనేది ఈ కథ. పూరి స్క్రిప్ట్‌ కాబట్టి కచ్చితంగా ఆయన శైలి ఇందులో కనిపిస్తుంది. ఆయన స్క్రిప్ట్‌ని ఎవరు తీసినా ఆ ప్రభావం కనిపిస్తుందంతే. ఆయన ఎడిట్‌ రూమ్‌లో ఈ సినిమా చూశారు. కాసేపు బయటికెళ్లొచ్చి ఏడ్చారు. ‘‘ఏడిపించేశావ్‌ నువ్వు. నా కథల్లో ఇంత భావోద్వేగాలున్న సినిమా ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’. అందులోనూ ఇంత నిడివి ఉండదు. నువ్వు బాగా చేశావ్‌’’ అని మెచ్చుకున్నారు. ఆ క్షణమే నాకు విజయం అందుకున్నామనే తృప్తి కలిగింది. ఆకాష్‌ మంచి నటుడు. తను భావోద్వేగాలు పలికించడంలో దిట్ట. మిగతా నటులు చేసిన పాత్రలన్నీ గుర్తుండిపోయేలా ఉంటాయి’’.


* ‘‘విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో కొనసాగుతూనే దర్శకత్వం చేస్తా. ప్రస్తుతం పూరి సర్‌ తీస్తున్న ‘లైగర్‌’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు మేమే చేస్తున్నాం. ‘రొమాంటిక్‌’ తీస్తున్న సమయంలోనే కొన్ని కథల్ని సిద్ధం చేసుకున్నా. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో నా తదుపరి సినిమా ఉంటుంది’’.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని