Akhanda: బాక్సాఫీస్‌కి... ‘అఖండ’మైన ఊపు!

సినిమాని ఆస్వాదించడంలో... తారల్ని అభిమానించడంలో... తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అనే మాటల్ని తరచూ వింటుంటాం. కొత్త సినిమా విడుదలైందంటే చాలు... థియేటర్ల దగ్గర ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది....

Updated : 06 Dec 2021 05:16 IST

సినిమాని ఆస్వాదించడంలో... తారల్ని అభిమానించడంలో... తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అనే మాటల్ని తరచూ వింటుంటాం. కొత్త సినిమా విడుదలైందంటే చాలు... థియేటర్ల దగ్గర ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక అది అగ్ర తారల సినిమా అయితే ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. వసూళ్లు... రికార్డులు అంటూ వారం రోజులపాటు అభిమానుల్లోనూ, పరిశ్రమ వర్గాల్లోనూ ప్రత్యేకమైన హంగామా కనిపిస్తుంది. కరోనా దెబ్బతో ఆ జోరు.. హుషారు కనిపించక చాలా రోజులైంది. లాక్‌డౌన్‌లతో చిత్రసీమ కుదేలైంది. కొన్ని సినిమాలు ఏళ్ల తరబడి సెట్స్‌పై ఉండిపోయాయి. ఇక థియేటర్ల ముందుకొచ్చిన వాటి సంగతి సరే సరి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా ‘అఖండ’ తొలి ఆట నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టింది. వసూళ్లతో బాక్సాఫీసుకి ఊపుని తీసుకొచ్చింది.  

రెండో లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ‘అఖండ’నే కావడం... తదుపరి వరుసగా అగ్ర తారల చిత్రాలు వరుసలో ఉండటంతో అందరి దృష్టి బాలయ్యపైనే పడింది. దీంతో బాక్సాఫీస్‌కి మాస్‌ ప్రేక్షకుల తాకిడి పెరగాలని, ఆ ఊపు అలా కొనసాగాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. ‘అఖండ’ ఆ కోరికని నెరవేర్చే పనిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.63 కోట్లకిపైగా గ్రాస్‌ వసూళ్లని సొంతం చేసుకుంది. ఆదివారం హాళ్లు దాదాపుగా హౌస్‌ఫుల్‌ బోర్డులతో రన్‌ అయినట్టు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. పలు ప్రాంతాల్లో బాలకృష్ణ గత సినిమాలు సాధించిన రికార్డుల్ని తుడిచేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పక్కా మాస్‌ సినిమా కావడం, విజయవంతమైన బాలకృష్ణ - బోయపాటి కలయికలో సినిమా కావడం ‘అఖండ’కి కలిసొచ్చింది.  

పెరిగిన భరోసా 

కరోనా భయాలతో థియేటర్‌కి దూరంగా ఉంటున్న ప్రేక్షకులు... ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల సమస్యలు... సీజన్‌... ఇలా చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకుని మొన్నటిదాకా పెద్ద సినిమాల విడుదల శ్రేయస్కరమా? కాదా? అనే మీమాంసతో కనిపించింది చిత్రసీమ. ‘అఖండ’ సాధించిన వసూళ్లు, ప్రేక్షకుల స్పందన ఇప్పుడు చిత్రసీమలో భరోసాని పెంచింది. అందుకే విడుదలకి సిద్ధమైన సినిమాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పోటాపోటీ ప్రచారంతో విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ నెల 17న ‘పుష్ప’, 24న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండూ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నవే. వీటితో పాటు ‘గని’ క్రిస్మస్‌ సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మొదలుకొని సంక్రాంతి సినిమాల జోరు మొదలవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని