పండగ చిత్రం.. పసందైన గీతం

సంక్రాంతి పండగని సినిమా పండగలా చూసే తెలుగు సినీ ప్రేమికులు చాలామందే! అందుకే పెద్ద పండగకి విడుదలయ్యే సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. పండగకి ఎన్ని సినిమాలొస్తే అన్ని చూసేయడం రివాజు. అన్నట్టు పండగంటే కొత్త సినిమాల విడుదలలే కాదు... సెట్స్‌పై ఉన్న కొత్త చిత్రాలకి సంబంధించిన కొత్త ముచ్చట్లు కూడా!

Published : 17 Jan 2022 00:45 IST

సంక్రాంతి పండగని సినిమా పండగలా చూసే తెలుగు సినీ ప్రేమికులు చాలామందే! అందుకే పెద్ద పండగకి విడుదలయ్యే సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. పండగకి ఎన్ని సినిమాలొస్తే అన్ని చూసేయడం రివాజు. అన్నట్టు పండగంటే కొత్త సినిమాల విడుదలలే కాదు... సెట్స్‌పై ఉన్న కొత్త చిత్రాలకి సంబంధించిన కొత్త ముచ్చట్లు కూడా! సంక్రాంతి పండగ సందర్భంగా ఏ సినిమా లుక్‌ విడుదలవుతుందా? ఏ సినిమాలోని పాటలు విడుదలవుతాయా అని ఆసక్తికరంగా చూస్తుంటారు అభిమానులు. ప్రేక్షకుల్ని దృష్టిని ఆకర్షించడానికి దర్శకనిర్మాతలకి కూడా ఇంతకుమించిన సమయం ఇంకేం ఉంటుంది? అందుకే కొత్త లుక్కులు, కొత్త ప్రచార చిత్రాలు, కొత్త పాటల్ని విడుదల చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు. ఈసారి కూడా అంతే. ఇంతకీ ఏయే సినిమాలు ఎలా సందడి చేశాయో ఓ లుక్కేద్దాం...


భీమ్లా హంగామా

పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కథానాయకులుగా నటించిన ‘భీమ్లానాయక్‌’ కొత్త పోస్టర్‌ని పండుగ రోజున విడుదల చేసింది చిత్రబృందం. ఆ చిత్రంలో ఇద్దరు కథానాయకులూ నువ్వా నేనా...అన్నట్టు కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రమిది. నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కథనం, మాటలు సమకూర్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కుటుంబంతో రామారావు

పండగంటేనే కుటుంబం. కుటుంబం అంటేనే పండగ. సంక్రాంతి సందర్భంగా విడుదలైన రామారావు లుక్‌లో కుటుంబంతో కలిసి పండగ సందడిని గుర్తుచేస్తున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌, రాజీషా విజయన్‌ కథానాయికలు. సంక్రాంతి పండగ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. సంప్రదాయబద్ధమైన కట్టు బొట్టుతో సందడి చేశారు నాయకానాయికలు. ఈ చిత్రం వేసవి సందర్భంగా విడుదల కాబోతోంది.  


మీనాచ్చీ తందనానా

శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భళా తందనానా’. కేథరిన్‌, రిచా జోషి నాయికలు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పకులు. మీనాచ్చీ మీనాచ్చీ... అంటూ సాగే ఈ సినిమాలోని పాటని సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ గీతానికి కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించగా, ధనుంజయ్‌ సీపాన ఆలపించారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. శ్రీవిష్ణు ఇదివరకెప్పుడూ కనిపించని ఓ కొత్త రకమైన పాత్రలో కనిపిస్తారు. కేథరిన్‌ కూడా భిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. ‘కె.జి.ఎఫ్‌’తో ఆకట్టుకున్న రామచంద్రరాజు ప్రధాన ప్రతినాయక పాత్రని పోషించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి.


జయమ్మ పాట

ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల ఈ సంక్రాంతికి పాటతో సందడి చేశారు. ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్‌ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. బలగ ప్రకాష్‌ నిర్మాత. ఇందులోని పాటని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ‘కాసింత భోళాతనం... కాసింత జాలిగుణం...’ అంటూ సాగే ఈ పాటలో జయమ్మ పాత్ర, జీవనశైలి ప్రతిబింబిస్తుంది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, శ్రీకృష్ణ ఆలపించారు. ఇందులోని ర్యాప్‌ గీతాన్ని సుమ పాడారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


కుర్రాడు... స్వాతిముత్యం

బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘స్వాతిముత్యం’ టీజర్‌ సంక్రాంతి రోజున విడుదలైంది. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రమిది. వర్ష బొల్లమ్మ కథానాయిక. ప్రచార చిత్రంలో నాయకానాయికల మధ్య సన్నివేశాలు, కుటుంబం నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘స్వాతిముత్యంలాంటి ఓ యువకుడి కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల మధ్య అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది తెరపైనే చూడాలి. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు మనసులకి హత్తుకుంటాయ’’న్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.


మరికొన్ని...

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాలోని నాయకానాయికల లుక్‌ని విడుదల చేశారు. పెళ్లి పీటలపై జోష్‌తో కనిపిస్తోందీ జోడి.


*  పన్నా రాయల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇంటి నెం.13’ టీజర్‌ని విడుదల చేశారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచే చిత్రమిది. మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఓ విభిన్నమైన అనుభూతిని పంచుతుంది. టీజర్‌ విడుదలైన తర్వాత వస్తున్న స్పందన చాలా తృప్తినిచ్చింది’’ అన్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత.



*  సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ‘డిజె టిల్లు’ సంక్రాంతి పోస్టర్‌ని విడుదల చేశారు. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ‘మన్మథలీల’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆదివారం విడుదలైంది. అశోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా నటిస్తుండగా, సంయుక్త హెగ్డే, స్మృతి వెంకట్‌, రియా సుమన్‌ నాయికలు. మురుగానందం నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని