Tollywood: వారసుల తోడుగా.. తెరపై మెరవగా

చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్‌ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్‌ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే

Updated : 21 Jan 2022 07:27 IST

చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్‌ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్‌ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే ఇలాంటి అపురూప కలయికల చిత్రాలు.. త్వరలో అనేకం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడిలా వారసులతో కలిసి సందడి చేయనున్న ఆ తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.

సినీ తారలు తమ నట వారసులతో కలిసి సందడి చేయడం తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలనాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల తరం నుంచి ఇప్పటి చిరంజీవి, నాగార్జునల తరం వరకు అనేక మంది స్టార్లు తమ వారసులతో కలిసి తెర పంచుకున్న వారే. ఈ తరహాలో ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాల్లో ‘మనం’ సినీప్రియులకు ఎంతో ప్రత్యేకంగా    గుర్తుండిపోయింది. ఈ సినిమాలో  ఏయన్నార్‌ ఒకేసారి ఇటు తనయుడు నాగార్జునతోను, అటు మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌లతోనూ కలిసి సందడి చేసి మెప్పించారు. అలాగే కథానాయకుడు నాగార్జున ఇటీవల తన తనయుడు నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’లో నటించారు. 


చిరు.. చిరుతల సందడి..

‘బంగార్రాజు’ లాంటి మ్యాజిక్‌నే ‘ఆచార్య’తో చేసి చూపించనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన తొలి చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కించారు.  నిజానికి ఈ సినిమా కన్నా ముందు ‘మగధీర’, ‘బ్రూస్‌లీ’ వంటి చిత్రాల్లో చరణ్‌తో కలిసి తెరపై కనిపించారు చిరు. అవన్నీ అతిథి పాత్రలే. పూర్తి స్థాయిలో కలిసి నటించింది లేదు. ఎట్టకేలకు ‘ఆచార్య’ ద్వారా ఇన్నాళ్లకు ఈ తండ్రీ కొడుకులిద్దర్ని పూర్తిస్థాయిలో తెరపై చూసుకునే అవకాశం దొరికింది ప్రేక్షకులకు. వాస్తవానికి ఇందులో  చరణ్‌ది కీలక పాత్రే అయినా.. కథ పరంగా ఎంతో ప్రాధాన్యముంది. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఈ తండ్రీ తనయులిద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో చిరు టైటిల్‌ పాత్రలో కనిపించనుండగా.. సిద్ధ పాత్రలో చరణ్‌ దర్శనమిస్తారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


రెబల్‌ కాంబినేషన్‌..

కృష్ణంరాజు నట వారసుడిగా వెండితెరకు పరిచయమై.. అనతి కాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్‌. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆయన ఇప్పటికే ‘బిల్లా’, ‘రెబల్‌’ వంటి చిత్రాల్లో తన పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ రెబల్‌ హీరోలిద్దరూ ముచ్చటగా మూడోసారి ‘రాధేశ్యామ్‌’లో కలిసి కనువిందు చేయనున్నారు. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్‌ కనిపించనుండగా.. పరమహంస అనే ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు సందడి చేయనున్నారు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ పాన్‌ ఇండియా సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. త్వరలో కొత్త విడుదల తేదీపై స్పష్టత రానుంది.


ఓటీటీ వేదికపై.. బాబాయ్‌ అబ్బాయ్‌

గ్గుబాటి హీరోలు వెంకటేష్‌, రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కోరిక. ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ఈ బాబాయ్‌ అబ్బాయ్‌ల క్రేజీ కాంబినేషన్‌.. ‘రానా నాయుడు’ రూపంలో కార్యరూపం దాల్చింది. అయితే ఇది వెండితెరపై సందడి చేసే చిత్రం కాదు.. ఓటీటీ వేదికగా అలరించనున్న వెబ్‌సిరీస్‌. విభిన్నమైన యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్‌.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఎంతో ప్రాచుర్యం పొందిన అమెరికన్‌ షో ‘రే డోనోవన్‌’ షో ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. కరన్‌ అన్షుమన్‌, సుపర్న్‌ వర్మ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.


తండ్రీ కొడుకుల ‘మహాన్‌’

‘అపరిచితుడు’, ‘శివ పుత్రుడు’, ‘ఐ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు విక్రమ్‌. ఆయన తన తనయుడు ధ్రువ్‌ ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌తో వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తండ్రీ కొడుకులిద్దరూ తొలిసారి ‘మహాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. గ్యాంగ్‌స్టర్స్‌ మధ్య సాగే ప్రతీకార కథగా ఉంటుంది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


తనయతో.. రాజ‘శేఖర్‌’..

థానాయకుడిగా తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు రాజశేఖర్‌. ఇప్పుడాయన తొలిసారి తెరపై తన తనయ శివానీ రాజశేఖర్‌తో కలిసి నిజ జీవిత పాత్రలో సందడి చేయనున్నారు. మరి ఈ తండ్రీ కూతుళ్ల అల్లరి వెండితెరపై ఎలా ఉండనుందో తెలియాలంటే ‘శేఖర్‌’ విడుదల వరకు వేచి చూడాల్సిందే. రాజశేఖర్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జీవితా రాజశేఖర్‌ తెరకెక్కించారు. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో రాజశేఖర్‌, శివాని తండ్రితనయలుగా నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని