Padma Shri: నటనలో ‘షావుకారు’ సాయంలో ‘చిలకమ్మా మజాకా’

సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమందే. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం ‘షావుకారు’ జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో కథా  నాయికగా, క్యారెక్టర్‌ నటిగా గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా కళారంగానికి చేసిన సేవలకిగానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated : 26 Jan 2022 07:23 IST

పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన కేంద్రం

సాయంలో ‘చిలకమ్మా మజాకా’ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన కేంద్రం సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమందే. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం  ‘షావుకారు’ జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో కథా నాయికగా, క్యారెక్టర్‌ నటిగా గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా కళారంగానికి చేసిన సేవలకిగానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ‘షావుకారు’ జానకిగా ఎన్నటికీ  చెరిగిపోని స్థానాన్ని సంపాదించారు. తమిళ ప్రేక్షకులకు    సౌకార్‌గా సుపరిచితం అయ్యారు. జానకి వయసు 90 ఏళ్లు. అందులో నట జీవితమే 70 ఏళ్లుపైనే. వెండితెర చూసిన ఎన్నో మలుపులకి ఆమె సాక్ష్యం. ఎన్నో తరాలకి ఆమె స్ఫూర్తి. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు. ఎన్టీఆర్‌,   ఏఎన్నార్‌, శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌, ఎంజీఆర్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి తొలి  అడుగులు వేసిన ఘనత ఆమెది. ‘చిలకమ్మా... మజాకా’ అంటూ ఆమె చెప్పిన డైలాగులను 1987-90ల మధ్యకాలంలోని సినీ ప్రియులెవరూ మరచిపోలేరు. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలోలాగే ముక్కుసూటిగా మాట్లాడడం... పదిమందికి సాయంగా నిలవడం జానకి నైజం అని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి.

మలి అవకాశంతో...

షావుకారు జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి. 1931 డిసెంబర్‌ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురంలో సచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకి జన్మించారు. కథానాయిక కృష్ణకుమారి జానకికి స్వయానా చెల్లెలు. తండ్రి ఉద్యోగం రీత్యా వీళ్ల బాల్యమంతా బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో గడిచింది. ఆ తర్వాత తండ్రి ఆంధ్రా పేపర్‌ మిల్స్‌లో పని చేయడం కోసం రాజమహేంద్రవరం చేరుకోవడంతో అక్కడే అక్కాచెల్లెళ్లు వేదాంతం జగన్నాథశర్మ దగ్గర కూచిపూడి నాట్యశాస్త్రాన్ని  అభ్యసించారు. వీరి కుటుంబం మద్రాసుకి మకాం మారాకా నాట్యరంగంలో కొనసాగారు. జానకి రేడియో నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. ఆ సమయంలోనే దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి దృష్టిలో పడ్డారు. తాను తీయాలనుకున్న ‘స్వర్గసీమ’ కోసం ఆమెని కథానాయికగా ఎంపిక చేయాలనుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆమె ఆగిపోయారు. పదిహేనో ఏటే ఆమెకి పెళ్లి చేశారు. చిన్న వయసులోనే బిడ్డకి  తల్లయిన జానకి భర్తతో కలిసి అస్సాం వెళ్లారు. ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైన ఆమె భర్తతో కలిసి మళ్లీ మద్రాసు చేరుకున్నారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు బి.ఎన్‌.రెడ్డిని కలిశారు. కానీ అప్పటికే ఆయన ‘స్వర్గసీమ’ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆయన సూచనతోనే నాగిరెడ్డి - చక్రపాణిని కలిసిన జానకి వారు తీయాలనుకున్న ‘షావుకారు’లో కథానాయికగా    అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కథానాయకుడిగా నటించిన ఎన్టీఆర్‌కి అది రెండో సినిమానే. సున్నం రంగడి పాత్ర పోషించిన ఎస్వీ రంగారావుకూ అది రెండో చిత్రమే. పదిహేడేళ్ల వయసులో కథానాయిక సుబ్బులు పాత్రలో ‘షావుకారు’లో నటించారు జానకి. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం తర్వాత జానకి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె చేసిన తొలి చిత్రమే ఇంటి పేరు కావడం విశేషం.

అన్నీ మంచి శకునములే...

తెలుగు ప్రేక్షకులకే కాదు, తమిళ ప్రేక్షకులకూ అభిమాన నటి అయ్యారు జానకి. ‘సవతిపోరు’, ‘పిచ్చి పుల్లయ్య’, ‘వద్దంటే డబ్బు’, ‘రోజులు మారాయి’, ‘రైతు బిడ్డ’... ఇలా  తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. 1955లో ఆమె పలు భాషల్లో ఏకంగా 11 సినిమాల్లో నటించి బిజీ కథానాయికగా మారారు. ‘చెరపకురా చెడేవు’, ‘కన్యాశుల్కం’, ‘సొంత వూరు’, ‘చరణదాసి’, ‘ఏది నిజం’, జయం మనదే’, ‘భాగ్యరేఖ’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి మరింతగా చేరువయ్యారు.

* 1960 - 62 మధ్య కాలంలో తమిళంలోనే ఎక్కువగా   సినిమాలు చేశారు. ఆ తర్వాత సహాయ పాత్రల్లోనే ఎక్కువగా మెరిశారు. 1981లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తిళ్లు ముళ్ళు’ సినిమాలో మీనాక్షి అనే ఓ కామెడీ పాత్రలో జానకి అలరించారు. తమిళంలోనే ‘తంబి’ అనే చిత్రంలోనూ మెరిశారు. ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘బెజవాడ బెబ్బులి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘గీతాంజలి’తోపాటు, వెంకటేష్‌ నటించిన ‘బాబు బంగారం’లోనూ ఆమె సందడి చేశారు.

* ఓపిక ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటానని చెప్పే జానకి నట ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నందినిరెడ్డి  దర్శకత్వం వహిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలోనూ రాజేంద్రప్రసాద్‌కి అత్తగా నటిస్తున్నారు. ఆ చిత్రం విడుదల కావల్సి ఉంది. ‘సంసారం ఒక చదరంగం’, ‘అమూల్యం’ సినిమాల్లో నటనకిగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారు. జానకి భర్త పేరు శంకరమంచి శ్రీనివాసరావు. ఆమెకి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. మనవరాలు వైష్ణవి తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా రాణించారు. నిండు నూరేళ్లు ఆమె అదే ఉత్సాహంతో నటించాలని పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


మధుర గీతాల గని.. సోనూ

‘రావే నా చెలియా...రావే నా చెలియా’ అంటూ ‘జీన్స్‌’ చిత్రం లో హుషారు రేకెత్తించిన గాత్రం ఆయనది. ‘నిండు నూరేళ్ల సావాసం...’ అంటూ స్వచ్ఛమైన ప్రేమ గీతానికి ‘ప్రాణం’ పోసిన మధుర కంఠం ఆయనది. ఇలా తెలుగులో పలు పాటలకు తన గాత్రంతో జీవం పోసిన గొప్ప గాయకుడు సోనూ నిగమ్‌. ఆయన తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా శ్రోతల్ని బాగా అలరించారు. 2021 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం ఆయన్ను వరించిన సందర్భంగా ప్రత్యేక కథనం.

హిందీ చిత్రసీమ సగర్వంగా చెప్పుకొనే గొప్ప గాయకుల్లో సోనూ నిగమ్‌ ఒకరు. కన్నడ, మలయాళ, తమిళ, బెంగాలీ, భోజ్‌పురి, తుళు ఇలా దేశంలోని పలు భాషలతో పాటు నేపాలీలోనూ గీతాల్ని ఆలపించి గొప్ప గాయకుడిగా నిలిచారు. పలు చిత్రాలకు సంగీత   దర్శకత్వం వహించడంతో పాటు వివిధ భాషల్లో పాటల ఆల్బమ్‌లు రూపొందించారు. హిందూ, ఇస్లామిక్‌ సంస్కృతులకు సంబంధించిన పలు ఆధ్యాత్మిక ఆల్బమ్‌లతో పాటు బుద్ధిజానికి సంబంధించిన ఆల్బమ్‌లను కూడా ఆయన రూపొందించారు. ఇప్పటివరకూ ఆయన 5000పైగానే పాటలు పాడారు. సోనూ పలు చిత్రాల్లో నటించి అలరించడమే కాదు పాటలకు  సంబంధించిన రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయన దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయంగానూ గుర్తింపు సాధించారు.

‘మోడ్రన్‌ రఫి’: నాలుగేళ్ల వయసులోనే తండ్రి ఆగమ్‌ కుమార్‌ నిగమ్‌తో కలిసి పెళ్లిళ్లు, పార్టీల్లో కూని రాగాలు తీసేవారు సోనూ. 19 ఏళ్ల వయసులో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన అనతి కాలంలోనే గొప్పస్థాయికి ఎదిగారు. ప్రముఖ గాయకుడు మహ్మద్‌ రఫీని స్ఫూర్తిగా చెప్పే సోనూ ఆయనలానే మెలోడీలకు ప్రాణం పోస్తారు. ఆయన్ని ‘మోడ్రన్‌ రఫి’, ‘ది లార్డ్‌ ఆఫ్‌ ఛార్డ్స్‌’, ‘ది మాస్టర్‌ ఆఫ్‌ మెలోడీ’ ఇలా ఎన్నో రకాలుగా సంగీత ప్రియులు పిలుచుకుంటారు.

పురస్కారాలు: తన తియ్యటి గొంతులో వేల పాటల్ని పలికించిన సోనూని జాతీయ, అంతర్జాతీయంగా పలు పురస్కారాలు వరించాయి. ‘కహో నా హో’ చిత్రంలోని పాటకు గానూ 2003లో జాతీయ  పురస్కారం అందుకున్నారు. నాలుగుసార్లు ‘ఐఫా’  అవార్డుల్ని గెలుచుకున్నారు. ‘జల్‌’ చిత్రంలో ఆయన స్వరపరిచిన సౌండ్‌ట్రాక్‌కిగానూ ఆస్కార్‌ నామినేషన్‌ని దక్కింది. ఆయన చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నా... ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారం లభించడంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని