
Ramcharan: కీర్తిసురేష్ నటనకి అభిమానినయ్యా!
‘గుడ్లక్ సఖి’ వేడుకలో రామ్చరణ్
‘‘కీర్తిసురేష్ ‘అజ్ఞాతవాసి’లోనే నాకు బాగా నచ్చింది. ‘మహానటి’ చూశాక ఆమె నటనకి అభిమానినయ్యా’’ అన్నారు ప్రముఖ కథా నాయకుడు రామ్చరణ్. బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘గుడ్లక్ సఖి’ ముందస్తు విడుదల వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యభూమిక పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్చంద్ర పదిరి నిర్మాత. శ్రావ్య వర్మ సహనిర్మాత. దిల్ రాజు సమర్పకులు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బిగ్ టికెట్ని ఆవిష్కరించిన అనంతరం వేడుకని ఉద్దేశించి రామ్చరణ్ మాట్లాడారు. ‘‘నాన్న గారి సందేశాన్ని వినిపించడానికే నేను ఇక్కడికొచ్చా. నాన్న కోవిడ్తో ఈ వేడుకకి రాలేకపోయారు. అంతర్జాతీయ తరహా కథల్ని భారతీయ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత నగేష్ కుకునూర్ సొంతం. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్... తదితర సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనతో కలిసి ఈ వేదికని పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. కీర్తి ఇందులో చెప్పిన చిత్తూరు యాస చాలా బాగుంది. ఇలాంటి కథలు కీర్తి మరిన్ని చేయాలి’’ అన్నారు. కీర్తిసురేష్ మాట్లాడుతూ ‘‘మహానటి’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. సీరియస్ సినిమా తర్వాత, ఒక సరదా సినిమా చేయాలనుకున్నా. కథ వినగానే చేయడానికి ఒప్పుకున్నా. నాకు అంతగా నచ్చింది. నగేష్ కుకునూర్తో కలిసి పనిచేయడం ఓ గౌరవం. ఈ సినిమా ప్రయాణంలో చాలా నేర్చుకున్నా’’ అన్నారు. నగేష్ కుకునూర్ మాట్లాడుతూ ‘‘25 ఏళ్ల ముందు ‘హైదరాబాద్ బ్లూస్’ చేశా. మళ్లీ నేరుగా తెలుగు సినిమా చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. నిజాయతీగా చెప్పాలంటే కీర్తిసురేష్ వల్లే ఈ సినిమా చేశా’’ అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా, దిల్ రాజు, దేవిశ్రీ ప్రసాద్, అట్లూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.