Tollywood: కాలంలో ప్రయాణం... వినోదాల విహారం

చిత్రసీమలో ఒక్కోసారి ఒక్కో తరహా కథల జోరు కనిపిస్తుంటుంది. ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ సత్తా చాటిందంటే చాలు.. వరుసగా అదే తరహా కథలు వెల్లువలా వచ్చేస్తాయి. ఓ హారర్‌ సినిమా హిట్టయితే చాలు.. అదే బాటలో మరికొన్ని హారర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు వరుస కట్టేస్తాయి....

Updated : 31 Jan 2022 05:07 IST

చిత్రసీమలో ఒక్కోసారి ఒక్కో తరహా కథల జోరు కనిపిస్తుంటుంది. ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ సత్తా చాటిందంటే చాలు.. వరుసగా అదే తరహా కథలు వెల్లువలా వచ్చేస్తాయి. ఓ హారర్‌ సినిమా హిట్టయితే చాలు.. అదే బాటలో మరికొన్ని హారర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు వరుస కట్టేస్తాయి. ఇలా ఓ ట్రెండ్‌ను అనుసరిస్తూ ముందుకు సాగడం టాలీవుడ్‌కు అనాధిగా వస్తున్న ఆనవాయితీనే. ఇప్పుడు తెలుగులో టైమ్‌ ట్రావెల్‌ కథల హవా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు హీరోలు ఈ టైమ్‌ మెషిన్‌ కథలతో ప్రయాణాలు షురూ చేయగా.. ఇప్పుడు మరికొన్ని కథలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

సినీప్రియులకు సరికొత్త అనుభూతిని పంచిచ్చేందుకు కొత్త దర్శకులు వైవిధ్యభరిత కథలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కాలాన్ని వెనక్కి తిప్పో.. లేదంటే భవిష్యత్తులోకి తీసుకెళ్లో కథలు చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఇప్పుడు తెలుగులో టైమ్‌ ట్రావెల్‌ కథల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) కూడా ఈ తరహా కథాంశంతోనే రూపొందుతోంది. ‘మహానటి’ లాంటి భారీ విజయం తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నట్లు నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో సోషియో ఫాంటసీ అంశాలతో పాటు టైమ్‌ మిషన్‌ కాన్సెప్ట్‌ కూడా మిళితమై ఉంటుందని.. అందుకే ఈ స్క్రిప్ట్‌ విషయంలో సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు సహాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కథానాయకుడు టైమ్‌ మిషన్‌ ఎక్కి భవిష్యత్తులోకి వెళ్లడమే ఈ చిత్ర కథా నేపథ్యమని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరిత కథలతో ప్రయాణం చేస్తుంటారు యువ హీరో శర్వానంద్‌. ఇప్పుడాయన కూడా ప్రభాస్‌ బాటలోనే టైమ్‌ మిషన్‌ ఎక్కేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీకార్తిక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమాలో చిత్రమైన టైమ్‌ ట్రావెల్‌ సెటప్‌ ఉందని సమాచారం. ఇందులో శర్వా, తన స్నేహితులతో కలిసి చిన్ననాటి రోజుల్లోకి వెళ్తాడని తెలుస్తోంది. అంటే బాల్యంలోకి వెళ్లి తన తల్లితో గడిపిన జ్ఞాపకాల్ని, స్కూల్‌ డేస్‌ని, అప్పటి స్నేహాల్ని దగ్గర్నుంచి చూసుకునే ప్రయత్నం చేస్తారట. ఇదే ఈ చిత్ర కథా నేపథ్యమని సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో చిత్ర కథా నేపథ్యంపై స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. మరి ఈ టైమ్‌ ట్రావెల్‌ తెరపై ఎలా కనువిందు చేయనుందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌..అనేది ఉపశీర్షిక. వశిష్ట్‌ తెరకెక్కిస్తున్నారు. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఓ వైవిధ్యభరితమైన టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బింబిసారుడి కాలానికి, వర్తమానానికి మధ్య సాగే కథగా ఉంటుంది. ఈ కథకు తగ్గట్లుగానే కల్యాణ్‌ రామ్‌ ఇందులో బింబిసారుడిగా.. మోడ్రన్‌ యువకుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని కథలు వస్తున్నాయి..

మిళ హీరో సూర్య నటించిన ‘24’ టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొంది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిచ్చింది. దీనికి సీక్వెల్‌ తీసుకొచ్చే ఆలోచన ఉందని ఆ సినిమా విడుదల సమయంలోనే తెలిపారు విక్రమ్‌. ఇప్పుడా ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ‘24’కి కొనసాగింపు కథను సిద్ధం చేశారని, ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ సినీ కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ టైమ్‌ మెషిన్‌ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. ఇందుకోసం ఆయనే స్వయంగా కథ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనే తన తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తానని బాలయ్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది తెలియాల్సి ఉంది.


‘టాక్సీవాలా’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సినీప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌. ఇప్పుడాయన మైత్రీ మూవీస్‌ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇదొక ఆసక్తికర టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. హీరో భూత, భవిష్యత్‌ కాలాలకు ఎలా వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? అనే నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథ నాగచైతన్యకు వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు అంగీకారం తెలిపారని ప్రచారం వినిపిస్తోంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని