Tollywood: తర్వాతేంటి?

చిత్రసీమలో సందడి వాతావరణం కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు కొవిడ్‌ భయాల మధ్య ఆగి ఆగి.. నత్త నడకన సాగిన విడుదలలు, చిత్రీకరణలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఒకటీ అరా మినహా ఇప్పటికే కీలకమైన బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ ముందుకొచ్చేశాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన పలు క్రేజీ చిత్రాలు సెట్స్‌పైకి ఎక్కేశాయి. ప్రస్తుతం చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ తదితర అగ్ర హీరోలంతా రెండు మూడు సినిమాలతో సెట్స్‌పై బిజీ

Updated : 18 May 2022 06:26 IST

కొత్త కబురు వినిపించని హీరోలు

చిత్రసీమలో సందడి వాతావరణం కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు కొవిడ్‌ భయాల మధ్య ఆగి ఆగి.. నత్త నడకన సాగిన విడుదలలు, చిత్రీకరణలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఒకటీ అరా మినహా ఇప్పటికే కీలకమైన బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ ముందుకొచ్చేశాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన పలు క్రేజీ చిత్రాలు సెట్స్‌పైకి ఎక్కేశాయి. ప్రస్తుతం చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ తదితర అగ్ర హీరోలంతా రెండు మూడు సినిమాలతో సెట్స్‌పై బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికీ పలువురు స్టార్‌ కథానాయకుల డైరీ ఖాళీగా కనిపిస్తోంది. తర్వాత చేయనున్న చిత్రాల విషయంలో సందిగ్థత కొనసాగుతూనే ఉంది.

మంచి కథలు దొరకాలే కానీ, ఏకకాలంలో రెండు మూడు సినిమాలు చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు కథానాయకుడు నాగార్జున. ఈ ఏడాది సంక్రాంతికి ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు ‘ది ఘోస్ట్‌’తో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌.. ముగింపు దశలో ఉంది. దీని తర్వాత నాగ్‌ చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆ మధ్య ఓటీటీ కోసం కథలు వింటున్నట్లు తెలిపారు. ఇంత వరకు ఏదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘ది ఘోస్ట్‌’ కాకుండా ఆయన నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

* జయాపజయాలతో సంబంధం లేకుండా తన మార్క్‌ కథలతో అలరిస్తుంటారు హీరో వెంకటేష్‌. ఆయన ప్రస్తుతం ‘ఎఫ్‌3’తో నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ఈ రెండూ గతంలో ప్రకటించిన ప్రాజెక్ట్‌లే. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ చిత్రానికి సంతకాలు చేసినట్లు తెలిసింది. దీంట్లో ఆయన ఓ కీలక పాత్రలో తళుక్కున మెరుస్తారని సమాచారం. తెలుగులో చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంకా తేలలేదు. తరుణ్‌ భాస్కర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అదీ కార్యరూపంలోకి రాలేదు. ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ ఫేం కె.వి.అనుదీప్‌తో ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచి వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని, ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఇది పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది. దీనిపైనా ఇంత వరకైతే ఏ స్పష్టతా రాలేదు.

* కొత్తదనం నిండిన కథలకు చిరునామాగా నిలుస్తుంటారు నటుడు రానా. హీరోగా.. విలన్‌గా విభిన్న పాత్రలతో మెప్పించారు. ఇటీవలే ‘భీమ్లా నాయక్‌’లో డేనియల్‌ శేఖర్‌ పాత్రలో కనిపించి అలరించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రమిది. సాయి పల్లవి కథానాయిక. కొన్నేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌పై ఏ స్పష్టత లేదు. గుణ శేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం పట్టాలెక్కించనున్నట్లు కొన్నేళ్లుగా వార్తలొస్తూనే ఉన్నాయి. ఇంత వరకు అది కార్యరూపంలోకి రాలేదు. తేజ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. దానిపైనా ఇప్పటి వరకు ఏ స్పష్టతా రాలేదు. రానా ప్రస్తుతానికి వెంకటేష్‌తో కలిసి ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది.

* గతేడాది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’గా ప్రేక్షకుల్ని మెప్పించారు అఖిల్‌ అక్కినేని. ప్రస్తుతం ‘ఏజెంట్‌’గా సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా  తుది దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత ఆయన చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్వరలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. మరి దర్శకుడెవరు? ఎప్పటి నుంచి సెట్స్‌పైకి వెళ్తుంది? అన్నవి తేలాల్సి ఉంది. 


* ‘పుష్ప’తో తిరుగులేని విజయాన్ని అందుకుని.. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. త్వరలో ఆయన ‘పుష్ప2’ కోసం రంగంలోకి దిగనున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తి కాగానే ఆయనతో సినిమా చేసేందుకు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ జాబితాలో బోయపాటి శ్రీను, కొరటాల శివ, మురుగదాస్‌, వేణు శ్రీరామ్‌ వంటి వారి పేర్లు వినిపించాయి. ఆ మధ్య బన్నీ ముంబయిలో సంజయ్‌ లీలా భన్సాలీని కలవడంతో.. వీరి కలయికలోనూ ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపించాయి. వీటిలో ముందు పట్టాలెక్కేది ఎవరిదననేది తేలడం లేదు. ‘పుష్ప2’ విడుదల తర్వాతే అల్లు అర్జున్‌ కొత్త సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని