Tollywood: ఆలస్యం... అభిమానం.. సందిగ్ధం

అభిమాన కథానాయకుడి నుంచి ఓ కొత్త కబురు అందిందంటే చాలు.. సినీ ప్రియుల ఆనందం ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు ఎన్నాళ్ల సమయమున్నా.. ముందు నుంచే ఆరాలు మొదలైపోతాయి. చేయబోయే కథేంటి? ఏ జానర్‌లో

Updated : 27 Jun 2022 07:27 IST

అభిమాన కథానాయకుడి నుంచి ఓ కొత్త కబురు అందిందంటే చాలు.. సినీ ప్రియుల ఆనందం ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు ఎన్నాళ్ల సమయమున్నా.. ముందు నుంచే ఆరాలు మొదలైపోతాయి. చేయబోయే కథేంటి? ఏ జానర్‌లో సాగుతుంది? తమ హీరో ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? జోడీగా కనిపించే ఆ అందాల నాయికెవరు? ఢీ కొట్టబోయే ప్రతి నాయకుడెవరు? ఇలా ఎన్నెన్ని చర్చలో. సినిమా పట్టాలెక్కడానికి ముందే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తాయి. అయితే ప్రకటనలతో ఊరించిన ప్రాజెక్ట్‌లన్నీ.. పక్కాగా అనుకున్న సమయానికే సెట్స్‌పైకి వెళ్తాయన్న రూలేం లేదు. కొన్నిసార్లు లైనప్‌లో మార్పుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చు. ఏదేమైనా సరే.. మళ్లీ ఆ ప్రాజెక్ట్‌పై ఏదోక ప్రకటన వచ్చే వరకు సినీప్రియుల్ని సందిగ్ధత వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి సందిగ్ధతే ప్రస్తుతం పలువురు హీరోల సినిమాల విషయంలో కనిపిస్తోంది.

రీఎంట్రీలో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌. ఓవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు సినిమా చిత్రీకరణలకు సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. వీటిలో ‘హరి హర వీరమల్లు’ ఇప్పటికే సెట్స్‌పై ముస్తాబవుతోంది. హరీష్‌ శంకర్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించనున్న మరో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. తాజాగా ఈ జాబితాలోకి సముద్రఖని ‘వినోదాయ సిద్ధం’ రీమేక్‌ చేరింది.  తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం ‘హరి హర వీరమల్లు’ పూర్తి కాగానే హరీష్‌ శంకర్‌ సినిమా.. అది పూర్తి కాగానే సురేందర్‌ రెడ్డి చిత్రం పట్టాలెక్కాల్సి ఉంది. కొవిడ్‌ పరిస్థితుల వల్ల ఈ లైనప్‌  మారిపోయింది. ‘వకీల్‌ సాబ్‌’ తర్వాత పవన్‌  అనూహ్యంగా ‘భీమ్లా నాయక్‌’ కోసం రంగంలోకి దిగడంతో ‘వీరమల్లు..’ ఆలస్యమైంది. ఆ ప్రభావం హరీష్‌, సురేందర్‌ రెడ్డి ప్రాజెక్ట్‌లపై పడింది. ఇప్పుడీ లైనప్‌లోకి ‘వినోదాయ సిద్ధం’ రీమేక్‌ వచ్చి చేరడంతో హరీష్‌, సురేందర్‌ల చిత్రాలు ఎప్పుడు సెట్్సపైకి వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్‌ ‘వీరమల్లు’ పూర్తి చేసి.. సముద్రఖని చిత్రం కోసం రంగంలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారం వినిపిస్తోంది. దసరా తర్వాత నుంచి రాజకీయాలకు సమయం కేటాయించేందుకు సమాయత్తమవుతున్నారనీ తెలిసింది. దీనిపై జనసేనాధినేత నుంచి ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఈ నేపథ్యంలో పవన్‌ చేతిలో ఉన్న మిగిలిన చిత్రాలు ఎప్పటికి పూర్తవుతాయన్నది ఆసక్తిరేకెత్తిస్తోంది.


బన్నీ లెక్క తేలేదెప్పుడో

‘పుష్ప’తో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఈ చిత్ర విజయంతో బన్నీ క్రేజ్‌ జాతీయ స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ‘పుష్ప2’ ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండో భాగానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇందులో వేణు శ్రీరామ్‌ ‘ఐకాన్‌’తో పాటు కొరటాల శివ చిత్రాలపై గతంలోనే ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ఈ జాబితాలో బోయపాటి శ్రీను, మురుగదాస్‌ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లలో బన్నీ తొలుత ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ‘పుష్ప’ తర్వాత కథల విషయంలో అల్లు అర్జున్‌ లెక్కలు మారిపోయాయని.. పాన్‌ ఇండియా ఇమేజ్‌కు తగ్గ కథల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. కొత్త ప్రాజెక్ట్‌పై దసరా నాటికి స్పష్టత వచ్చే అవకాశముందని ప్రచారం వినిపిస్తోంది.


తారక్‌తో ఉందా.. లేదా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ నుంచి రెండు కొత్త కబుర్లు  వినిపించాయి. వీటిలో ఒకటి కొరటాల శివ చిత్రం కాగా.. మరొకటి ప్రశాంత్‌ నీల్‌ సినిమా. ఏడాది క్రితమే కుదిరిన కలయికలివి. అదే సమయంలో మరో క్రేజీ కాంబినేషన్‌ వార్తల్లో  నిలిచింది. ‘ఉప్పెన’తో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకొన్న దర్శకుడు బుచ్చిబాబు సాన. ఆయన తారక్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారని, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని వార్తలు వినిపించాయి. అప్పట్లో దీన్ని చిత్ర దర్శకుడు.. నిర్మాతలు ధ్రువీకరించారు. అయితే ఈ ఏడాది ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రకటనల్లో ఈ ప్రాజెక్ట్‌ జాడ కనిపించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఉందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. మరి ఆ తర్వాత లైనప్‌లో ఈ సినిమా ఉంటుందా? మరో కొత్త చిత్రమేదైనా వస్తుందా? అన్నది వేచి చూడాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని