Actress: అందాల థ్రిల్లింత

థ్రిల్లర్‌ కథలు.. వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములా. ఈ జానర్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ కనిపిస్తుంటుంది. అందుకే కొన్నేళ్ల క్రితం వరకు చిన్న సినిమాలకే పరిమితమైన ఈ కథల వైపు ఇప్పుడు అగ్ర హీరోలు దృష్టి సారిస్తున్నారు. వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలు ఎంచుకుంటూ.. సినీప్రియుల్ని థ్రిల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 25 Jul 2022 07:11 IST

థ్రిల్లర్‌ కథలు.. వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములా. ఈ జానర్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ కనిపిస్తుంటుంది. అందుకే కొన్నేళ్ల క్రితం వరకు చిన్న సినిమాలకే పరిమితమైన ఈ కథల వైపు ఇప్పుడు అగ్ర హీరోలు దృష్టి సారిస్తున్నారు. వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలు ఎంచుకుంటూ.. సినీప్రియుల్ని థ్రిల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ హిట్‌ ఫార్ములాని అందాల నాయికలూ అందిపుచ్చుకున్నారు. తమదైన శైలి సొగసుల మసాలాలు జోడించి మరీ.. ప్రేక్షకులకు విభిన్న రకాల థ్రిల్లర్లు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు.


యశోద.. ఉత్కంఠ

నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తూనే.. అడపాదడపా రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లోనూ సందడి చేస్తోంది నటి సమంత. మిస్టరీ థ్రిల్లర్‌ ‘యూటర్న్‌’తో తొలిసారి సినీప్రియులకు థ్రిల్‌ పంచిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘యశోద’గా మరో థ్రిల్లింగ్‌ కథను రుచి చూపించనుంది. సామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇదొక ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రం కోసం సమంత డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. త్వరలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.  


‘శాకినీ ఢాకినీ’ ఉత్సుకత

కొరియన్‌ హిట్‌ సినిమా ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ను ప్రస్తుతం తెలుగులో ‘శాకినీ ఢాకినీ’గా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. సుధీర్‌ వర్మ దర్శకుడు. డి.సురేష్‌బాబు, టి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదొక భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఉత్సుకత రేకెత్తిస్తూనే.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెజీనా, నివేదా ట్రైనీ పోలీసులుగా కనిపించనున్నారని తెలిసింది. ఈ నాయికలిద్దరూ సినిమా కోసం యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించారని చిత్రబృందం చెబుతోంది. 


 ‘బటర్‌ఫ్లై’.. సస్పెన్స్‌

న్నాళ్లు కమర్షియల్‌ కథానాయికగా తెరపై మెరుపులు మెరిపించిన అనుపమ పరమేశ్వరన్‌.. ఇప్పుడు నాయికా ప్రాధాన్య సినిమాలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ‘బటర్‌ఫ్లై’గా కనువిందు చేయనుంది. అనుపమ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని గంటా సతీష్‌బాబు తెరకెక్కించారు. ఓ వినూత్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో నేరుగా విడుదల కానున్నట్లు సమాచారం.


జమున.. ఆసక్తికర ప్రయాణం

కెరీర్‌ ఆరంభం నుంచీ నటనా ప్రాధాన్యమున్న కథలతోనే ప్రయాణం చేస్తోంది నటి ఐశ్వర్య రాజేష్‌. ప్రస్తుతం ‘డ్రైవర్‌ జమున’తో పాన్‌ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. పా.కిన్‌స్లిన్‌ తెరకెక్కించిన చిత్రమిది. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథతో రూపొందింది. ఇందులో ఐశ్వర్య ఓ క్యాబ్‌ డ్రైవర్‌ పాత్రను పోషించింది. ఒకసారి ఆమె క్యాబ్‌లో నేర నేపథ్యమున్న కొందరు వ్యక్తులు ప్రయాణిస్తారు. ఆ సందర్భంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తన ప్రాణానికీ ముప్పు ఏర్పడుతుంది. మరి ఆ ముప్పు ఏంటి? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని