Nithiin: ఈ ఫైట్స్‌.. నా కెరీర్‌లోనే బెస్ట్‌ నితిన్‌

మాచర్ల..’ చాలా మాసీ ఫిల్మ్‌. ప్రేక్షకులకు ఫుల్స్‌ మీల్స్‌లా ఉంటుంది. ఆగస్టు 12న మేము గట్టిగా కొట్టబోతున్నామని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Updated : 08 Aug 2022 07:55 IST

‘‘మాచర్ల..’ చాలా మాసీ ఫిల్మ్‌. ప్రేక్షకులకు ఫుల్స్‌ మీల్స్‌లా ఉంటుంది. ఆగస్టు 12న మేము గట్టిగా కొట్టబోతున్నామని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కృతి శెట్టి, కేథరిన్‌ కథా  నాయికలు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్‌ (Nithiin) మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు పూర్తయింది. ఇన్నాళ్ల పాటు నేనిక్కడ ఉన్నానంటే అభిమానులు, సినీప్రియులు పంచిన ప్రేమాభిమానాలే కారణం. మీ అందరి కోసం ఇంకో ఇరవై ఏళ్లైనా ఇలాగే కష్టపడతా. ఈ చిత్రానికి సముద్రఖని పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో వెన్నెల కిషోర్‌ కామెడీ హైలైట్‌గా ఉంటుంది. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇవ్వడంలో మణిశర్మను కింగ్‌ అంటారు. కానీ, ఈ చిత్రం చూశాక సాగర్‌ను తండ్రిని మించిన తనయుడు అంటారు. ఈ చిత్రం కోసం దర్శకుడు రాజశేఖర్‌ చాలా కష్టపడ్డాడు. సినిమా చూస్తే ఓ కొత్త దర్శకుడు తీసినట్లు ఎక్కడా ఉండదు. దీంట్లో నేను చేసిన ఫైట్స్‌.. నా కెరీర్‌లోనే బెస్ట్‌. ప్రతి ఫైట్‌ దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అన్నారు.  
*  మరో అతిథి వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘ఏడాదిన్నరగా నితిన్‌తో ప్రయాణం చేస్తున్నా. ఆయనతో నా తదుపరి సినిమా చేస్తున్నా. రాజశేఖర్‌రెడ్డి నేను రాసిన ‘టెంపర్‌’ సినిమాకి ఎడిటర్‌. ఈ సినిమా తనకి చాలా ముఖ్యమ’’న్నారు.
* ‘‘ఫస్ట్‌ టైమ్‌ నితిన్‌ను అంత మాస్‌గా చూడటం. పెద్ద హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు సురేందర్‌ రెడ్డి.
* దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ‘‘సాగర్‌ యువతరం మెచ్చే గీతాలిచ్చాడు. కృతి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు.
* ‘‘ఇందులో పోరాటాలు, పాటలు చాలా బాగున్నాయి. ‘మాస్ట్రో’ జరుగుతున్నప్పుడు ఈ సినిమా విరామ సన్నివేశం చెప్పారు రాజశేఖర్‌రెడ్డి. చాలా నచ్చింది. తప్పకుండా అలరిస్తుంద’’న్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ.
* చిత్ర దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి 15ఏళ్లు పట్టింది. ఈ ప్రయాణంలో నాకెంతో అండగా నిలిచిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్స్‌. మాట నిలబెట్టుకోవడం చాలా తక్కువ మంది చేస్తారు. అలాంటి కొద్ది మందిలో మా నితిన్‌ ఒకరు. గత వారం విడుదలైన రెండు చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. ఈ వారం వస్తున్న మా సినిమా హిట్‌ కొడుతుందని నమ్ముతున్నాం. కచ్చితంగా ఆగస్టు రుణం తీర్చుకుంటాం’’ అన్నారు.
* నటి కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నితిన్‌ నుంచి మాసీతో పాటు ఓ క్లాసీ అవతారం ఆశించొచ్చు. ఈ చిత్రాన్ని ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అంది.
*  కార్యక్రమంలో సముద్రఖని, బ్రహ్మాజీ, ఠాగూర్‌ మధు, దీపిక రెడ్డి, విజయ్‌, జీతు, కృష్ణచైతన్య, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.
* అతిథిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ‘‘నితిన్‌, నేను, రాజశేఖర్‌ రెడ్డి కలిసి చేసిన ‘లై’ కొన్నేళ్ల కిందట ఆగస్టు నెలలోనే విడుదలైంది. ఆ సినిమా విజయం సాధించలేదు. అలా ఆగస్టు నెల మాకు బాకీ పడింది. ‘సీతారామం’తో నా బాకీ తీరింది. నితిన్‌, రాజశేఖర్‌ ఈ సినిమాతో విజయం అందుకుంటారు. రాజశేఖర్‌ రెడ్డిలో నితిన్‌ ఓ దర్శకుడిని చూసి, చాలా ప్రోత్సహించాడ’’న్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని