కథ కుదిరిందా?

ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమాతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఇది పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారాయన. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా..

Published : 27 Sep 2022 02:25 IST

ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమాతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఇది పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారాయన. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. కాగా, ఇప్పుడాయన మరో కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీనికి బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకుడిగా వ్యవహరించనున్నారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ ప్రస్తుతం చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాకే బాలయ్య సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.


దుల్కర్‌ కలల ప్రాజెక్టు షురూ

‘సీతారామం’తో తెలుగువాళ్లకి దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ ‘చుప్‌’తో హిందీలోనూ మెప్పించారు. ఈ జోరుతో తన కలల ప్రాజెక్టు ‘కింగ్‌ ఆఫ్‌ కోట’కి శ్రీకారం చుడుతున్నారు. అభిలాష్‌ జోషీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. దుల్కర్‌ మాస్‌ అవతారంలో కనిపించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబరు 28 నుంచి మొదలవుతుంది. తమిళనాడులోని మదురైలో సాగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి రాయపురంలో భారీ బడ్జెట్‌తో సెట్‌ని వేశారు. ఈ ఫిక్షనల్‌ డ్రామాలో మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. దుల్కర్‌కి జోడీగా సమంత నటించనుందని వార్తలొస్తున్నా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. దుల్కర్‌ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని