సంక్షిప్త వార్తలు (5)

వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ ‘నాంది’ సినిమాతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు కథానాయకుడు అల్లరి నరేష్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్‌ మోహన్‌ దర్శకుడు. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌

Updated : 30 Sep 2022 06:43 IST

మారేడుమిల్లి ప్రజానీకం సిద్ధం

రుస పరాజయాలకు చెక్‌ పెడుతూ ‘నాంది’ సినిమాతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు కథానాయకుడు అల్లరి నరేష్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్‌ మోహన్‌ దర్శకుడు. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ సంస్థలు  నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.


కేరాఫ్‌ నువ్వు

త్నకిషోర్‌, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్‌రాజ్‌ నటీనటులుగా... సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నేను కేరాఫ్‌ నువ్వు’. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ‘‘పరువు హత్య నేపథ్యంలో సాగే కథ ఇది. మన సమాజంలో కులాలు, పరువు పేరుతో ఎలాంటి ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయో చర్చించిన తీరు ఆకట్టుకుంటుంది. అదే సమయంలో చక్కటి వినోదాన్ని పంచుతుందీ ప్రేమకథ. సాగారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు చాలా బాగుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


తందనాన అహి...

గపతి బాబు ప్రధాన పాత్రలో మురళీ మనోహర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింబా - ది ఫారెస్ట్‌ మ్యాన్‌’. ఈ సినిమాకి దర్శకుడు సంపత్‌ నంది కథ అందించడమే కాక.. డి.రాజేంద్ర రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. అనసూయ, వశిష్ఠ ఎన్‌.సింహ, దివి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘తందనాన అహి..’’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. అన్నమయ్య కీర్తనలోని ఓ లైన్‌ ఆధారంగా రాసుకున్న ఈ గీతానికి కృష్ణ సౌరభ్‌ స్వరాలు సమకూర్చారు. యదు కృష్ణన్‌ ఆలపించారు.


కుటుంబాన్ని ప్రేమించడమూ ప్రేమే!

‘‘ప్రేమంటే ఇద్దరి ప్రేమికుల మధ్యనున్నదే కాదు. అది రకరకాలుగా ఉంటుందనే విషయాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాం’’ అన్నారు డా.విశ్వానంద్‌ పటార్‌. ఆయన ఓ కథానాయకుడిగా నటిస్తూనే, స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా డా.విశ్వానంద్‌ పటార్‌ మాట్లాడుతూ ‘‘విభిన్నమైన ప్రేమ కథ ఇది. ప్రేమ అనగానే ఒక అబ్బాయి, ఒక అమ్మాయే గుర్తుకొస్తారు. ఆ ఇద్దరి మధ్య ఉన్నదే ప్రేమ అనుకుంటారు. మనల్ని మనం ప్రేమించుకోవడం,  వృత్తి, కుటుంబాన్ని ప్రేమించడం కూడా ప్రేమే. ఇలా ఐదు ప్రేమకథలతో తీసిన సినిమానే ఇది. కథకి తగ్గట్టుగా కొత్తవాళ్లనే ఎంపిక చేసుకున్నాం’’ అన్నారు.


పల్లెటూరి ప్రేమకథ

సురేంద్ర కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లోకమెరుగని కథ’. రవికాంత్‌ జమి నిర్మాత. పూజిత కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ.. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం ఉంది. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి.. ఈతరం ఆలోచనలున్న కొడుకు మధ్య జరిగే ఆసక్తికర కథాంశంగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌ కొప్పుల, విజయ్‌ విశ్వనాధన్‌, పూజిత, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని