Chiranjeevi: నేనూ.. నాగ్‌ పండగ భోజనానికి వెళ్తున్నట్టుగా ఉంది

చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా కాలమైనా, కొన్నాళ్లుగా ఆయన రాజకీయ సంభాషణలు సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చర్చని లేవనెత్తుతున్నాయి. దానిక్కారణం రాజకీయం ప్రధానంగా సాగే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమానే!

Updated : 05 Oct 2022 07:07 IST

చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా కాలమైనా, కొన్నాళ్లుగా ఆయన రాజకీయ సంభాషణలు సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చర్చని లేవనెత్తుతున్నాయి. దానిక్కారణం రాజకీయం ప్రధానంగా సాగే ‘గాడ్‌ఫాదర్‌’ సినిమానే! మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. చిత్రం దసరా సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం జరిగింది. పలు ప్రశ్నలకి చిరంజీవి చెప్పిన సమాధానాలివీ...

తెలుగు కథలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఈ దశలో మీరు మలయాళం సినిమాని రీమేక్‌ చేయడానికి కారణమేమిటి?

రీమేక్‌ అనేసరికి తక్కువ భావంతో ఎందుకు చూస్తారు? ఒరిజినల్‌ కంటే రీమేక్‌ చేయడమే అతి పెద్ద సవాల్‌. నటుల్ని, సినిమాల్నీ పోల్చి చూస్తారు. ఆ క్రమంలో మనం నిలబడతామా లేదా అనేది పెద్ద సవాల్‌. అయితే నేను చేసిన రీమేక్‌లను గమనిస్తే ఒరిజినల్‌ కన్నా ఎక్కువ వసూళ్లు సాధించాయి. పాత్రల పరంగానూ పేరొచ్చింది. పోల్చి చూసినా నిలబడగలనని నా చరిత్రే చెబుతుంది.

‘గాడ్‌ఫాదర్‌’ చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్లు ఎలాంటివి?

ప్రతీ కథకి ఓ ఆత్మ ఉంటుంది. దానితో మనం అనుసంధానం కావాలి. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీకి కనెక్ట్‌ అవ్వకూడదు. ఆత్మని నిశితంగా గమనిస్తే సినిమా భవిష్యత్తుని దాదాపుగా చెప్పేయొచ్చు. మొదట ‘లూసిఫర్‌’ చూసినప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. చరణ్‌ చెప్పాక మరోసారి ఆ సినిమా చూశా. అయినా తృప్తి కలగలేదు. దర్శకుడు మోహన్‌రాజా వచ్చి ఈ కథలో మార్పు చేశాక తృప్తి కలిగింది. ఒక కథ ఆత్మతో కనెక్ట్‌ అయ్యాక దాన్నొక కొత్త సినిమాలాగే చూస్తాను. మాతృకని పూర్తిగా మరిచిపోతాను. ఈ పాత్రని అవతలివాళ్లు ఎలా చేశారని పట్టించుకోను. దర్శకుల సహకారంతో నా నటన, హావభావాలు కొత్తగా ఉండేలా చూసుకుంటుంటా. రాజకీయాలు, కుటుంబం... రెండింటి మేళవింపుగా సాగే సినిమా ఇది. అదే అంశమే ఈ సినిమా చేయడానికి నన్ను ప్రేరేపించింది. ఇంకా ఇందులో ఏమేం ఉన్నాయో సినిమా చూస్తే అర్థమవుతుంది.

భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. పరిశ్రమల్లోని నటులు కలిసి నటిస్తున్నారు. మీతో కలిసి సల్మాన్‌ఖాన్‌ నటించారు. దీనిపై మీ అభిప్రాయమేంటి?

ముంబయి వేడుకలో సల్మాన్‌ఖాన్‌ని ఇదే ప్రశ్న అడిగారు. వాళ్లు దక్షిణాది నుంచి ఇక్కడికొస్తున్నారు, నేను అక్కడికి వెళ్లొద్దా? అన్నారు. ఆ చమత్కారం వెనక ఓ సత్యం ఉంది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయినందుకు, మనదంతా భారతీయ సినిమాగా రూపాంతరం చెందినందుకు గర్వించాలి. కథ రీత్యా ‘గాడ్‌ఫాదర్‌’లో నాకొక దళపతిలాంటి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర చేయాలంటే ఆ నటుడికి ఓ స్థాయి ఉండాలి. అలాంటి పెద్ద నటుడు ఎవరున్నారా? అని ఆలోచించినప్పుడు నా కుటుంబానికీ, నాకూ సన్నిహితుడైన సల్మాన్‌ఖాన్‌ గుర్తొచ్చారు. అది కూడా ఉత్తరాదికి చెందినవారైతే బాగుంటుందని భావించి తనని సంప్రదించాం. వెంటనే ఒప్పుకున్నారు.

అభిమాన బలం, తరగని వాళ్ల ఆదరణపై మీ అభిప్రాయం?

తొమ్మిదేళ్ల విరామం తర్వాత నేను మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘అభిమానులు నాపై చూపించే ప్రేమ అలాగే ఉంటుందా?’ అనే ప్రశ్న తలెత్తింది. నా 150వ సినిమా విడుదలకి ముందు వేడుక విజయవాడలో జరిగినప్పుడు అక్కడికొచ్చిన అభిమాన గణాన్ని చూసి ఆశ్చర్యపోయా. సినిమాతో మొదలైన వాళ్ల ప్రేమ వ్యక్తిగతంగా మారిందనే విషయం అర్థమైంది. ఇన్నాళ్లూ ఇది కదా మిస్‌ అయ్యింది అనిపించింది.

నాగార్జున... మీరూ స్నేహితులు. ఇద్దరి సినిమాలూ ఒకే రోజు వస్తున్నాయి. మీకేమనిపిస్తోంది?

పండక్కి ఇద్దరం కలిసి భోజనానికి వెళుతున్నట్టుగా భావిస్తున్నా. ప్రేక్షకులు తప్పకుండా భోజనం పెడతారు, ఇద్దరం తృప్తిగా తింటాం, ఆనందిస్తాం.


ఈ సినిమాకి పనిచేసినవాళ్లలో ఎక్కువగా మీ అభిమానులే కనిపిస్తున్నారు. వాళ్లతో పనిచేయడంపై మీ అనుభూతి?

ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయి. దీన్ని భగవంతుడు నాకు ఇచ్చిన ఓ వరంగా భావిస్తా. ఎప్పుడో ఒక పెద్ద నటుడు నాతో ఒక మాట అన్నారు. మనతో పనిచేసే నటులు, సాంకేతిక నిపుణులు మన అభిమానులైతే కళ్లు మూసుకుని సినిమా చేసేయొచ్చు అని. ఆ మాటని నేను నమ్ముతా. సత్యదేవ్‌, లక్ష్మీభూపాల్‌, మోహన్‌రాజా... ఇలా అందరూ కలిసొచ్చారు తప్ప మేం ముందు అనుకుని చేసింది కాదు. సత్యదేవ్‌ నటించిన సినిమాల్ని కరోనా సమయంలో చూశా. మొదట తను కన్నడ నటుడేమో అనుకున్నా. ఓసారి ఇంటికి పిలిపించి మాట్లాడాక తను తెలుగువాడని, నా అభిమాని అని అర్థమైంది. ఈ పాత్ర కోసం నేనే సత్యదేవ్‌ పేరుని సూచించా. తను భారతదేశంలోనే ఓ మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటాడు.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని