Actress: మనసంతా ‘నాయికా’ కథలే!

కొన్నేళ్లుగా చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాల జోరు పెరిగింది. అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ వంటి స్టార్‌ నాయికల మొదలు.. కొత్తగా వచ్చిన నాయికల వరకు ఎవరి స్థాయికి తగ్గ కథలు వారికి సిద్ధమవుతున్నాయి.

Updated : 19 Nov 2022 10:10 IST

కొన్నేళ్లుగా చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాల జోరు పెరిగింది. అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ వంటి స్టార్‌ నాయికల మొదలు.. కొత్తగా వచ్చిన నాయికల వరకు ఎవరి స్థాయికి తగ్గ కథలు వారికి సిద్ధమవుతున్నాయి. దీంతో నాయికా ప్రధానమైన సినిమాల సందడి అంతకంతకు రెట్టింపవుతోంది. మంచి విజయాలు దక్కుతుండటంతో నాయికలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలు చేస్తున్నా చాలామంది నాయికల మనసంతా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథల మీదే ఉంటుంది. తెలుగులో ఇప్పటికే కొన్ని నాయికా  ప్రాధాన్య సినిమాలు సెట్స్‌పై ముస్తాబవుతుండగా.. ఇప్పుడు మరికొన్ని కథలు కార్యరూపం దాల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


రాహుల్‌ కథలోకి సామ్‌!

నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తోంది సమంత. ఆమె టైటిల్‌ పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యశోద’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో చేసిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా.. ఇప్పుడామె కోసం మరో నాయికా ప్రాధాన్య కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘చిలసౌ’ సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా మెప్పించిన రాహుల్‌ రవీంద్రన్‌. ఆ వెంటనే నాగార్జునతో ‘మన్మథుడు 2’ చేసే అవకాశం అందుకున్నారు. కానీ, అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఆయన ఓ నాయికా ప్రాధాన్య కథను సిద్ధం చేసుకొని రష్మికకు వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడా కథనే రాహుల్‌ మార్పులు చేసి సమంతకు వినిపించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై సామ్‌ కూడా సానుకూలంగా స్పందించిందని టాక్‌. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. గీతా ఆర్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’లో నటిస్తోంది. హిందీలో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తోంది.


జోరు పెంచుతోన్న లావణ్య..

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు సినీప్రియులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. రామ్‌, నాని, వరుణ్‌ తేజ్‌.. ఇలా వరుసగా యువ హీరోలతో కలిసి సందడి చేసింది. అయితే ఇటీవల కాలంలో వరుస పరాజయాలు పలకరించడంతో కథల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మొదలు పెట్టింది లావణ్య. దీంతో సినిమాల పరంగా ఆమె జోరు కాస్త తగ్గింది. అయితే ఇప్పుడామె రెండు నాయికా ప్రాధాన్య కథలకు పచ్చజెండా ఊపిందని సమాచారం. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా.. మరొకటి తమిళ చిత్రం. తెలుగు ప్రాజెక్ట్‌కు మంజునాథ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పిందని తెలిసింది. దీన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నారని సమాచారం. లావణ్య ప్రస్తుతం తెలుగులో ‘పులి మేక’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇది త్వరలో జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘సీతారామం’ నిర్మాతలతో మరోసారి!

‘సీతారామం’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మరాఠీ భామ మృణాల్‌ ఠాకూర్‌. ఆ చిత్రంతో ఆమె తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నా.. ఇంత వరకు మరో కొత్త కబురు వినిపించలేదు. ఒక మహిళా దర్శకురాలితో ఓ నాయికా ప్రాధాన్య చిత్రం చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించినా.. ఇంత వరకు స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె వైజయంతీ మూవీస్‌ సంస్థలోనే తన రెండో చిత్రం చేయనుందని సమాచారం. ఓ బలమైన నాయికా ప్రాధాన్య కథతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనున్నారని, ప్రస్తుతం సరైన స్క్రిప్ట్‌ను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారని తెలిసింది. మరి ఈ సినిమాని తెరకెక్కించే దర్శకులెవరు, ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అన్నది తేలాల్సి ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని