Tollywood news: సినిమా సంగతులు.. కొత్త మూవీ విశేషాలు..

బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా... రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని కథానాయిక. ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మిస్తున్నారు.

Updated : 29 Nov 2022 15:20 IST

స్టూడెంట్‌ పాట

బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా... రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని కథానాయిక. ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాట ‘మాయే మాయే...’ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం.


నితిన్‌ చిత్రం షురూ

కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీలీల కథానాయిక. నితిన్‌ 32వ చిత్రమిది. మారేడుమిల్లిలో చిత్రీకరణతో ఈ సినిమా షురూ అయిందని నితిన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. రచయితగా విజయాలు అందుకున్న వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య...’తో దర్శకుడిగా మారారు. ఆయన రెండో చిత్రమే నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోంది.


రైతన్నల ‘నాగలి’

రత్‌ పారేపల్లి నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాగలి’. సుదీప్‌ మొక్కరాలతో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. సుదీప్‌ నిడదవోలు, అనుస్మతి సర్కార్‌ నాయకానాయికలు. పావని మొక్కరాల సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు తెలిపాయి సినీ వర్గాలు. భరత్‌ పారేపల్లి మాట్లాడుతూ ‘‘రైతుల తిరుగుబాటు నేపథ్యంలో సాగే చిత్రమిది. రైతు ఆత్మహత్యలు, వాళ్ల సమస్యలు, వెతల్ని ఇందులో ఆసక్తికరంగా చర్చించాం. 27 ఏళ్ల కిందట ‘తపస్సు’ అనే సినిమాలో నటించిన నేను, మళ్లీ ఈ సినిమా కోసం మేకప్‌ వేసుకుని రైతు పాత్రని పోషించాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నెల రోజులపాటు చిత్రీకరణ జరిపి సినిమాని పూర్తి చేశాం. జనవరిలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: పెద్దాడ మూర్తి, ఛాయాగ్రహణం: వాసు వర్మ కఠారి, సంగీతం: ఎం.ఎల్‌.రాజా.


నిజాన్ని వెతుకుతూ పయనం

బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్‌. ఇంతకుముందు అభిషేక్‌ బచ్చన్‌ ‘దస్‌వీ’ చిత్రంతో అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘లాస్ట్‌’. ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్‌ రాయ్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రైమ్‌ రిపోర్టర్‌గా నటించింది యామీ. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ‘‘నిజాన్ని వెతుక్కుంటూ ఆమె ప్రయాణం మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది’’అని ఆ పోస్ట్‌లో పేర్కొంది. మీడియా నేపథ్యంలో సాగే ఈ కథలో యామీ నటన ఆకట్టుకునేలా సాగుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


కిషన్‌రెడ్డి ప్రశంస

‘హను-మాన్‌’ టీజర్‌ అద్భుతంగా ఉందని ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తనని కలిసిన చిత్రబృందాన్ని ఆయన అభినందించారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హను -మాన్‌’. అమృత అయ్యర్‌ కథానాయిక. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మెప్పు పొందడం ఆనందంగా ఉందని సినీ వర్గాలు తెలిపాయి.  


స్నేహం కోసం

సిద్‌ స్వరూప్‌, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి నటీనటులుగా తెరకెక్కిన చిత్రం ‘దోస్తాన్‌’. సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాల మేళవింపుగా రూపొందించిన చిత్రమిది. ఇద్దరు కుర్రాళ్లు స్నేహం కోసం ఏం చేశారన్నది కీలకం. సిద్‌స్వరూప్‌ అందించిన కథ నచ్చి ఈ సినిమాని నిర్మించాం. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్‌ కర్రి, రవికుమార్‌, సంగీతం: ఏలేందర్‌ మహావీర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని