Tollywood: అందాల ‘ప్రత్యేక’ కనువిందు

సినిమాల్లో ప్రత్యేక గీతానికి ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమాకి అదనపు ఆకర్షణ జోడించాలన్నా.. కథానాయకులతో మాస్‌ స్టెప్పులు వేయించాలన్నా.. మాస్‌ ప్రేక్షకుల్ని ఊరిస్తూ థియేటర్లకు రప్పించాలన్నా.. దర్శక నిర్మాతలు తొలుత చూసేది స్పెషల్‌ సాంగ్‌ వైపే.

Updated : 20 Dec 2022 08:44 IST

2022లో అలరించిన ఐటెమ్‌ సాంగ్స్‌

సినిమాల్లో ప్రత్యేక గీతానికి ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమాకి అదనపు ఆకర్షణ జోడించాలన్నా.. కథానాయకులతో మాస్‌ స్టెప్పులు వేయించాలన్నా.. మాస్‌ ప్రేక్షకుల్ని ఊరిస్తూ థియేటర్లకు రప్పించాలన్నా.. దర్శక నిర్మాతలు తొలుత చూసేది స్పెషల్‌ సాంగ్‌ వైపే. హీరో పరిచయ గీతాల్లోనూ లేనంత మజా ఈ పాటల్లో కనిపిస్తుంటుంది. అందుకే ప్రత్యేక గీతాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది తెలుగు చిత్రసీమ. ఎప్పట్లాగే ఈ ఏడాదీ తెలుగులో ఐటెమ్‌ గీతాలు హోరెత్తాయి. అయితే వాటిలో సినిమా జాతకాన్ని నిర్ణయించే స్థాయి ఏ పాటకూ దక్కలేదు. కొన్ని గీతాలు మాత్రం ఆయా సినిమాలకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. మరి ఈ ఏడాది సినీప్రియుల్ని కవ్వించి.. మురిపించిన ఆ ప్రత్యేక గీతాలపై ఓ లుక్కేద్దాం పదండి...

సినిమాలో ఐటెమ్‌ బాంబ్‌ అంటూ ప్రత్యేకంగా ఓ పాట ఉంటే ఆ ఊపే వేరుగా ఉంటుంది. ఇక అగ్ర కథానాయకుల చిత్రాల్లో అలాంటి పాట పడిందంటే థియేటర్లలో ప్రేక్షకులు ఈల వేసి గోల చేయాల్సిందే. కొవిడ్‌ భయాల వల్ల ఈసారి సంక్రాంతికి పెద్దగా అగ్ర కథానాయకుల సందడి కనిపించలేదు. ‘బంగార్రాజు’తో నాగార్జునే ఆ లోటును కాస్త భర్తీ చేసే ప్రయత్నం చేశారు.  ఈ చిత్రంలో ‘‘వాసివాడీ తస్సాదియ్యా..’’ అంటూ నాగ్‌తో పాటు ఆయన తనయుడు చైతన్యతో కలిసి అదిరిపోయేలా మాస్‌ స్టెప్పులేసింది యువ కథానాయిక ఫరియా అబ్దుల్లా. ఈ పాటకు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ స్వయంగా సాహిత్యమందించగా.. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. దీనికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ‘‘కల్లోలం.. కల్లోలం.. ఊరూవాడా కల్లోలం’’ అంటూ ‘ఆచార్య’లోని ప్రత్యేక గీతంతో సినీప్రియుల గుండెల్లో కల్లోలం రేపింది నటి రెజీనా. చిరంజీవి - రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమా కోసమే చిరులోని మాస్‌ ఎనర్జీని ఆవిష్కరించేలా భాస్కరభట్లతో కలిసి ‘‘కల్లోలం..’’ పాటను ప్రత్యేకంగా రాయించారు దర్శకుడు కొరటాల.  భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టినప్పటికీ.. ఈ ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.  

‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో శ్రీకాకుళం సారంగిగా ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది నటి అన్వేషి జైన్‌. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శరత్‌ మండవ తెరకెక్కించారు. ఈ సినిమాలోని ‘‘నా పేరు సీసా..’’ అనే ప్రత్యేక గీతంలో రవితేజతో కలిసి ఆడిపాడింది అన్వేషి. ఈ పాటకు సామ్‌ సిఎస్‌ స్వరాలు సమకూర్చగా.. శ్రేయా ఘోషల్‌ ఆలపించింది. ‘బింబిసార’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన మరో ప్రత్యేక అందం వరీనా హుస్సేన్‌. ఇందులో ‘‘గుళేబకావళి పువ్వులాంటి యవ్వనం..’’ పాటలో కల్యాణ్‌ రామ్‌తో కాలుకదిపిన ఈ అందం.. ఆ వెంటనే ‘గాడ్‌ఫాదర్‌’లో ఆడిపాడే అవకాశం అందుకుంది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి చేసే ఓ ఫైట్‌ సీక్వెన్స్‌లో ‘‘బ్లాస్ట్‌ బేబీ’’ అంటూ ప్రత్యేక పాటతో ప్రేక్షకుల్ని హుషారెత్తించింది వరీనా. ‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘‘రా రా రెడ్డి.. ఐయామ్‌ రెడీ’’ పాటలో అందాలు ఆరబోసింది నటి అంజలి. నితిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దీనికి ప్రేక్షకుల నుంచి చేదు ఫలితం దక్కినప్పటికీ.. ఇందులోని ‘‘రా రా రెడ్డి’’ పాటకు మంచి ఆదరణే దక్కింది. ఈ పాటలోని ఓ చిన్న బిట్‌లో ‘జయం’లోని ‘‘రాను రానంటూనే చిన్నదో’’ గీతాన్ని రీమిక్స్‌ చేసి వినిపించారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌. దానికి నితిన్‌ - అంజలి కలిసి వేసిన స్టెప్పులకు సినీప్రియుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇక ఇటీవల విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’లోని ‘‘జారు మిఠాయా’’ పాటకూ నెట్టింట మంచి ఆదరణ లభించింది.

‘‘జిగేలు రాణి’’ అంటూ గతంలో ‘రంగస్థలం’ చిత్రంలోని ప్రత్యేక గీతంతో కుర్రకారును ఉర్రూతలూగించింది నటి పూజా హెగ్డే. ఆమె ఈ ఏడాది ‘ఎఫ్‌3’ కోసం మరోసారి ఐటెమ్‌ బాంబుగా మారిపోయింది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. ‘ఎఫ్‌2’కు కొనసాగింపుగా రూపొందించారు. ఈ చిత్రం కోసమే ‘‘అధ్యక్షా.. లైఫ్‌ అంటే మినిమం ఇట్లా ఉండాలా’’ అనే ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ పాటలోనే వెంకీ - వరుణ్‌లతో కలిసి హుషారెత్తించేలా స్టెప్పులేసింది పూజా. కాసర్ల శ్యామ్‌ సాహిత్యంతో రూపుదిద్దుకున్న ఈ పాట.. సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. అటు ఉత్తరాదిలోనూ.. ఇటు దక్షిణాదిలోనూ పలు ఐటెమ్‌ గీతాల్లో నర్తించి మురిపించిన ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. ఆమె ఈ ఏడాది ‘విక్రాంత్‌ రోణ’లోని ‘‘రా రా రక్కమ్మ’’ పాటతో మాస్‌ పల్స్‌ రేట్‌ ఒక్కసారిగా పెంచేసింది. కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ఈ పాటకు మాత్రం దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభించింది. ఈ గీతానికి తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. మంగ్లీ ఆకట్టుకునేలా ఆలపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని