సంక్షిప్త వార్తలు(4)

మాజీ క్రికెటర్‌ ధోని నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న తొలి చిత్రం ‘ఎల్‌జిఎం’. లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌.. అన్నది ఉపశీర్షిక.

Published : 29 Jan 2023 01:34 IST

పెళ్లి చేసుకుందాం

మాజీ క్రికెటర్‌ ధోని నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న తొలి చిత్రం ‘ఎల్‌జిఎం’. లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌.. అన్నది ఉపశీర్షిక. రమేష్‌ తమిళమణి తెరకెక్కిస్తున్నారు. హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంటగా నటిస్తున్నారు. సాక్షి ధోని నిర్మాత. నదియా యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో చెన్నైలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి కథలు చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.


నవ్విస్తూ.. థ్రిల్‌ చేసే డిటెక్టివ్‌

‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు శివ కందుకూరి. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పురుషోత్తం రాజ్‌ తెరకెక్కించారు. స్నేహాల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై నిర్మించారు. రాశి సింగ్‌ కథానాయిక. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను హీరో తేజ సజ్జా హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ చూసి ఈ వేడుకకు వచ్చాను. చాలా బాగుంది. కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో రాజ్‌ కందుకూరి ముందుంటారు. ఈ చిత్రం చూడండి.. నచ్చితే పది మందికి చెప్పండి’’ అన్నారు. ‘‘ఇదొక డిటెక్టివ్‌ కథ. ఓవైపు వినోదాలు పంచుతూనే ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తుంది. ఈ సినిమా చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు. శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చిత్రం తెలుగులో రాలేదు. సినిమా చూసి ఓ క్రేజీ ఫీలింగ్‌తో బయటకొస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహాల్‌, రాహుల్‌ యాదవ్‌, రాశి సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


సస్పెన్స్‌.. ట్విస్ట్‌ల ‘బుట్టబొమ్మ’

‘‘ఇదొక మంచి పల్లెటూరి కథ. ఐదేళ్ల క్రితం ‘ఉయ్యాల జంపాల’ అనే చిత్రం చూశాం. అలాంటి సినిమాలో సస్పెన్స్‌, ట్విస్ట్‌లు ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుందీ ‘బుట్టబొమ్మ’’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన.. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రమే ‘బుట్టబొమ్మ’. అనికా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ తెరకెక్కించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో విష్వక్‌ సేన్‌ హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా ఇష్టమైన కథ ఇది. నిజానికి ఇందులో నేనే నటించాల్సింది. డేట్స్‌ కుదరకపోవడం వల్ల చేయలేదు. గుండెల మీద చేతులేసుకొని వచ్చేయొచ్చు ఈ సినిమాకి. అంత బాగుంటుంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా. వంశీ నిర్మాణంలో నేను చేయబోయే చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తామ’’న్నారు. ‘‘నాయికగా నా తొలి చిత్రాన్ని సితార బ్యానర్‌లో చేయడం సంతోషంగా ఉంది. నాకీ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అంది నాయిక అనిక. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’.. ఇలా ఎక్కువగా మాస్‌ చిత్రాలు చూశాం. ఇప్పుడు క్లాస్‌ సినిమా చూస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య వశిష్ఠ, నవ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.


నయా రంగుల ప్రపంచం

క్రాంతి కృష్ణ, శ్రీలు జంటగా నటుడు పృధ్వీరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్‌ రెడ్డి, కె.కృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. విజయ రంగ రాజు, అశోక్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు పృద్వీరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఓ మంచి కథతో ఈ చిత్రం తెరకెక్కించాం. సంగీత ఆదిత్య మంచి స్వరాలందించారు’’ అన్నారు. ‘‘మా నాన్న దర్శకత్వంలో ఈ చిత్రం చేయడాన్ని అదృష్టంగా ఫీలవుతున్నా’’ అంది శ్రీలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని