చెప్పాల్సింది వీళ్లే!

ఒకటి తర్వాత ఒకటంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు పోయాయి. మంచి కథ దొరికిందంటే చాలు.. చేతిలో ఎన్ని చిత్రాలున్నా మరో కబురు వినిపించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు కథానాయకులు. అందుకే కొన్ని రోజులుగా చిత్రసీమలో కొత్త చిత్రాల సందడి గట్టిగా కనిపిస్తోంది.

Updated : 31 Jan 2023 08:18 IST

కొత్త చిత్రాల కబుర్లు వినిపించేదెప్పుడు?

ఒకటి తర్వాత ఒకటంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు పోయాయి. మంచి కథ దొరికిందంటే చాలు.. చేతిలో ఎన్ని చిత్రాలున్నా మరో కబురు వినిపించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు కథానాయకులు. అందుకే కొన్ని రోజులుగా చిత్రసీమలో కొత్త చిత్రాల సందడి గట్టిగా కనిపిస్తోంది. బాలకృష్ణ, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌ తదితర అగ్ర తారలంతా ఇప్పటికే కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టేశారు. మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ తదితర స్టార్లు సైతం తదుపరి చిత్రాలపై స్పష్టత ఇచ్చేశారు. అందుకే ఆయా తారల అభిమానుల్లోనూ ఎలాంటి గందరగోళం లేదు. కానీ చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్‌ లాంటి అగ్ర హీరోల వైపు నుంచి ఎలాంటి స్పష్టమైన కబురు వినిపించడం లేదు. దీంతో వారి తర్వాతి చిత్రాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

తేడాది ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు నాగార్జున. వీటిలో ‘బంగార్రాజు’ ఓ మాదిరిగా ఆడినా ‘ది ఘోస్ట్‌’ అలరించలేకపోయింది. దీంతో కాస్త విరామం తీసుకొని మళ్లీ కథల ఎంపికపై దృష్టి సారించారు నాగ్‌. ఈసారి చేయనున్నది తన 100వ చిత్రం కావడంతో.. అది గుర్తుండిపోయేలా ఉండాలన్న ఉద్దేశంతో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగని ఇంకా కథలు సిద్ధం కాలేదని ఏమీ కాదు. దర్శకుడు మోహన్‌రాజాతో పాటు రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడ ఇప్పటికే కథలు సిద్ధం చేసి, వినిపించారని సమాచారం. ఈ ఇద్దరితోనూ కలిసి పనిచేసేందుకు నాగార్జున సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అయితే వీరిలో ముందుగా ఎవరితో సినిమా చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. దీంతో ఇప్పుడా కబురు కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో వరుస విజయాలందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నారు కథానాయకుడు చిరంజీవి. ఇప్పుడీ ఉత్సాహంలోనే ‘భోళా శంకర్‌’ను పూర్తి చేసేందుకు మెహర్‌ రమేష్‌తో కలిసి రంగంలోకి దిగారాయన. ఇది ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణకు చేరుకున్నప్పటికీ.. చిరు తదుపరి చిత్ర విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన కోసం అగ్ర దర్శకులు వి.వి.వినాయక్‌, పూరి జగన్నాథ్‌ కథలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఈ జాబితాలోకి త్రినాథరావు నక్కిన కూడా చేరినట్లు ప్రచారం వినిపిస్తోంది. మరి వీళ్లలో ఎవరితో కలిసి చిరు ముందడుగు వేస్తారో వేచి చూడాలి.

‘పుష్ప’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొని.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ‘పుష్ప2’తో మరోసారి సినీప్రియుల్ని మురిపించేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇప్పటికీ తేలలేదు. బోయపాటి శ్రీను, మురుగదాస్‌ లాంటి వారి పేర్లతో పాటు పలువురు బాలీవుడ్‌ దర్శకుల పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి. కానీ, బన్నీ మాత్రం ‘పుష్ప2’ విడుదల తర్వాతే కొత్త చిత్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘విరాటపర్వం’ విడుదలై ఆరు నెలలు పూర్తవుతున్నా రానా తదుపరి ప్రాజెక్ట్‌ ఇంకా తేలలేదు. ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న ‘హిరణ్య కశ్యప’ కార్యరూపం దాల్చుతుందని భావించినా.. అదీ నెరవేరలేదు. ‘మానాడు’ తెలుగు రీమేక్‌లో నటిస్తారని వార్తలు వినిపించినా.. ఆఖరికి అది రవితేజ - సిద్ధు జొన్నలగడ్డ చేతికి చేరింది. దీంతో ఇప్పుడాయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక యువ కథానాయకుడు అఖిల్‌ తదుపరి చిత్ర విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని