సంక్షిప్త వార్తలు(7)

టబు, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ కామెడీ థ్రిల్లర్‌ తెరకెక్కనుంది. విమానయాన రంగంలోని సాధకబాధకాల కథాంశంతో.. వ్యంగ్యంగా రూపొందించే ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటికే అంతటా ఆసక్తి నెలకొంది.

Published : 01 Feb 2023 01:17 IST

అందాల తారల నవ్వులు

బు, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ కామెడీ థ్రిల్లర్‌ తెరకెక్కనుంది. విమానయాన రంగంలోని సాధకబాధకాల కథాంశంతో.. వ్యంగ్యంగా రూపొందించే ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటికే అంతటా ఆసక్తి నెలకొంది. మార్చిలో చిత్రీకరణ మొదలు కానుంది. ఇప్పుడు ఈ తారాగణానికి నటుడు, గాయకుడు దిల్జిత్‌ దొసాంజ్‌ జత కలవనున్నారని నిర్మాతలు ఏక్తా కపూర్‌, రియా కపూర్‌లు మంగళవారం వెల్లడించారు. ‘ఉడ్తా పంజాబ్‌’ ఫేం ఆయన. రాజేష్‌ కృష్ణన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ లిమిటెడ్‌, అనిల్‌ కపూర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


బవాల్‌ ఆలస్యం అందుకే!

రుణ్‌ ధావన్‌, జాన్వీ కపూర్‌ నాయకానాయికలుగా ముస్తాబవుతున్న చిత్రం ‘బవాల్‌’. చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకొస్తున్నట్టు గతంలో తెలిపారు. అయితే గ్రాఫిక్స్‌, ఇతర సాంకేతిక అంశాల కారణంగా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని మంగళవారం ప్రకటించారు. దర్శకుడు నితేష్‌ తివారీ చిత్రానికి మరిన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్దాలని కోరడంతో ఇది విడుదల తేదీ మరింత వెనక్కి జరిగే అవకాశాలున్నాయి. ‘బవాల్‌’ని సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మించారు.


వినూత్న సాంకేతికతతో.. పొన్నియిన్‌ సెల్వన్‌ 2

భారీ తారాగణంతో తెరకెక్కిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ బాక్సాఫీసు దగ్గర మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి ఫ్రాంఛైజీ చిత్రంగా వస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ని మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మణిరత్నం. అందులో భాగంగా రెండో భాగాన్ని ఐమాక్స్‌ వైడ్‌స్క్రీన్‌ సినిమాటోగ్రఫీ సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకు రానున్నారు. దీంతో సినిమా చూసే ప్రేక్షకులు మరింత వినూత్నమైన అనుభూతికి లోనయ్యే అవకాశం ఉంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-ఐమాక్స్‌ సాంకేతిక పరిజ్ఞానం.. ఒకదానికొకటి విడదీయలేనటువంటివి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ సైతం ఐమాక్స్‌ స్క్రీన్‌లతో ఏప్రిల్‌ 28న మీ ముందుకొస్తోంది’ అని మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు.


జైలర్‌లో జాకీష్రాఫ్‌?

జనీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్‌ చేరనున్నట్లు సమాచారం. ‘‘దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ బృందం జాకీ సర్‌ని సంప్రదించిన మాట వాస్తవమే. ఆయన కథ..అందులోని తన పాత్ర గురించి ఓ అవగాహనకు వచ్చాకా నటించే విషయంలో స్పష్టత వస్తుంది’’అని జాకీ సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. గతంలో ‘ఉత్తర్‌ దక్షిణ్‌’ అనే సినిమా రజనీ, జాకీ కలిసి పనిచేశారు. ఇప్పటికే ‘జైలర్‌’లో మోహన్‌లాల్‌, శివరాజ్‌   కుమార్‌, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్‌, వసంత్‌ రవి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 60శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.


‘దళపతి67’ నాయిక.. ప్రతినాయక

విజయ్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ‘దళపతి67’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అలాగే నాయికగా ప్రియా ఆనంద్‌ను ఖరారు చేసినట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ కథ విన్నప్పుడే ఇందులో భాగమవుతానని తెలుసు. ఇప్పుడీ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాల తర్వాత లోకేష్‌ మల్టీవర్స్‌లో రూపొందుతున్న కొత్త చిత్రమిది. ఇందులో విజయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా సంజు నటిస్తున్నారు. శాండీ, మిస్కిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


‘పఠాన్‌’ కోసం షెహ్‌జాదా వాయిదా 

కార్తీక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ జోడీగా తెరకెక్కుతున్న చిత్రం ‘షెహ్‌జాదా’. ఇది తెలుగు ‘అలవైకుంఠపురములో..’కి రీమేక్‌. ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో తమ సినిమా విడుదలని వారం ఆలస్యంగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అల్లు అరవింద్‌, భూషణ్‌ కుమార్‌, అమన్‌గిల్‌ నిర్మించారు.


ఆహ్లాదకరం... ఈ ప్రేమకథ

విశ్వ కార్తికేయ హీరోగా చలపతి పువ్వల తెరకెక్కించిన చిత్రం ‘అల్లంత దూరాన’. ఎన్‌.చంద్రమోహన్‌ రెడ్డి నిర్మించారు. నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమాని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కథ కథనాలకు ప్రాధాన్యమిస్తూ తీసిన చిత్రమిది. తెలుగులో విడుదల చేశాక మంచి తేదీ చూసుకొని తమిళంలోనూ విడుదల చేస్తామ’’న్నారు. ‘‘ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. రధన్‌ సంగీతం అందరి మనసుల్ని హత్తుకుంటుంది’’ అన్నారు దర్శకుడు చలపతి. ఈ చిత్రానికి కూర్పు: శివ కిరణ్‌, ఛాయాగ్రహణం: కల్యాణ్‌ బోర్లగాడ్డ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు