సంక్షిప్త వార్తలు(7)

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరుమీదున్న రవితేజ తన కొత్త చిత్రాలను వేగంగా పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

Updated : 03 Feb 2023 03:16 IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో  టైగర్‌ సందడి

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరుమీదున్న రవితేజ తన కొత్త చిత్రాలను వేగంగా పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. రవితేజ, జూనియర్‌ ఆర్టిస్టులపై కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్‌, నుపుర్‌ సనన్‌ నాయికలుగా నటిస్తున్నారు. 1970 స్టూవర్టుపురం నేపథ్యంలో సాగే చిత్రమిది. వంశీ దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


రాఖీ.. రాణీ ప్రేమ మరోసారి వాయిదా

కరణ్‌జోహార్‌ రూపొందిస్తున్న ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ మరోసారి వాయిదా పడింది. రణ్‌వీర్‌ సింగ్‌, అలియాభట్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కావల్సి ఉండగా, జులై 28కి వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ ఏప్రిల్‌ 28న రానుండటంతో తమ చిత్రాన్ని మరో తేదీలో విడుదల చేస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో ధర్మేంద్ర, షబానా అజ్మి, జయా బచ్చన్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


వచ్చే నెలలో క్రిస్టఫర్‌

మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రిస్టఫర్‌’. వినయ్‌రాయ్‌, ఐశ్వర్యలక్ష్మి, స్నేహ, అమలాపాల్‌ కీలక భూమికల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కి దర్శకుడు, నిర్మాత బి.ఉన్నికృష్ణన్‌. చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉందీ సినిమా. దీన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్టు  తాజాగా ప్రకటించారు. అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏజెంట్‌’లో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.


మరో కన్నడ చిత్రంలో

‘కేజీఎఫ్‌ 2’లో అధీరాగా మెప్పించిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌కి దక్షిణాదిలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ కొత్త ప్రాజెక్టు ‘దళపతి 67’లో ప్రతినాయకుడిగా అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాకముందే.. ధ్రువ్‌ సర్జా హీరోగా కన్నడంలో తెరకెక్కుతున్న ‘కేడీ’ చిత్రీకరణలో పాల్గొననున్నట్టు  సినీవర్గాలు ప్రకటించాయి. దీనికోసం ఈపాటికే బెంగళూరు చేరుకున్నారు సంజయ్‌దత్‌. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఇకనుంచి దక్షిణాది చిత్రాలు ఎక్కువ చేయదలచుకున్నా. ఇక్కడి వాళ్లకి సినిమాలపై ఉన్న ప్రేమ ఎక్కువ. వాళ్ల నుంచి ఎనర్జీ, హీరోయిజం లక్షణాలు.. ఇంకా ఎన్నో మేం నేర్చుకోవాల్సి ఉంది’ అన్నారు. పీరియాడిక్‌ డ్రామా కథాంశంతో పాన్‌ ఇండియా సినిమాగా ముస్తాబవుతున్న ‘కేడీ’కి ప్రేమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


ఆనందంతో కన్నీళ్లొస్తున్నాయి

‘రైటర్‌ పద్మభూషణ్‌’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించారు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గురువారం ఫ్యామిలీ స్క్రీనింగ్స్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌ మాట్లాడుతూ..  ‘‘ఇది నా తొలి థియేటర్‌ చిత్రం. సినిమా చూశాక చాలా మంది నన్ను దీవిస్తుంటే ఆనందంతో నాకు మాట రాలేదు. మా చిత్రంతో పాటు వస్తున్న అన్ని సినిమాలు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వేసిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఈ వేడుకకు ఫ్యామిలీ స్క్రీనింగ్స్‌ సక్సెస్‌ మీట్‌ అని నమ్మకంగా పేరు పెట్టాం. థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇదే నమ్మకాన్ని విడుదల తర్వాత ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌. కార్యక్రమంలో శరత్‌, టీనా శిల్పరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


‘సూర్యాపేట జంక్షన్‌’లో ఏమైంది?

ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నాదెండ్ల రాజేష్‌ తెరకెక్కించిన చిత్రం ‘సూర్యాపేట జంక్షన్‌’. అనిల్‌ కుమార్‌ కాట్రగడ్డ, ఎన్‌.ఎస్‌.రావు, విష్ణువర్ధన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో ఈశ్వర్‌ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ చూసి.. అందరూ మెచ్చుకుంటుంటే మా కష్టానికి ఊపిరిపోసినట్లుంది. ఒక యథార్థ కథతో సినిమాటిక్‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ‘‘ఇదొక మాస్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. నాకీ అవకాశమిచ్చిన హీరో, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు రాజేష్‌. ఈ కార్యక్రమంలో నల్లపల్లి శ్రీనివాస్‌, నైనా తదితరులు పాల్గొన్నారు.


‘వేద’ విడుదల ఖరారు

శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘వేద’ ఈ నెల 9న తెలుగులో విడుదల కానుంది. ఆ విషయాన్ని నిర్మాత వి.ఆర్‌.కృష్ణపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శివరాజ్‌ కుమార్‌ అర్థాంగి గీతా శివరాజ్‌కుమార్‌ నిర్మాణంలో, హర్ష దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే కన్నడలో విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. నాకు ఆ అవకాశం దక్కింది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తప్పక తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ఘనవి లక్ష్మణ్‌, అదితి సాగర్‌, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్య.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని