Vani Jayaram: సన్నిధి చేరగా.. ఆనతి నీయరా హరా!

వాణీ జయరాం గానం... తేనె ధారల ప్రవాహం భాష ఏదైనా సరే... ఆమె పాట ఓ పరవశం సంగీత సాహిత్యాలకి అదొక సంబరం శ్రావ్యత... మాధుర్యం అంటే ఏమిటో తెలియాలంటే ఆమె పాట వినాల్సిందే!

Published : 05 Feb 2023 03:45 IST

వాణీ జయరాం గానం... తేనె ధారల ప్రవాహం భాష ఏదైనా సరే... ఆమె పాట ఓ పరవశం సంగీత సాహిత్యాలకి అదొక సంబరం శ్రావ్యత... మాధుర్యం అంటే ఏమిటో తెలియాలంటే ఆమె పాట వినాల్సిందే!

‘నేనా పాడనా పాట...’ అంటూ ఆమె గొంతు సవరించుకోగానే ‘ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊగంగా’ అంటూ తెలుగుదనం మురిసిపోయింది. ఆమె పుట్టింది తమిళనాడులో అయినా... ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ అంటూ ఇతర భారతీయ భాషలు సైతం ఆమెని సొంతం చేసుకున్నాయి. ‘మన అమ్మాయే...’ అనే భావన కలగజేస్తూ ఆయా భాషల్లో వాణీ జయరాం గొంతు పల్లవించింది. 10 వేలకిపైగా పాటలు ఆలపించిన ఆమె సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు.

‘చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగ సావాసంగ’’

- అవును... వాణీ జయరాం తీయటి గొంతు తేనెల్ని చిక్కింది చిలికింది. ఆమె గొంతులో పలికిన సప్త స్వరాలు అమృత రాగాలై వింటున్నకొద్దీ మాధుర్యాన్ని పంచాయి, ఎప్పటికీ పంచుతూనే ఉంటాయి.

తేనెలొలికే ఆమె గాత్రానికీ... తేనెకీ మధ్య  జన్మజన్మల బంధమే ఉంది. ఆ విషయాన్ని ఆమె సందర్భం వచ్చిన ప్రతిసారీ గుర్తు చేసుకునేవారు. తమిళనాడులోని రాయవెల్లూరులో పద్మావతి, దొరస్వామిల ఆరో సంతానంగా 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరాం. ఆమె పుట్టగానే తల్లిదండ్రులు ఓ సిద్ధాంతి దగ్గరికి తీసుకెళ్లారు. ‘గత జన్మలో తేనెతో దేవుణ్ని అభిషేకించింది ఈ పాప. భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంద’ని చెప్పారట. విద్యావాణి అని అర్థం వచ్చేలా కలైవాణి అనే పేరుని సూచించారట. సంగీత నేపథ్య కుటుంబం కావడం, తోబుట్టువులు కూడా సంగీత ప్రియులే కావడంతో వాళ్లతో కలిసి శ్రీనివాస అయ్యంగార్‌ దగ్గర సంగీత పాఠాలు వినేందుకు వెళ్లడం అలవాటైంది. అలా ఐదేళ్ల ప్రాయంలోనే కృతులు పాడటం అలవాటు చేసుకున్నారు వాణి జయరాం. ఆమె అభిరుచిని తెలుసుకున్న గురువు ఆమెకీ ప్రత్యేకంగా సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అలా శాస్త్రీయ సంగీతంతో ఆమెకి అనుబంధం పెరిగింది. ఆ తర్వాత చెన్నైలో టి.ఆర్‌.బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌.ఎస్‌.మణి తదితరుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ల వయసులోనే ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడారు. అక్కడ మొదలైన ఆమె గాన ప్రయాణం తిరుగులేని రీతిలో సాగింది. ఆ తర్వాత మరో పదేళ్లపాటు వివిధ వేదికలపై ఆమె పాట వినిపించింది. సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందే ఆమె సెలబ్రిటీ అయ్యారు.

‘‘కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను’’

- సనాతన సంప్రదాయ కుటుంబం. సంగీతం అంటే వాళ్ల దృష్టిలో శాస్త్రీయ సంగీతమే. సినీ గీతాలు విన్నా పాడినా శాస్త్రీయ సంగీతానికి అవమానం జరిగినట్టుగానే భావించేంత కట్టుబాట్లు. అందుకే ఇంట్లో లలిత గీతాలతో సహా ఏ పాట కూడా  వినిపించేది కాదు. కానీ వాణికేమో ఎప్పటికైనా సినీ గీతం ఆలపించాలనేది కోరిక. అందుకే ఇంట్లో రేడియోని చిన్నగా పెట్టుకుని వివిధ భారతిలో వచ్చే పాటలు వింటూ నేపథ్య సంగీతం సహా కంఠతా పట్టేవారు. సినిమాకి పాడాలనే కలతో ఆమె అనుబంధం కొనసాగుతూనే వచ్చింది.  ఆ కల పెళ్లి తర్వాతే నెరవేరింది. చెన్నైలో డిగ్రీ పూర్తి చేశాక ఎస్బీఐలో ఆమెకి ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌కి బదిలీ అయ్యింది. ఆ తర్వాత జయరాంతో పెళ్లయింది. సికింద్రాబాద్‌లో వీళ్ల వివాహం. ముంబైలో ఉద్యోగం చేస్తున్న ఆయనకీ సంగీతం అంటే ప్రేమ. పండిట్‌ రవిశంకర్‌ దగ్గర ఆరేళ్లపాటు సితార్‌ నేర్చుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే భర్త ప్రోత్సాహంతో సంగీతంపై దృష్టిపెట్టారు వాణీజయరాం. ఉస్తాద్‌ అబ్దుల్‌ రహమాన్‌ దగ్గర హిందూస్థానీ నేర్చుకున్నారు. ఆయన సలహా మేరకు  ఉద్యోగం మానేసి పూర్తిగా సంగీత ప్రపంచంపైనే దృష్టిపెట్టారు. 1969లో తొలి సంగీత కచేరీ ఇచ్చారు. ఆ తర్వాత మరెన్నో కచేరీ ప్రదర్శనలు. ఓ కార్యక్రమానికి సంగీత దర్శకుడు వసంత్‌ దేశాయ్‌ హాజరవడం, ఆయనకి వాణి గానం నచ్చడం, కొన్ని భజన గీతాలు రికార్డ్‌ చేయించడం, ఆ తర్వాత తన సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుడ్డీ’ చిత్రంలో పాడే అవకాశం ఇవ్వడం... ఇలా చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర, జయబాధురి నాయకానాయికలుగా నటించిన ఆ చిత్రంలో ‘కైసే జియొగి... హరి బిన్‌ కైసే జియొగి’, ‘హమ్‌ కో మన్‌ కీ శక్తి దేనా’, ‘బోలేరే పపీ హరా..’ అంటూ సాగే గీతాలు సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగించాయి.  ఆ మూడు పాటలతో  వాణి పేరు మార్మోగిపోయింది. ఆ సమయంలో ఎక్కడ చూసినా బోలే రే పపీ హరా.. పాటే. సినిమాల్లో పాడాలనే కోరిక నెరవేరడంతోపాటు, తొలి పాటే సంచలనంగా మారడంతో వాణి జయరాంకి అవకాశాలు వెల్లువెత్తాయి. ‘పాకీజా’తోపాటు, ఆర్‌.డి.బర్మన్‌, నౌషాద్‌, మదన్‌ మోహన్‌, ఓపీ నయ్యర్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, పండిట్‌ రవిశంకర్‌ తదితర సంగీత దర్శకుల దగ్గర సినిమాలకి పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. మహమ్మద్‌ రఫి, కిషోర్‌ కుమార్‌ లాంటి గాయకులతోనూ కలిసి పాటలు  ఆలపించారు. ఆ జోరుతో దక్షిణాది పాటల గురించి ఆలోచించే అవసరమే ఆమెకి రాలేదు. కానీ ఆ సందర్భంలో వాణీ జయరాం హవా సీనియర్‌ గాయకుల్లో దడ పుట్టించేతగా సాగిందని చెబుతుంటారు.

ఎప్పటివలె కాదురా స్వామి...

తెలుగులో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమా హిందీలో డబ్‌ కావడం, ఆ సినిమా రికార్డింగ్‌ కోసమని చెన్నై వెళ్లడమే వాణి జయరాంని దక్షిణాది సినిమాలకి చేరువ చేసింది. కొంతమంది ‘మన మద్రాసు అమ్మాయే’ అంటూ కె.వి.మహదేవన్‌కి పరిరయం చేయడంతో ఆయన ‘తమిళంలో కూడా పాడొచ్చు కదా’ అని అడిగారట. అప్పుడు కుదరకపోయినా, 1973లో చెన్నైకి సంగీత కచేరీ కోసం వెళ్లినప్పుడు సలీల్‌ చౌదరి సంగీత దర్శకత్వంలో ‘స్వప్నం’ అనే మలయాళ చిత్రం కోసం ఓ పాటని ఆలపించారు. ఆ తర్వాత ఎస్‌.పి.కోదండపాణి స్వరకల్పనలో ‘అభిమానవంతుడు’ చిత్రం కోసం ‘ఎప్పటివలె కాదు రా స్వామి...’ అంటూ సాగే పాటని ఆలపించారు. వాణి జయరాం ఆలపించిన మొట్ట మొదటి తెలుగుపాట ఇదే. ఆ తర్వాత తమిళం, కన్నడ భాషల నుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో ‘నోము’, ‘పూజ’, ‘మరోచరిత్ర’, ‘సీతామాలక్ష్మి’ మొదలైన చిత్రాల్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. దక్షిణాది చిత్రాల్లో పాడటం పెరిగాక హిందీలో ఆమెకి అవకాశాలు తగ్గాయి. సినిమా రంగంలో తెరచాటు రాజకీయాలే అందుకు కారణం అని చెప్పేవారు వాణీ జయరాం.

‘‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ... అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులలై (సీతాకోక చిలుక)
‘అందెల రవమిది పదములదా (స్వర్ణకమలం)
కలిసిన హృదయాలలోనా (ప్రేమ పగ)
నీలి మేఘమా జాలి చూపుమా (అమ్మాయిల శపథం)
దొరకునా ఇటువంటి సేవా (శంకరాభరణం)
ఆనతి నీయరా హరా (స్వాతికిరణం)
శ్రీ సూర్యనారాయణ మేలుకో.. (మంగమ్మగారి మనవడు)
ఇన్ని రాశుల యునికి... ఇంతి చెలువవు రాశి (శ్రుతిలయలు)

- ఇలా ఎన్నో విజయవంతమైన తెలుగు గీతాలు ఆలపించి సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగించారు వాణి జయరాం. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడే తెలుగు భాషపై పట్టు పెంచుకున్నారు. తెలుగుతో ఉన్న అప్పటి అనుబంధంతోనే భాషా దోషాలు లేకుండా తెలుగు పాటలు పాడానని చెప్పేవారు.
ఏదైనా కొత్తగా పాడించాలన్నా... కష్టమైన స్వరకల్పనలైనా అప్పట్లో వాణీ జయరాంతో పాడించేవారట. పలువురు కథానాయికల తొలి చిత్రాలకి ఆమే పాటలు పాడారు. శ్రీదేవి తొలి హిందీ, తమిళ చిత్రాలకీ, హిందీలో షబానా ఆజ్మీ, జుహీచావ్లా, పర్వీన్‌ బాబీ, జయ బాధురిల తొలి చిత్రాల్లో వాణి గానమే వినిపిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, బెంగాలీ సహా 19 భాషల్లో ఆమె పాటలు ఆలపించారు.

విధి చేయు వింతలన్నీ... మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో

వాణీ జయరాం పాటనే లాలించారు, పాటనే ప్రేమించారు, పాటే ప్రపంచంగా బతికారు. ఆమె ఆలపించిన పాటలే ఆమె వారసులు. మాకు పిల్లల్లేని లోటుని సంగీతమే తీర్చిందని చెప్పేవారు వాణి జయరాం. ఆమె ప్రతిభకి ఎన్నో పురస్కారాలు దాసోహం అయ్యాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన ఆ పురస్కారాన్ని వచ్చిందన్న సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే... ఆ పురస్కారాన్ని అందుకోక ముందే ఆమె దూరం కావడం అభిమానుల్లో శోకాన్ని నింపింది.


ఆయన మాటలే స్ఫూర్తి..

సుస్వర కంఠంతో భక్తితత్వాన్ని, ఆధ్యాత్మికతను, ఆర్ద్రతను కలబోసి అనేక భారతీయ భాషల్లో ఎన్నో వేల గీతాలు ఆలపించి, మెప్పించారు వాణీ జయరాం. ఆమెను ‘గుడ్డీ’ చిత్రంతో సంగీత దర్శకుడు వసంత్‌ దేశాయి చిత్రసీమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కెరీర్‌ తొలినాళ్లలో ఆయన చెప్పిన మాటలే తనకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయని వాణీ ఓ సందర్భంలో తెలియజేశారు. ‘‘నీ ప్రతిమను అద్దంలో చూసుకున్నప్పుడు అది ప్రతిబింబిస్తుంది. నువ్వేంటో తెలియచెబుతుంది. నీ మనసులో ఏముందో ఆ అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని బేరీజు వేసుకొని ఉన్నతమైన ఆశయ సాధన ప్రక్రియను కొనసాగించు. అప్పుడే నీ జీవితానికి ఒక సార్థకత లభిస్తుంద’ని నా గురుతుల్యులు వసంత్‌ దేశాయి చెబుతుండేవారు. ఆ మాట నన్నెంతో ప్రభావితం చేసింది. ఆ మాటలు ఎప్పుడూ నాలో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయి’’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


లతాజీతో గొడవ

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఆ రంగుల మాటున ఎన్నో రాజకీయాలు పని చేస్తుంటాయనేవారు వాణీ జయరాం. కెరీర్‌ తొలినాళ్లలో అలాంటి రాజకీయాల వల్ల తానెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు. ముఖ్యంగా తానెంతో ఆరాధించిన లతా మంగేష్కర్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వాణీ పలు సందర్భాల్లో పంచుకున్నారు. ‘‘దక్షిణాది చిత్రాల్లో పాడటం అధికమయ్యాక హిందీలో నాకు అవకాశాలు మందగించాయి. సినీ పరిశ్రమలోని ఆధిక్య భావనలూ, అసూయా ద్వేషాలే దీనికి కారణం. బాలీవుడ్‌ సినిమా రంగంలో ఎన్నో రాజకీయాలు తెరచాటుగా పని చేస్తుంటాయనే సత్యం బోధపడేసరికి ఖిన్నురాలయ్యాను. నా పాటలు ప్రాచుర్యం చెందేసరికి ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌ ‘ఈమె నాకు ఎక్కడ పోటీగా నిలుస్తుందో’ అని భయపడ్డారు. ‘గుడ్డీ’ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందిన సమయంలో నేను లతాజీ ఆశీస్సులు తీసుకోవడానికి వారి ఇంటికి వెళ్లా. కానీ, ఆమె కలవడానికి ఇష్టపడలేదు. నా తొలి చిత్రంలో మొత్తం మూడు పాటలు పాడా. వాటిలో ‘బోలే రే’ సూపర్‌ హిట్టు. దిల్లీలో ఆ చిత్రం విడుదలైనప్పుడు వారం పాటు నా మూడు పాటలతో సినిమా రన్‌ అయ్యింది. ఆ తర్వాత అందులో నేను పాడిన ఓ పాట తీసేసి దాని స్థానంలో ‘ఆజారే పరదేశీ’ గీతాన్ని పెట్టారు. అప్పుడది ఎందుకు అలా జరిగిందో తెలియలేదు. దాని గురించీ చాలా వార్తలొచ్చాయి. ఓసారి లతాజీ ఇంట్లో నేపథ్య గాయకుల సమావేశం జరిగింది. ఆ తర్వాత నాకు పాటలు తగ్గాయి. ఇక 1979లో విడుదలైన ‘మీరా’ చిత్రం మా ఇద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. ఆ సినిమాకి పండిట్‌ రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు దర్శకుడు గుల్జార్‌. అది లతాకు నచ్చలేదు. తన సోదరుడ్ని సంగీత దర్శకుడిగా తీసుకోకపోతే ఆ చిత్రంలో పాటలు పాడనని చెప్పారు. దాంతో గుల్జార్‌ నాతో పాటలన్నీ పాడించారు. అలా లతాజీకి నాపై కోపం ఎక్కువైంది. కొన్నాళ్లకు ఆ బాలీవుడ్‌ రాజకీయాలపై విసుగొచ్చి మద్రాస్‌ వచ్చేశా’’ అని ఆనాటి జ్ఞాపకాల్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నారు వాణి.


నీ స్వరమే బంగారమైతే.. వేరే బంగారం మాకెందుకు!

తన గళంతో అమృత రాగాలు కురిపించి.. సినీ సంగీత ప్రియుల్ని ఓలలాడించిన సంగీత రాజ్ఞి వాణీ జయరాం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన వాణీ సినీ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు ఆమె భర్త జయరాం. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అయితే ఈ వివాహం వెనకున్న ఓ ఆసక్తికర విషయాన్ని వాణీ జయరాం ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘మా ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమే. పెళ్లికి ముందు నేను ఒకటే చెప్పా. కట్నాలు, కానుకలు, బంగారపు ఉంగరాలు కావాలనే వారు నాకొద్దని. దానికి మా అత్త.. ‘అమ్మా.. నీ స్వరమే బంగారమైతే.. ఇక వేరే బంగారం మాకెందుక’ని ఏరికోరి నన్ను కోడలిగా చేసుకుంది. అప్పటి నుంచి ఆయన నేను రాగం.. తానం.. పల్లవులం’’ తన పెళ్లి నాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు వాణీ. ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు.


పాటల బృందావనం విడిచి..

కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘స్వాతికిరణం’, ‘స్వర్ణకమలం’, ‘శంకరాభరణం’, ‘శ్రుతిలయలు’  తదితర చిత్రాల్లో వాణీ జయరాం ఆలపించిన పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ఆ పాటల్ని గుర్తు చేసుకుంటూనే ఇటీవలే  మరణించిన కె.విశ్వనాథ్‌కి వీడ్కోలు పలికారు అభిమానులు. ఆయన మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే వాణీ జయరాం మరణించడం సినీ అభిమానుల్ని కలచివేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని