సంక్షిప్త వార్తలు(7)

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ జంటగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 06 Feb 2023 03:21 IST

సరదాలు పంచే శ్రీదేవి శోభన్‌బాబు

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ జంటగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ.. ‘‘1970ల కాలం నాటి ఓ గ్రామం నేపథ్యంగా సాగే చిత్రమిది. చాలా సరదాగా ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది’’ అన్నారు. ‘‘ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అంది గౌరి జి.కిషన్‌. సుస్మిత మాట్లాడుతూ.. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌.. గ్రామీణ నేపథ్య పాత్రను అద్భుతంగా చేశాడు. గౌరికి తెలుగు రాకపోయినా.. నేర్చుకుని మరీ నటించింది. సోమవారం ఓ పాట విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నంత సేపు మన చుట్టూ ఉన్న పాత్రలే గుర్తొస్తాయి. అంత సహజంగా ఉంటాయి. ఇది చూశాక తమ కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బాగుంటుందనే ఆలోచన అందరిలోనూ వస్తుంది’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌ కుమార్‌. కార్యక్రమంలో శరణ్య, విష్ణు ప్రసాద్‌, డాలీ, సిద్ధార్థ్‌ తదితరులు పాల్గొన్నారు.


‘జైలర్‌’ సెట్లో జాకీష్రాఫ్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ముస్తాబవుతున్న చిత్రం ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, తమన్నా, రమ్యకృష్ణలాంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ తారాగణానికి బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీష్రాఫ్‌ జత అయినట్టు నిర్మాణసంస్థ సన్‌ పిక్చర్స్‌ ఆదివారం ప్రకటించింది. ‘జైలర్‌ సెట్లోకి జాకీష్రాఫ్‌’ అంటూ ట్వీట్‌ చేస్తూ ఫస్ట్‌లుక్‌ చిత్రాన్ని పంచుకుంది. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలందిస్తున్నారు.


యథార్థ కథతో ‘శాంతల’

అశ్లేషా ఠాకూర్‌ ప్రధాన పాత్రలో శేషు తెరకెక్కిస్తున్న చిత్రం ‘శాంతల’. ఇర్రంకి సురేష్‌, సత్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం చిక్కమంగళూరులో ప్రారంభమైంది. ‘‘హలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యథార్థ కథ ఆధారంగా ఈ పీరియాడిక్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే కథాంశంతో పాటు అద్భుతమైన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. మార్చి నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. దీనికి రమేష్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నాం.


ఊ అంటావా మావా.. ఊఊ అంటావా!

యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. రేలంగి నరసింహారావు తెరకెక్కించారు. తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మాత. రఘు కుంచె, బాబు మోహన్‌, పూజ, సిమ్రాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన కామెడీ హారర్‌ చిత్రం. ఓవైపు నవ్విస్తూనే.. ఆద్యంతం థ్రిల్‌కి గురి చేస్తుంది. మా దర్శకుడు నరసింహారావు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలిచ్చారు. ఇప్పుడాయన దర్శకత్వం నుంచి వస్తున్న ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాం’’ అన్నారు. సంగీతం: సాబు వర్గీస్‌, ఛాయాగ్రహణం: కంతేటి శంకర్‌.


సందేశమిచ్చే సిరిమల్లె పువ్వా

శ్రీకర్‌ కృష్ణ, శ్రావణి నిక్కీ జంటగా గౌతమ్‌ మైలవరం తెరకెక్కించిన చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. కౌసర్‌ జహాన్‌ నిర్మాత. అజయ్‌ ఘోష్‌, జయనాయుడు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దర్శకులు సముద్ర, చంద్రమహేష్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకర్‌ మాట్లాడుతూ.. ‘‘2019లో మొదలైన ఈ చిత్రం 2023లో విడుదలవుతోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు మేమెంత కష్టపడ్డామో. కానీ, మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు. ‘‘ఒక గిరిజన యువతి.. ఓ అబ్బాయిని ప్రేమిస్తే ఎన్ని ఇబ్బందులు పడిందన్నదే చిత్ర కథాంశం. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తూ మంచి సందేశం ఇవ్వనున్నాం. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత కౌసర్‌. కార్యక్రమంలో ప్రసన్న కుమార్‌, రాజేంద్ర, మాణిక్‌, నిక్కీ తదితరులు పాల్గొన్నారు.


మై ఖిలాడీ.. తూ అనారీ

ఇద్దరు అగ్ర కథానాయకులు కలిస్తేనే వార్త.. ఆ ఇద్దరూ కలిసి స్టెప్పులేస్తే.. అది రచ్చ కాకుండా ఉంటుందా? సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌లు ఆదివారం అదే చేశారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా కలిశారో చెప్పలేదుగానీ అక్షయ్‌కుమార్‌ తాజా చిత్రం ‘సెల్ఫీ’లోని ‘మై ఖిలాడీ తూ అనారీ..’ పాటకు ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేశారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘మై ఖిలాడీ పాట భాయ్‌ దృష్టికి వచ్చింది. సెకన్లలోనే బీట్‌ని పట్టేశాడు’ అంటూ అక్షయ్‌ కామెంట్‌ జోడించాడు. ఇమ్రాన్‌ హష్మీతో కలిసి నటించిన ‘సెల్ఫీ’ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


సుధా కొంగరకు గాయం

ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర గాయపడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈమేరకు చేతి కట్టుతో ఉన్న ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. ‘‘చాలా చిరాకుగా, బాధగా ఉంది. నెల రోజుల పాటు విశ్రాంతి అవసరం. నేనిలా చిత్రీకరణల నుంచి బ్రేక్‌ తీసుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ఆ ఫొటోలకు ఓ వ్యాఖ్యను జోడించారు సుధా. అయితే తన చేయి ఎలా విరిగిందన్నది చెప్పలేదు. ప్రస్తుతం ఆమె ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌ కుమార్‌తో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రీకరణ సమయంలోనే ప్రమాదవశాత్తూ గాయపడినట్లు వార్తలొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని