NTR 30: భావోద్వేగ ప్రయాణం.. ‘ఎన్టీఆర్‌30’

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ఇప్పుడాయన తన 30వ సినిమా కోసం రంగంలోకి దిగారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.

Updated : 24 Mar 2023 07:22 IST

దర్శకుడు కొరటాల శివ

లాంఛనంగా చిత్రం ప్రారంభం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR). ఇప్పుడాయన తన 30వ సినిమా కోసం రంగంలోకి దిగారు. కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఈ సినిమా హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్‌-జాన్వీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాజమౌళి క్లాప్‌ కొట్టారు. కొరటాల శివ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రశాంత్‌ నీల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌తో చేస్తున్న రెండో చిత్రమిది. తను నా సోదరుడు. ఈతరం గొప్ప నటుల్లో ఒకడు. అలాంటి ఎన్టీఆర్‌తో మరోసారి కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు.. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ చిత్ర కథా నేపథ్యం. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక భావోద్వేగ ప్రయాణంలా ఉంటుంది. దీన్ని భారీ స్థాయిలో తీసుకొస్తున్నాం. నా కెరీర్‌లో ఇది ఉత్తమం అవుతుందని అందరికీ మాటిస్తున్నా’’ అన్నారు. ‘‘కొరటాల శివ విజన్‌లో నేనొక చిన్న భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. తారక్‌కు ధన్యవాదాలు. నేను తిరిగి వస్తున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు అనిరుధ్‌. ఈ వేడుకలో కల్యాణ్‌ రామ్‌, దిల్‌రాజు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, అభిషేక్‌ నామా, ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌, సాబు సిరిల్‌, శ్రీకర్‌ ప్రసాద్‌, రత్నవేలు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు