NTR: భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్‌

భయమంటే ఎరుగని మృగాళ్లకు భయాన్ని పరిచయం చేసేందుకు రంగంలోకి దిగారు కథా నాయకుడు ఎన్టీఆర్‌. ఇప్పుడాయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 02 Apr 2023 06:50 IST

భయమంటే ఎరుగని మృగాళ్లకు భయాన్ని పరిచయం చేసేందుకు రంగంలోకి దిగారు కథా నాయకుడు ఎన్టీఆర్‌ (NTR). ఇప్పుడాయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్‌’ లాంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్‌లోకి ఎన్టీఆర్‌ అడుగు పెట్టారు. ఆయన ఈ విషయాన్ని శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. దీంతో పాటు తను సెట్‌లోకి వెళ్లిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘కొరటాల శివతో మళ్లీ సెట్స్‌పైకి రావడం చాలా బాగుంది’’ అంటూ ఆ వీడియోకి ఓ వ్యాఖ్యను జోడించారు తారక్‌. ఇది ఆయనకు 30వ సినిమా. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో రూపొందుతోంది. భయమంటే ఏమిటో తెలియని అక్కడి మృగాళ్లకు భయాన్ని రుచి చూపించేందుకు కథానాయకుడు ఏం చేశాడన్నది ఆసక్తికరం. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని