సంక్షిప్త వార్తలు(2)

గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఎన్‌.ఎస్‌.పొన్‌కుమార్‌ తెరకెక్కించారు.రేవతి శర్మ, పుగాజ్‌, రిచర్డ్‌ ఆష్టన్‌, జాసన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 02 Apr 2023 01:19 IST

 

‘16 ఆగస్టు 1947’న ఏం జరిగింది?

గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఎన్‌.ఎస్‌.పొన్‌కుమార్‌ తెరకెక్కించారు.రేవతి శర్మ, పుగాజ్‌, రిచర్డ్‌ ఆష్టన్‌, జాసన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మురుగదాస్‌ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ టైమ్‌లో పొన్‌కుమార్‌ రాసిన కథ చదివాను. చాలా అద్భుతంగా అనిపించింది. వెంటనే దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. మన భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో 1947 ఆగస్టు 15వ తేదీకి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ఇదీ అదే ఏడాదిలో సాగే కథతోనే ఓ పీరియాడిక్‌ చిత్రంగా రూపొందింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు ఈ మూడు రోజుల కాలంలో సెంఘాడ్‌ అనే మారుమూల గ్రామంలో ఏం జరిగిందన్నది ఇందులో చూపించాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే విషయమే తెలియని ఆ ఊరి వాసులంతా తమ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం బ్రిటిష్‌ వారితో ఎలా పోరాటం చేశారన్నది ఆసక్తికరంగా చూపించాం. ప్రేమ, భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు.. ఇలా అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. త్వరలో ఎన్వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నాను’’ అన్నారు. ‘‘గత వారం ట్రైలర్‌ విడుదలైంది. అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. ఏప్రిల్‌ 14న సినిమా థియేటర్లలోకి వస్తోంది. దాన్నీ అదే విధంగా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు పొన్‌కుమార్‌. హీరో గౌతమ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ.. ‘‘నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది. దీని కోసం  మేమంతా చాలా కష్టపడ్డాం. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశమిచ్చినందుకు మురుగదాస్‌కు కృతజ్ఞతలు. చాలా మంచి చిత్రమిది.  ఈ కథ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. తెలుగు వారికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సినిమా చూశాం. ఇందులోని హీరోయిజం, క్లైమాక్స్‌ చాలా కొత్తగా అనిపించాయి. అందుకే దీన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఠాగూర్‌ మధు. ఈ కార్యక్రమంలో యూసఫ్‌ షేక్‌ పాల్గొన్నారు.


ఉత్కంఠభరిత ప్రయాణం

గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో కాకర్ల శ్రీనివాసు తెరకెక్కించిన ఏక పాత్రాభినయ చిత్రం ‘హలో మీరా’. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘‘విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఓ యువతి చేసే రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తాజాగా సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమా చిత్రీకరించడంపై ప్రశంసలు కురిపించారు’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి ఎస్‌.చిన్న సంగీతమందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని