మధ్య తరగతి జిందగీ

రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్‌ జిందగీ’. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్‌, హర్షవర్ధన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Published : 01 Jun 2023 01:41 IST

రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్‌ జిందగీ’. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్‌, హర్షవర్ధన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పద్మారావ్‌ అబ్బిశెట్టి (పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉమాదేవి, శరత్‌ చంద్ర చల్లపల్లి నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేయడంతోపాటు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజా రవీంద్ర మాట్లాడుతూ ‘‘సమాజంలో చోటు చేసుకునే సమస్యల్ని ఎత్తిచూపే కథ ఇది. ముగ్గురు పిల్లల తండ్రిగా... చాలా రోజుల తర్వాత ఓ పూర్తిస్థాయి పాత్రని పోషిస్తున్నా. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఇలాంటి ఓ మంచి సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ   ‘‘మధ్య తరగతి జీవితాలకి అద్దం పట్టే కథ ఇది. రాయడానికి ఏడాది సమయం పట్టింది. ఈ సినిమాకి కథే హీరో. అందుకు తగ్గట్టుగా మంచి నటులు, సాంకేతిక బృందం కుదిరింది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్‌ చిత్రాల్ని అందించాలనే ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించాం. ‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాస్‌రాజు దగ్గర పనిచేసిన పండు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కథా బలమున్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర నటిస్తూ, మాకు సహకారం అందిస్తున్నార’’న్నారు. ఈ కార్యక్రమంలో నటులు శివచందు, యశస్విని, నీల ప్రియ, ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ స్వయంభు, గీత రచయిత రాంబాబు గోసాల, సహనిర్మాత క్రాంతి ముండ్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని