Siddharth: నాకొక యుద్ధం లాంటి చిత్రమిది

‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలున్న చిత్రం ‘టక్కర్‌’. మంచి స్కేల్‌లో తీసిన యాక్షన్‌ ఫిల్మ్‌లా ఉంటుంది. దీంట్లో ఓ న్యూఏజ్‌ ప్రేమకథను ఎంతో చక్కగా ఇమిడ్చారు.

Updated : 06 Jun 2023 05:05 IST

‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలున్న చిత్రం ‘టక్కర్‌’. మంచి స్కేల్‌లో తీసిన యాక్షన్‌ ఫిల్మ్‌లా ఉంటుంది. దీంట్లో ఓ న్యూఏజ్‌ ప్రేమకథను ఎంతో చక్కగా ఇమిడ్చారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సిద్ధార్థ్‌. ఆయన హీరోగా కార్తీక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన చిత్రమే ‘టక్కర్‌’. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్‌, తరుణ్‌ భాస్కర్‌, వెంకటేష్‌ మహా, నిర్మాత సురేష్‌బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నన్ను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూస్తారు. ఈ చిత్రం నాకొక యుద్ధం లాంటిది. ఈ సినిమా తర్వాత దివ్యాంశకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. తెలుగు సాహిత్యం, కవిత్వం చదివి అది నా లోపలికి వెళ్లిపోయింది. కాబట్టి చెప్పినా చెప్పకున్నా నేను తెలుగు బిడ్డనే. నా నుంచి ఇక గ్యాప్‌ రాదు. రాబోయే 18 నెలల్లో ఆరు సినిమాలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నా. నిర్మాత రామానాయుడుకు నేనెప్పటికీ రుణపడి ఉంటా. కెరీర్‌ ఆరంభంలో ఆయన నన్నెంతో ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో విశ్వజనీనమైన కథ ఉంది. మా గురువు శంకర్‌ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడదే బాటలో శిష్యుడు చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ కాలానికి ఈ చిత్రం ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. ఈ సినిమా అందరి అంచనాలకు మించేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు కార్తీక్‌ జి.క్రిష్‌. ఈ కార్యక్రమంలో టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, దివ్యాంశ కౌశిక్‌ పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని