బాలకృష్ణ.. భగవంత్‌ కేసరి

ఇప్పటి నుంచి ఆట వేరు అంటూ బాలకృష్ణ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నారు అనిల్‌ రావిపూడి. ఆయన దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై బాలకృష్ణ 108వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Published : 09 Jun 2023 06:05 IST

ఇప్పటి నుంచి ఆట వేరు అంటూ బాలకృష్ణ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నారు అనిల్‌ రావిపూడి. ఆయన దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై బాలకృష్ణ 108వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్‌ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ మరో కీలక పాత్రని పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం సినిమా పేరుని ప్రకటించారు. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నట్టే ‘భగవంత్‌ కేసరి’ అనే పేరుని ఈ సినిమాకి ఖరారు చేశారు. ఐ డోంట్‌ కేర్‌... అనేది ఉపశీర్షిక. ‘‘పేరుకు తగ్గట్టే శక్తిమంతమైన కథ, పాత్రలతో రూపొందుతున్న చిత్రమిది. 108 చోట్ల, 108 హోర్డింగ్‌లతో సినిమా పేరుని ప్రకటించాం. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న 108 థియేటర్లలో టీజర్‌ను విడుదల చేయనున్నామ’’ని తెలిపాయి సినీ వర్గాలు.

* బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనపై ‘గ్లోబల్‌ లయన్‌’ పేరుతో ఓ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు ఆయన అభిమాని అనంతపూర్‌ జగన్‌. ఆ పాటను హైదరాబాద్‌లో గురువారం దర్శకులు బి.గోపాల్‌, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ‘‘జగమంతా పలికే మంత్రం జై బాలయ్య.. జనమందరికీ ఒకటే నినాదం జైబాలయ్య’’ అంటూ సాగుతున్న ఈ పాటకు ఈశ్వర్‌ దత్‌ స్వరాలు సమకూర్చగా.. రాంబాబు గోసాల సాహిత్యమందించారు.


వెయ్యి థియేటర్లలో ‘నరసింహనాయుడు’

బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన చిత్రం ‘నరసింహనాయుడు’ని ఈ నెల 10న 4కె డిజిటల్‌ ప్రింట్‌తో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో మరిచిపోలేని చిత్రం ‘నరసింహనాయుడు’. 4కె సాంకేతికతతో రీ రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా మరోసారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మురిపించడం ఖాయం’’ అన్నారు. నిర్మాత మేడికొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంతోనే నేనూ జనాలకి సుపరిచితం అయ్యా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి వెయ్యి థియేటర్లలో విడులదవుతుంది’’ అన్నారు టి.ప్రసన్నకుమార్‌.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు