అటు రక్షకుడు.. ఇటు కర్షకుడు..!

ఏదైనా స్పెషల్‌ డేస్‌ వచ్చాయంటే అవి సినీ ప్రియులకు పండగ రోజులనే చెప్పాలి. ఎందుకంటే పర్వదినాలను పురస్కరించుకుని కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లను ఆయా చిత్రబృందాలు విడుదల చేసి అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. అయితే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని..

Updated : 27 Jan 2020 12:45 IST

ఫస్ట్‌లుక్స్‌తో ‘సీటీమార్‌’

హైదరాబాద్‌: ఏదైనా స్పెషల్‌ డేస్‌ వచ్చాయంటే అవి సినీ ప్రియులకు పండగ రోజులనే చెప్పాలి. ఎందుకంటే పర్వదినాలను పురస్కరించుకుని కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లను ఆయా చిత్రబృందాలు విడుదల చేసి అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. అయితే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆదివారం కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్లతోపాటు సమంత నటించిన ‘జాను’ సినిమా నుంచి రెండో పాటను కూడా విడుదల చేశారు. 

‘రాక్షసుడిని పట్టుకునే రక్షకుడు’ 

సుధీర్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వి’ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోమవారం ఉదయాన్నే విడుదల చేసింది. తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేసిన సుధీర్‌.. ‘తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం.. ‘వి’ సినిమా రక్షకుడు వచ్చేశాడు.’ అని సుధీర్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఇందులో సుధీర్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ప్రతినాయకుడి లక్షణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘శ్రీకారం’ చుట్టనున్న రైతుబిడ్డ

టాలీవుడ్‌ యువ కథానాయకుడు శర్వానంద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్‌ 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్‌.బి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌ని బట్టి చూస్తుంటే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంగా కనిపిస్తోంది. పోస్టర్‌ను షేర్‌ చేసిన చిత్రబృందం..‘ఇతను మన కేశవుల కొడుకు.. పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి’ అని పేర్కొంది. ఈ ఏడాది వేసవి కానుకగా ‘శ్రీకారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘సీటీమార్’ అంటున్న గోపీచంద్‌

టాలీవుడ్‌ కథానాయకుడు గోపీచంద్‌.. సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్‌ కోచ్‌గా కనిపించనున్నారు. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చిత్రబృందం నేడు సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సీటీమార్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్నారు. ఇప్పటికే సంపత్‌నంది-గోపీచంద్‌ కలయికలో ‘గౌతమ్‌నంద‌’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2017లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ‘సీటీమార్‌’ సినిమాతో మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఇటు గోపీచంద్‌తోపాటు అటు దర్శకుడు సంపత్‌ నంది కూడా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని