ఈ పాత్ర చేయడానికి కాస్త భయపడ్డా!

‘‘గ్లామర్‌ పాత్రల కన్నా నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేసినప్పుడే నటిగా సంతృప్తి, ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కుతుంది. అందుకే ఆ తరహా పాత్రలనే ఇష్టపడతా’’ అంటోంది కథానాయిక వర్ష . ‘96’, ‘బిగిల్‌’ వంటి తమిళ చిత్రాల్లో సహాయ నటిగా మెప్పించిన ఈ భామ ఇప్పుడు...

Published : 30 Jan 2020 18:50 IST

‘‘గ్లామర్‌ పాత్రల కన్నా నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేసినప్పుడే నటిగా సంతృప్తి, ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కుతుంది. అందుకే ఆ తరహా పాత్రలనే ఇష్టపడతా’’ అంటోంది కథానాయిక వర్ష . ‘96’, ‘బిగిల్‌’ వంటి తమిళ చిత్రాల్లో సహాయ నటిగా మెప్పించిన ఈ భామ ఇప్పుడు ‘చూసీ చూడంగానే’ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగుపెడుతోంది. శివ కందుకూరి కథానాయకుడు. శేష సింధు రావ్‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది వర్ష. 

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

వర్ష: ఇందులో నేను శ్రుతి అనే యువతి పాత్ర పోషిస్తున్నా. డ్రమ్మర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కనిపిస్తా. కథానాయకుడితో సరిసమానమైన ప్రాధాన్యమున్న పాత్ర. 

డ్రమ్మర్‌గా కనిపించేందుకు ఎలా సిద్ధమయ్యారు?

వర్ష: డ్రమ్మర్‌ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త భయపడ్డా. ఎందుకంటే ఇప్పటి వరకే నేను చేసినవన్నీ సున్నితమైన పాత్రలు. ఈ తరహా పాత్ర చెయ్యగలనో లేదో అనుకున్నా. కానీ, నిర్మాతలు, దర్శకురాలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టేముందు కాస్త శిక్షణ కూడా తీసుకున్నా.

‘చూసీ చూడంగానే’ కథ ఏంటి?

వర్ష: ఈ కథలో చాలా కోణాలున్నాయి. శేష సింధు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

హీరో శివ గురించి?

వర్ష: శివతో కలిసి పనిచేయడం సంతోషం అనిపించింది. అటు పెద్ద హీరోలతో.. ఇటు కొత్తవాళ్లతో చేస్తున్నప్పుడు ఆ అనుభవం భిన్నంగా అనిపిస్తుంది. 

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

వర్ష: నాకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. మైక్రో బయాలజీ పూర్తయ్యాక ‘వెట్రివేల్‌’ అనే తమిళ చిత్రంతో వెండితెరపైకి వచ్చా. మలయాళంలోనూ మూడు చిత్రాలు చేశా. 

మీ తర్వాతి చిత్రాలు ఏంటి?

వర్ష: ప్రస్తుతం తెలుగులో ‘జాను’ చేశా. తమిళ ‘96’లో నేను పోషించిన పాత్రనే ఇందులోనూ చేశా. ఆనంద్‌ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నా. అందులో నేను గుంటూరు అమ్మాయిగా నటిస్తున్నా. ఆ పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్తున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని