‘ఒక్కడు’కు ఆ టైటిల్‌ పెడదామనుకున్నారు!

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విజయంతో జోరుమీదున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2003లోనూ

Updated : 16 Jan 2020 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విజయంతో జోరుమీదున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2003లోనూ సంక్రాంతికి సంబరాలు చేసుకున్నారు మహేశ్‌ అభిమానులు. గుణ శేఖర్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఒక్కడు’ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, మహేశ్‌ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఈ చిత్రంగా నిలిచింది. కాగా, ‘ఒక్కడు’ విడుదలై తాజాగా  17 సంవత్సరాలు(జనవరి 15కు) పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాకు తొలుత వేరే టైటిల్‌ అనుకున్నారట!

చిరంజీవితో తీసిన ‘మృగరాజు’ ఫ్లాప్‌. గుణశేఖర్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మంచి కథతో సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్నారు. ఒకరోజు పేపర్లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ల తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేకపోవడం, గోపీచంద్‌ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్‌ ఛాంపియన్‌గా ఎదగడం ఇదంతా గుణశేఖర్‌కు ఎంతో ఆసక్తికరంగా, స్ఫూర్తిమంతంగా అనిపించింది. దీంతో తన కథలో హీరో కూడా ఇలాంటివాడిగానే ఉండాలని, తండ్రి వద్దంటున్నా స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటాడని స్క్రిప్ట్‌ రాసుకున్నారు. వెళ్లి మహేశ్‌ను కలిసి కథ చెప్పి ఒప్పించారు. నిర్మాతగా ఎమ్మెస్‌ రాజు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మిగిలింది చార్మినార్‌ సెట్‌. అందుకు కూడా ఎమ్మెస్‌ రాజు ఒప్పుకొన్నారు. ఇక కథానాయికగా భూమికను తీసుకున్నారు. అప్పటికి భూమిక ‘యువకుడు’ చేసింది. శేఖర్‌.వి.జోసెఫ్‌ కెమెరామెన్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ.. పరుచూరి బ్రదర్స్‌ రచయితలు.. ఆర్ట్‌ డైరెక్టర్‌గా అశోక్‌.. టీమ్‌ అంతా ఒకే. ఇక మిగిలింది టైటిల్‌.

‘అతడే ఆమె సైన్యం’. ఇది గుణశేఖర్‌ మొదటి నుంచి అనుకుంటున్న టైటిల్‌. కానీ, ఎవరో రిజిస్టర్‌ చేసేశారు. ఎంత బతిమాలినా ఇవ్వలేదు. ఇంకో టైటిల్‌ వెతుక్కోవాల్సి వచ్చింది. ‘కబడ్డీ’ అని పెడదామనుకున్నారు. చివరకు ‘ఒక్కడు’ పేరు నిర్ణయించారు. ఒక్కరు కూడా నో చెప్పలేదు. అందరికీ నచ్చింది. హైదరాబాద్‌ శివార్లలో చార్మినార్‌ సెట్‌ వేసి సినిమా తీశారు. అలా ‘ఒక్కడు’ సెట్స్‌పైకి వెళ్లింది. ‘‘మృగరాజు’లాంటి ఫ్లాప్‌ తీసిన దర్శకుడు, ‘దేవి పుత్రుడు’లాంటి యావరేజ్‌ సినిమా తీసిన నిర్మాత కలిసి మహేశ్‌తో సినిమా తీస్తున్నారా? పాపం.. మహేశ్‌ పని గోవిందా!’’ అని ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. మహేశ్‌-గుణశేఖర్‌ అవేవీ పట్టించుకోలేదు. చార్మినార్‌ సాక్షిగా విడుదలైన ‘ఒక్కడు’ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మహేశ్‌ నటన, ప్రకాష్‌రాజ్‌ విలనిజం, పాటలు అన్నీ ప్రేక్షకులను అలరించాయి. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని