NTR: ఆ వ్యక్తి ఎన్టీఆర్‌ కాదని తెలిసిపోయింది!

NTR తొలిసారి రెండు పాత్రలు చేసిన ‘రాముడు-భీముడు’లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

Published : 19 Mar 2023 12:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెరపై తమ అభిమాన కథానాయకుడు నట విశ్వరూపం చూపిస్తుంటే అభిమానులకు వచ్చే మజానే వేరు. అదే కథానాయకుడు రెండు పాత్రలు పోషిస్తే.. భలే సరదాగా అనిపిస్తుంది. నాటి ఎన్టీఆర్‌ (NTR) నుంచి నేటి ఎన్టీఆర్‌ వరకూ అందరు కథానాయకులు ఈ ఫార్ములాలో సినిమాలు చేసిన వారే. ఇప్పుడంటే సీజే, వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా ఎన్ని పాత్రలైనా సృష్టించవచ్చు. కానీ, తొలినాళ్లలో ద్విపాత్రాభినయం అంటే కెమెరా ట్రిక్, స్ప్లిట్‌ విధానం ఉపయోగించేవాళ్లు. ఒకేసారి ఇద్దరు కనిపించాలంటే మాత్రం ఇంకో పాత్రకు మాస్క్ వేసి, లేదా చాలా దగ్గర పోలికలున్న వ్యక్తితో లాంగ్‌ షాట్‌లో సన్నివేశాలు తీసేవాళ్లు. కొన్నిసార్లు రెండో పాత్ర చేసిన వ్యక్తి తమ హీరో కాదని అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలాంటి సంఘటనే ఎన్టీఆర్‌ తొలిసారి రెండు పాత్రలు చేసిన ‘రాముడు-భీముడు’ (1964)కి జరిగింది.

‘రాముడు-భీముడు’ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రామానాయుడు నిర్మించారు. మధ్య మధ్యలో రెండు పాత్రలు అప్పుడప్పుడూ కలిసినా, చిత్రం చివర్లో మళ్లీ తెరపై కలిసి కనిపించాలి. అప్పుడు ఎన్టీఆర్‌ కాల్‌షీట్‌ సర్దుబాటు చెయ్యలేనంత బిజీగా ఉన్నారు. రామానాయుడుకు ఆయన డేట్స్‌ కావాలి. సినిమా విడుదల తేదీ కూడా అనుకున్నారు. అతికష్టం మీద రామారావు ఎవరి దగ్గర్నో ఒక్క పూట కాల్‌షీట్‌ను తీసుకుని రాగలనన్నారు. చివరి దృశ్యంలో రాముడు, భీముడు కలుసుకునే షాట్స్‌లో రామారావు కనిపిస్తున్నా, రెండో పాత్రలో సత్యనారాయణ కనిపించారు! లాంగ్‌ షాట్‌లో తీసినా, సత్యనారాయణ స్పష్టంగా తెలిశారు. రామానాయుడుని, ఎందుకలా జరిగిందని అడిగితే ‘రామారావు గారు ఒక్క పూట మాత్రమే కాల్‌షీట్‌ ఇచ్చారు. రెండు పాత్రలంటే స్ప్లిట్‌‌ విధానంలో ‘మాస్క్‌’ వేసి తియ్యాలి. గెటప్‌ మార్చుకోవాలి. చాలా టైమ్‌ పడుతుంది. ఒక్క రోజులో తియ్యాలన్నా కష్టమే. ఏం చెయ్యాలి?... లాభం లేదని రామారావు గారికి దగ్గర పోలికలతో ఉంటారని, డూప్‌’గా నటించడానికి సత్యనారాయణని అడిగి తీసుకొచ్చాం. కానీ, సత్యనారాయణ ప్రేక్షకులకి తెలిసిన నటుడు గనక, కొన్ని క్షణాలే ఆ షాట్‌లో ప్రేక్షకులు గుర్తుపట్టారు. వ్యవధి చాలక అలా చెయ్యవలసి వచ్చింది’ అని చెప్పారు. అయితే, అదొక లోపంగా విమర్శించలేదు. ‘రాముడు భీముడు’ విజయఢంకా మోగించడానికి ఆ షాటు ఏ ఇబ్బందీ పెట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని